ఆజ్యం ఈయన కూడా పోశారట

కర్ణాటకలో అసమ్మతి ఇంత త్వరగా బయటపడటానికి అనేక కారణాలు విన్పిస్తున్నాయి. ఒకటి కుమారస్వామి ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడం, రెండోది కాంగ్రెస్ అధిష్టానం సయితం పదవుల విషయంలో అన్యాయం చేయడం. [more]

Update: 2019-07-20 18:29 GMT

కర్ణాటకలో అసమ్మతి ఇంత త్వరగా బయటపడటానికి అనేక కారణాలు విన్పిస్తున్నాయి. ఒకటి కుమారస్వామి ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడం, రెండోది కాంగ్రెస్ అధిష్టానం సయితం పదవుల విషయంలో అన్యాయం చేయడం. ఇవి అందరికీ తెలిసినవే. అయితే ఇంత తొందరగా అసంతృప్త నేతలు బయటపడటానికి మరో బలమైన కారణం కూడా ఉందంటున్నారు. ఆయనే ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు రేవణ్ణ. రేవణ్ణ వైఖరితో విసిగిపోయి అసంతృప్త ఎమ్మెల్యేలు ముంబయి బాట పట్టారన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి.

వివిధ కారణాలతో పాటు….

కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి అనేక కారణాలున్నాయి. రెండోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం, కాంగ్రెస్ పార్టీ ఇక జాతీయ స్థాయిలో కోలుకోలేదని భావించడం ఒక కారణంతో ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీవైపు మొగ్గు చూపి ఉండవచ్చు. కానీ బెంగళూరు నగరంలో ఉన్న ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు మంత్రి రేవణ్ణ వైఖరితోనే విసిగిపోయి ఫిరాయించడానికి రెడీ అయపోయారన్నది వాస్తవమని కాంగ్రెస్ నేతలే బహిరంగంగా చెబుతున్నారు.

నగర ఎమ్మెల్యేల్లో….

సంకీర్ణ సర్కార్ ఏర్పడి కేవలం ఏడాది మాత్రమే దాటింది. బెంగుళూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికంగా ఉన్నారు. అయితే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ శాఖకు చెందిన మంత్రి రేవణ్ణ శాసనసభ్యులెవరినీ సంప్రదించకుండానే పనులు మొదలెట్టేశారట. అసలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంటేనే చిరాకు పడేవారట. దాదాపు 20 వేల కోట్లపైచిలుకుతో నిర్మించనున్న రాజకుమార్ రోడ్డు నుంచి విమానాశ్రయం వరకూ ఎలివేటర్ కారిడార్ పనులను ప్రభుత్వం ఆమోదించినట్లు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యలకే తెలియదంటే ఇంతకన్నా ఘోరం ఏముంటుందని కొందరు బహిరంగంగా చెబుతున్నారు.

అన్ని కలసి….

ప్రభుత్వంలో రేవణ్ణ పెత్తనం ఎక్కువయిందన్న ఆరోపణలు గత కొంతకాలంగా విన్పిస్తున్నాయి. కాంగ్రెస్ శాసనసభ్యుల్లో ఉన్న అసంతృప్తి ఇన్ ఛార్జిగా ఉన్న పరమేశ్వర ముఖ్యమంత్రి కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. అసలే తక్కువ స్థానాలను సాధించి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారన్న అక్కసుతో రగలిపోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రేవణ్ణ వ్యవహారం మరింత పిచ్చి రేపింది. దీంతో తాడో పేడో తేల్చుకునేందుకు ముంబయి బయలుదేరి వెళ్లారు. రేవణ్ణ విషయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News