ఇప్పటికైతే ఢోకాలేదు…కానీ…??

మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పను దెబ్బేశాయా? ఆయన అనుకున్నది సాధించలేకపోవడానికి ఆ ఫలితాలు కూడా కారణమా? కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి [more]

Update: 2019-01-03 18:29 GMT

మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పను దెబ్బేశాయా? ఆయన అనుకున్నది సాధించలేకపోవడానికి ఆ ఫలితాలు కూడా కారణమా? కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి వేసి వెనువెంటనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలన్న యడ్యూరప్ప కోరిక నెరవేరడం కొంచెం కష్టంగానే ఉంది. పరిస్థితులను బట్టి చూస్తుంటే కర్ణాటకలోని కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ సర్కార్ కు లోక్ సభ ఎన్నికల వరకూ ఇంక ముప్పులేనట్లే భావించవచ్చు. ‘‘ఆపరేషన్ కమల’’ ను ప్రారంభించినా ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. మరో వారం రోజుల్లో సంకీర్ణ సర్కార్ కుప్పకూలుతుందని కమలం పార్టీ నేతలు చెప్పిన జోస్యాలు ఇప్పుడిప్పుడే ఫలించే పరిస్థితులయితే లేవన్నది సుస్పష్టం.

విస్తరణ తర్వాత….

గత నెల22న కర్ణాటక మంత్రి వర్గాన్ని విస్తరించారు. అయితే విస్తరణ తర్వాత పెద్దయెత్తున అసంతృప్తి బయటపడుతుందని, అసంతృప్త నేతలందరూ కాషాయం వైపు చూస్తారని బీజేపీ రాష్ట్ర నేతలు విశ్వసించారు. నిజమే… అసమ్మతి బయటపడింది. రమేష్ జార్ఖిహోళి లాంటి నేతలు కొన్నిరోజుల పాటు కన్పించకుండా పోవడం ఇందుకు ఊతమిచ్చింది. ఆయన బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారమూ జోరుగా సాగింది. రమేష్ జార్ఖిహోళితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా గాయబ్ కావడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది.

బీజేపీలో చేరినా…

కానీ అసమ్మతి నేతలు ఉన్నమాట వాస్తవమే గాని బీజేపీలో చేరాలన్న కోరిక వారిలో కన్పించడం లేదని దాదాపు తెలిసిపోయింది. రమేష్ జార్ఖిహోళి వెంట దాదాపు పది మంది ఎమ్మెల్యేలు వస్తారనుకున్నారు. రమేష్ జార్ఖిహోళి సయితం బీజేపీ నేతలకు టచ్ లోకి వెళ్లారు. నాలుగు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని రమేష్ జార్ఖిహోళి విస్తరణ జరిగిన మరునాడు ప్రకటించివెళ్లారు. కానీ ఇప్పటికి పది రోజులు గడుస్తున్నా ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రమేష్ జార్ఖిహోళి వెంట నడిచే నేతలు లేరన్నది ఇప్పుడు టాక్. పది మంది వరకూ ఉంటారన్న అంచనా ఒట్టిదేనని బీజేపీ నేతలూ గ్రహించారు. దీంతో కర్ణాటకలోని కాషాయదళం డీలా పడింది.

లోక్ సభ ఎన్నికల తర్వాత….

అధికారంలో ఉన్న పార్టీని కాదని వేరొక పార్టీకి వెళ్లి ప్రయోజనం ఉండదని, పార్టీలోనే ఉండి అసమ్మతిని తెలియజేస్తూ తమ పనులను కానిచ్చుకోవాలని కొందరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో తిరిగి మోదీ సర్కార్ అధికారంలోకి వస్తే అప్పుడు చూద్దామన్న ఆలోచనలో ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు అంచనా. బీజేపీలోకి ఇప్పుడు వచ్చే నేతలు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి రావాలన్న కమలం పార్టీ కేంద్ర నాయకత్వం ప్రతిపాదన కూడా కాంగ్రెస్ ఎమ్మల్యేలు అటు వైపు చూడకపోవడానికి కారణంగా చూపుతున్నారు. రాజీనామాలు చేస్తు శాసనసభలో బీజేపీ అధికారానికి వచ్చే బలం ఉంటుంది. అప్పటికప్పుడు ప్రభుత్వాన్నికూలదూసి తాము పీఠం ఎక్కవచ్చన్న అంచనా వేశారు. కానీ శాసనసభ్యత్వాలకు రాజీనామాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడతో ప్రస్తుతానికి లోక్ సభ ఎన్నికల వరకూ సంకీర్ణ సర్కార్ కు ఢోకా లేనట్లేనన్నది విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News