ఆయన భయపడుతున్నదందుకేనా…?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టం వచ్చి పడింది. పార్లమెంటు ఎన్నికల పరీక్షను ఎదురుకోనున్న ఆ పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు దొరకడం లేదు. అసెంబ్లీ [more]

Update: 2019-03-04 00:30 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టం వచ్చి పడింది. పార్లమెంటు ఎన్నికల పరీక్షను ఎదురుకోనున్న ఆ పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు దొరకడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా ఉన్న నియోజకవర్గాల్లో పోటీకి ఎవరూ మొగ్గు చూపడం లేదు. ఇటువంటి నియోజకవర్గాల్లో ముందుంది నిజామాబాద్ పార్లమెంటు స్థానం. ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కల్వకుంట్ల కవిత ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఒక లక్షా 67 వేల భారీ మెజారిటీతో కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ పై ఆమె విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనూ ఆమె మరోసారి పోటీకి దిగనున్నారు. దీంతో కవితపై పోటీ చేసేందుకు మధుయాష్కి వెనకడుగు వేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇందుకు కారణమట.

కవితను ఎదుర్కోవడం కష్టమే…

2004, 2009లో నిజామాబాద్ ఎంపీగా రెండుసార్లు గెలిచారు మధుయాష్కి గౌడ్. 2014లో ఆయనపై కవిత మొదటిసారి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో ఈ పార్లమెంటు స్థానం పరిధిలోని జగిత్యాల మినహా మిగతా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. జగిత్యాలలో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. అప్పుడే కవితకు లక్షా 67 వేల మెజారిటీ వచ్చింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఓటర్ల నాడి అలాగే ఉంటా టీఆర్ఎస్ నుంచి కవిత రెండు లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించవచ్చు. అసెంబ్లీ ఎన్నిల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని మొత్తం ఏడు స్థానాలనూ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో టీఆర్ఎస్ ఇక్కడ ఎదురులేదు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇక, రెండుసార్లు ఎంపీగా పనిచేసి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మధుయాష్కి దగ్గరయ్యారు. రాహుల్ కోర్ టీమ్ లో మెంబర్ గా ఉన్న ఆయన జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈసారి ఆయన గెలిచి, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేంద్రమంత్రి కూడా అవుతారనే అంచనాలు ఉన్నాయి.

సేఫ్ సీట్ వెతుక్కున్న మధుయాష్కి….

ఈ నేపథ్యంలో నిజామాబాద్ నుంచి పోటీ చేస్తే ఓడిపోతానని ఆయన భావిస్తున్నారట. ఆయన ఈ ఐదేళ్లుగా కూడా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనలేదు. ప్రజల్లోనూ లేరు. ఇదే సమయంలో బీజేపీ నుంచి పోటీ చేయనున్న డి.శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి అర్వింద్ నిత్యం ప్రజల్లో ఉంటూ కవితకు బలమైన ప్రత్యర్థిగా మారారు. ఇక్కడ బీజేపీకి చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఓటు బ్యాంకు ఉంది. దీంతో కవిత వర్సెస్ అర్వింద్ గా పోటీ మారుతోంది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని భావిస్తున్న మధుయాష్కి సేఫ్ సీట్ వెతుక్కున్నారట. ఇందుకు ఆయన భువనగిరి స్థానాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలనే సాధించింది. కొద్దిగా కష్టపడితే కాంగ్రెస్ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు. దీంతో మధు యాష్కి ఈ సీటును సెలక్ట్ చేసుకున్నారు. ఆయన స్వస్థలం కూడా ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి గౌడ్ సామాజకవర్గానికే చెందిన నర్సయ్య గౌడ్ పోటీలో ఉండటంతో తానే సరైన అభ్యర్థిని అని మధుయాష్కి చెబుతున్నారు. పార్టీలో పలుకుబడి మెండుగా ఉండటంతో ఆయనకు ఈ టిక్కెట్ దక్కవచ్చు అంటున్నారు. కానీ, స్థానిక నేతలు మాత్రం ఆయనకు టిక్కెట్ ఇవ్వవద్దు అంటున్నారు. మొత్తానికి కవితకు భయపడి మధుయాష్కి సేఫ్ సీట్ వెతుక్కునారన్నమాట.

Tags:    

Similar News