వీళ్ళకు కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చేశారు ?

రాజకీయాల్లో రిటైర్మెంట్లు ఉండవు, ఏకంగా కాలం చేయడమే. అంతదాకా రాజకీయంగా ఏదో పదవిని పట్టుకుని ఊరేగడం నేతాశ్రీలకు అలవాటు అయిపోయింది. ఇక టీడీపీలో చూస్తే పైలా పచ్చీస్ [more]

Update: 2021-03-27 02:00 GMT

రాజకీయాల్లో రిటైర్మెంట్లు ఉండవు, ఏకంగా కాలం చేయడమే. అంతదాకా రాజకీయంగా ఏదో పదవిని పట్టుకుని ఊరేగడం నేతాశ్రీలకు అలవాటు అయిపోయింది. ఇక టీడీపీలో చూస్తే పైలా పచ్చీస్ వయసులో రాజకీయాల్లోకి వచ్చిన వారంతా ఇపుడు షష్టి పూర్తి ఏజ్ దాటేసినా మేమే సీనియర్లం అంటూ హడావుడి చేస్తున్నారు. అలాంటి వారికి 2019 ఎన్నికలు వార్నింగ్ ఇస్తే ఇపుడు ఏకంగా రిటైర్మెంట్ కూడా ఇచ్చేశాయి.

అదే బెస్ట్….

టీడీపీలో సీనియర్లు అనగానే విజయనగరం మహారాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఠక్కున గుర్తుకు వస్తారు. ఆయనది కూడా నాలుగు దశాబ్దాలకు పైగా పండిన రాజకీయం. ఆయన తాజాగా మునిసిపల్ ఎన్నికల్లో ప్రచారానికి రోడ్ల మీదకు వచ్చారు. జనాలను కలసి ఓటేయాలని అభ్యర్ధించారు. కానీ ఓటర్లు కరుణించలేదు. ఇక విశాఖలో చూసుకుంటే సీనియర్ మోస్ట్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయన కుటుంబం దశాబ్దాలుగా నర్శీపట్నాన్ని ఏలుతోంది. అటువంటిది తొలిసారిగా భారీ ఓటమి ఎదురైంది. ఈ ఒక్కసారి తన మాట విని ఓటేస్తే రాజకీయాల నుంచి విరమించుకుంటానని అయ్యన్న చెప్పినా కూడా జనాలు వినలేదు. మరి దాని అర్ధమేటి అని అయ్యన్నే ఆత్మపరిశీలన చేసుకోవాలేమో.

ఇక చాలించాలా…?

విశాఖను అంటుకునే ఉన్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు. ఆయన సొంత ఇలాకా తుని మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగితే ముప్పయికి ముప్పై వైసీపీ గెలుచుకుంది. అంటే ఇక్కడ టీడీపీకి గుండు సున్నా వచ్చింది అన్న మాట. మరి దశాబ్దాలుగా మంత్రి పదవిని అనుభవిస్తూ తునిలో యనమల రాజకీయంగా సత్తా చాటిందేంటి అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఈయనే కాదు, ఇంకా ముందుకు వెళ్తే ప్రతీ జిల్లాలో టీడీపీకి సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఎక్కువగానే ఉన్నారు. వీరంతా కూడా డెబ్బై పడిలో ఉన్నారు. వీరి రాజకీయం చూస్తే గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. వైసీపీ లో కొత్తతరం అవతల వైపు కనిపిస్తోంది. దాంతో 2019 లో కాకపోయినా ఈసారి దెబ్బకు ఇక చాలు పాలిటిక్స్ అని వీరు అంటే బెటర్ అన్న మాట అయితే ఉంది.

అందుకుంటారా …?

సరే సీనియర్లు ఇంటికి వెళ్తారు. కానీ జూనియర్లు అందుకుని టీడీపీని నిలబెడతారా అంటే అది కూడా పెద్ద ప్రశ్నగానే ఉంది. చంద్రబాబు యువతరానికి ప్రోత్సాహం అంటే వీరి వారసులకే పార్టీ పదవులు పంచారు. ఆ విధంగా చూస్తే ఆ కుటుంబాల నుంచే మళ్లీ పార్టీ నాయకులు కనిపిస్తారు. జనాలు వద్దు అనుకుంటున్నది కుటుంబ రాజకీయాలను కూడా. అందువల్ల టీడీపీ జెండా పట్టుకుని పనిచేసే వారికే పదవులు ఇస్తే యువతకు ఆ విధంగా న్యాయం జరుగుతుంది. పాత వాసనలు, వారసత్వాలు లేని చోట మాత్రమే టీడీపీకి ఏమైనా ఎదిగే స్కోప్ ఉందేమో అని అంటున్నారు. మరి అలా చేయడానికి నాయకులు కానీ అధినాయకుడు కానీ సిధ్ధమేనా.

Tags:    

Similar News