మంత్రిగా తీసేసినా పరవాలేదు… ఆ పదవి ఇవ్వండి.. ప్లీజ్

ఏపీ రాజ‌కీయాల్లో నేత‌లు కొంద‌రు.. ముఖ్యంగా హిందూ ఆరాధ‌కులు ఒక వ‌య‌సుకు వ‌చ్చిన త‌ర్వాత‌.. తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం చైర్మన్‌గా ఒక్క‌రోజైనా చేయాల‌ని భావిస్తారు. అయితే.. వీరిలో [more]

Update: 2021-01-27 09:30 GMT

ఏపీ రాజ‌కీయాల్లో నేత‌లు కొంద‌రు.. ముఖ్యంగా హిందూ ఆరాధ‌కులు ఒక వ‌య‌సుకు వ‌చ్చిన త‌ర్వాత‌.. తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం చైర్మన్‌గా ఒక్క‌రోజైనా చేయాల‌ని భావిస్తారు. అయితే.. వీరిలో కొంద‌రికి అవ‌కాశం వ‌చ్చినా.. చాలా మందికి మాత్రం ఈ అవ‌కాశం ద‌క్కడం అసంభవం. గ‌తంలో టీడీపీలో ఉన్న దివంగ‌త మాజీ ఎంపీ డీకే ఆదికేశ‌వులు నాయుడు టీటీడీ చైర్మన్ అవ్వాల‌ని ఎన్నో క‌ల‌లు క‌న్నారు. టీడీపీలో ఆ ఛాన్స్ రాక ఆయ‌న కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇచ్చి వైఎస్ ద‌య‌తో ఆ ప‌ద‌వి చేప‌ట్టారు. ఇక మ‌రో నేత చ‌ద‌ల‌వాడ కృష్ణమూర్తి సైతం త‌న చిర‌కాల కోరిక టీడీపీ హ‌యాంలో తీర్చుకున్నారు.

ప్రముఖ వ్యాపారిగానూ…..

ఇక మ‌రో సీనియ‌ర్ నేత రాయ‌పాటి సాంబ‌శివ‌రావు.. టీటీడీ బోర్డు చైర్మన్ కోసం తాప‌త్రయ ప‌డ్డారు. కాంగ్రెస్‌లో ఆయ‌న కోరిక తీర‌లేదు. చివ‌ర‌కు టీడీపీలోకి వ‌చ్చి ఎంపీ అయ్యాక కూడా ఈ విష‌యంలో అనేక సార్లు చంద్రబాబు వ‌ద్ద రిక్వెస్ట్‌లు పెట్టారు. స‌హ‌జంగానే ఒక వ‌య‌సుకు వ‌చ్చేసిన వారంతా బోర్డు చైర్మన్‌లుగా ఉండాల‌ని కోరుకోవ‌డంలో త‌ప్పులేదు. కానీ, అది ల‌భిస్తుందా? అన్నది ప్రశ్న. తాజా విష‌యానికి వ‌స్తే జ‌గ‌న్ కేబినెట్‌ మంత్రి ఒకాయ‌న‌ టీటీడీ బోర్డు చైర్మన్ ప‌ద‌వి కోసం ప్రయ‌త్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆయ‌న‌.. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ప్రముఖ వ్యాపారిగా కూడా గుర్తింపు పొందారు.

మంత్రి పదవి పోయినా…?

అయితే జ‌గ‌న్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆయ‌న‌పై కొన్నాళ్లుగా విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు కాక‌పోయినా.. మ‌రి కొద్ది నెల‌ల్లో జ‌ర‌గ‌బోయే మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌లో ప‌ద‌వి పోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఏమీ బాధ‌ప‌డ‌డం లేదు. కానీ, బోర్డు చైర్మన్ గిరీ ఇవ్వాల‌నే కోరుతున్నారు. ఇటీవ‌ల కాలంంలో సీఎం జ‌గ‌న్ ఎక్కడ ఉంటే.. అక్కడ ప్రత్యక్ష మ‌వుతున్నారు ఆ మంత్రిగారు. అవ‌స‌ర‌మైతే.. మంత్రి ప‌ద‌వి పోనీ.. కానీ, టీటీడీ బోర్డు ఛాన్స్ మాత్రం ఇవ్వాలి.. అని ఆయ‌న ప‌రోక్షంగా వ్యాఖ్యలు సంధిస్తున్నారు.

వైవీ తర్వాత తనకివ్వాలంటూ…?

కొన్ని నెల‌లుగా ఇదే విష‌యంపై సంబంధిత అధికారుల‌తోనూ ఆయ‌న ట‌చ్‌లో ఉన్నార‌ని స‌మాచారం. ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉన్నారు. కానీ, ఆయ‌నకు ప్రత్యక్ష రాజ‌కీయాలంటే ఎంతో ఇష్టం.. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప‌ద‌వీ కాలం ముగిసిన త‌ర్వాత‌.. త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్నార‌ట మంత్రిగారు. ప్రస్తుతం వైసీపీ నేత‌ల మ‌ధ్య చాలా చాలా ర‌హ‌స్యంగా ఈ వార్త పై చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News