ఇక నో యాజిటేషన్స్.. ఓన్లీ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్యునిస్టులు దాదాపుగా కనుమరుగై పోయారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ పార్టీలు పంథాను మార్చుకోకపోవడంతో తెలంగాణ, ఏపీల్లో కమ్యునిస్టు పార్టీలు నామమాత్రంగానే మిగిలాయి. [more]

Update: 2020-07-20 09:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్యునిస్టులు దాదాపుగా కనుమరుగై పోయారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ పార్టీలు పంథాను మార్చుకోకపోవడంతో తెలంగాణ, ఏపీల్లో కమ్యునిస్టు పార్టీలు నామమాత్రంగానే మిగిలాయి. భవిష్యత్ లోనూ తోక పార్టీలుగానే ఉండిపోతాయన్నది వాస్తవం. అయితే ఏ సమస్య వచ్చినా కమ్యునిస్టులు తమకు అండగా ఉంటారన్నది ప్రజలకున్న నమ్మకం. కమ్యునిస్టు పార్టీలు ప్రజా సమస్యల విషయంలో రాజీపడవు.

ప్రజాసమస్యలపై…..

ఎన్నికల్లో ఓట్లు పడకపోయినా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. రోడ్డు మీదకు వచ్చి యాగీ యాగీ చేస్తాయి. అనేక సంఘటనల్లో కమ్యునిస్టుల దెబ్బకు ప్రభుత్వాలు దిగిరాక తప్పలేదు. కానీ గత ఏడాది కాలం నుంచి కమ్యునిస్టు పార్టీలు ఉద్యమ బాటను విడిచిపెట్టాయనే చెప్పాలి. ఇందుకు కరోనా కూడా ఒక కారణమని చెప్పకతప్పదు. గత ఆరు నెలల నుంచి కమ్యునిస్టు పార్టీలు ముఖ్యమంత్రులు లేఖలు రాయడానికే పరిమితమయ్యాయి.

లేఖల ద్వారానే…..

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితి లేదు. దీంతో తెలంగాణలోని సీపీఐ కార్యదర్శి ముఖ్యమంత్రికి వివిధ సమస్యలపై 70కి పైగా లేఖలు రాశారు. సీపీఎం కార్యదర్శి సయితం దాదాపు పాతిక లేఖలు రాశారు. అయితే ఈ లేఖలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో వారు ఇటు ఉద్యమం చేయలేక, అటు సమస్యలు పాతపడి పోతుండటంతో కమ్యునిస్టు పార్టీ నేతలు తలలుపట్టుకుంటున్నారు.

ఏపీలోనూ……

ఆంధ్రప్రదేశ్ లో కూడా సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఏపీ సీఎం జగన్ కు రోజుకు ఒక లేఖ రాస్తున్నారు. వలస కార్మికుల అంశం నుంచి ఉపాధ్యాయుల సమస్య వరకూ రామకృష్ణ లేఖల ద్వారానే కోరుతున్నారు. అమరావతి రాజధాని అంశం, ఇళ్ల స్థలాల పంపిణీ, కోర్టు కేసుల వంటి వాటిపై కమ్యునిస్టు పార్టీలు ఏపీలోనూ లేఖలకే పరిమితమయ్యాయి. మొత్తం మీద ఒకప్పడు వీధుల్లో కన్పించే ఎర్రజెండాలు ఇప్పడు కనుమరుగై పోయాయి. రానున్న రోజుల్లో కమ్యునిస్టు పార్టీలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మనుగడే కష్టమవుతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News