సొంత పార్టీ ఎంపీనే కేసీఆర్ టార్గెట్ చేశారా..!

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇదే విష‌యాన్ని ఒక‌టి రెండుసార్లు ఆయ‌న విస్ప‌ష్టంగా కూడా తెలిపారు. అయితే [more]

Update: 2019-02-08 18:29 GMT

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇదే విష‌యాన్ని ఒక‌టి రెండుసార్లు ఆయ‌న విస్ప‌ష్టంగా కూడా తెలిపారు. అయితే కేసీఆర్ ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు అనే దానిపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వెలువ‌డ్డాయి. ఆయ‌న మెద‌క్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తార‌ని.. ఆ త‌ర్వాత న‌ల్గొండ అని.. ఇప్పుడు తాజాగా ఖ‌మ్మం ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఖ‌మ్మం నుంచి ఎందుకు పోటీ చేస్తార‌న్న అంశంపై ప‌లువురు రాజ‌కీయ‌నేత‌లు వివిధ ర‌కాల కార‌ణాల‌ను చూపుతున్నారు. ఇటీవల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం ఉమ్మ‌డి జిల్లాలో టీఆర్ఎస్ కేవ‌లం ఒక సీటును మాత్ర‌మే గెలుచుకోగ‌లిగింది. రెండు టీడీపీ గెలుచుకోగా… మిగ‌తావి కాంగ్రెస్ వశం చేసుకుంది. వైరా నుంచి స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా గెలిచిన రాములు నాయ‌క్ త‌ర్వాత‌ టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు.

ముందు నుంచీ బ‌ల‌హీనంగా..

ఖ‌మ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ప‌ట్టు సాధించ‌లేదు. మ‌రీ ముఖ్యంగా ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ దెబ్బ‌తిన‌డానికి పార్టీలోని అంత‌ర్గ‌త క‌ల‌హాలే కార‌ణ‌మ‌ని సీఎంకు రిపోర్టు వెళ్లిందంట‌. పార్టీ వ‌ర్గాల‌తో పాటు ఇంట‌లిజెన్స్ స‌మాచారం కూడా అదేన‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి టీఆర్ ఎస్ తొలిసారి ప్ర‌భుత్వ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత మిగ‌తా అన్ని జిల్లాల‌క‌న్నా ఖ‌మ్మంలో పార్టీ చాలా వీక్‌గా ఉంద‌ని గుర్తించారు. అక్క‌డ బ‌ల‌మైన నేత‌గా ఉన్న కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడు అయిన మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావును టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఆయ‌న అప్ప‌టి వ‌ర‌కు టీడీపీలో కొన‌సాగుతుండ‌గా… ఆ పార్టీకి భ‌విష్య‌త్ లేద‌ని నిర్ణ‌యించుకుని టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వ‌చ్చీ రాగ‌నే తుమ్మ‌ల‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో కేసీఆర్ వ్యూహాం ఫ‌లించి జిల్లా మొత్తం గులాబీ మ‌యంగా మారింది. ముఖ్య‌నేత‌లంద‌రూ గులాబీ గూటికే చేరుకున్నారు.

తుమ్మ‌ల ఓట‌మికి కార‌ణం గుర్తించి…

2016 ఉప ఎన్నిక‌ల్లో భాగంగా పాలేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి తుమ్మ‌ల‌ను గెలిపించుకున్నారు. ఓ ద‌శ‌లో ఇక తుమ్మ‌ల‌కు ఎదురూ లేర‌ని అంతా భావించారు. ఖ‌మ్మంలో అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. పుష్క‌రాల స‌మ‌యంలో పెద్ద ఎత్తున భ‌ద్రాచ‌లంలో ఏర్పాట్లు చేయ‌డంతో పాటు పాలేరులో భ‌క్త‌రామ‌దాసు ప్రాజెక్టును కేవ‌లం ఆరు మాసాల్లో పూర్తి చేయించి మంచి మార్కులు సంపాదించారు. ఇలా అప్ర‌తిహాతంగా సాగిపోతున్న‌తుమ్మ‌ల పోలిటిక‌ల్ కెరియ‌ర్‌కు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనుహ్యంగా బ్రేక్ ప‌డింది. ఖ‌మ్మం మొత్తాన్ని తిప్పేస్తాడ‌నుకున్న తుమ్మల జాత‌క‌మే తిర‌గ‌బ‌డిది. అస‌లెందుకు ఇలా జ‌రిగింద‌ని ఆరా తీసిన కేసీఆర్‌.. కేటీఆర్‌కు స‌న్నిహితుడైన ఎంపీ పొంగులేటి కుట్ర ప‌న్న‌డంతోనే ఇలా జ‌రిగిందంటూ తుమ్మ‌ల స‌హా జిల్లాలోని చాలా మంది నేత‌లు ఫిర్యాదు చేశారు. అయితే పొంగులేటిపై మాత్రం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. ఆయ‌న్ను స‌స్పెండ్ చేయ‌లనే డిమాండ్ పెద్ద ఎత్తున వ‌చ్చినా కేసీఆర్ ఆ విధంగా చేయ‌లేదు.

పొంగులేటిపై సీరియ‌స్ గా ఉన్నారా..?

పొంగులేటి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి గెలిచి ఆ త‌ర్వాత టీఆర్ఎస్‌లోకి జంప్ చేసేశారు. అయితే కేసీఆర్ వ్యూహాత్మ‌కంగానే వెన‌క్కు త‌గ్గార‌నే విశ్లేష‌ణ వినిపిస్తోంది. ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టాలంటే తానే రంగంలోకి దిగాల‌ని యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. అందుకే లోక్‌స‌భ‌కు అక్క‌డి నుంచే పోటీ చేసి..పార్టీకి జ‌వ‌స‌త్వాలు తీసుకురావ‌డంతో పాటు పొంగులేటికి రాజ‌కీయంగా మరో ఛాన్స్ లేకుండా చేయాల‌ని చూస్తున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ఓ టాక్ న‌డుస్తోంది.
పొంగులేటిని ఇప్పుడు పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తే కాంగ్రెస్‌లోకి వెళ్లి అయినా ఎంపీగా పోటీ చేయ‌వ‌చ్చు. ఆయ‌న‌కు ఆ ఛాన్స్ ఇవ్వ‌కుండా చేయాల‌న్న‌దే కేసీఆర్ టార్గెట్‌గా తెలుస్తోంది. మ‌రి కేసీఆర్ ఖ‌మ్మం వెళ్తారా..బ‌రిలోకి దూకి..పార్టీని నిల‌బెడ‌తారా..? అన్న‌ది కొద్దిరోజులు ఆగితే గాని తెలియ‌దు.

Tags:    

Similar News