కేసీఆర్ లెక్క ఇలాగే ఉంటది షర్మిలక్కా…?

నిన్నటిదాకా ఒక్కటిగా ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాలు అయ్యాక ఎవరి కుంపటి వారిదే. ఎవరి తిప్పలు వారివే. ఇక హక్కుల విషయం వచ్చినపుడు ఎవరైనా తమదే న్యాయమని [more]

Update: 2021-06-24 06:30 GMT

నిన్నటిదాకా ఒక్కటిగా ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాలు అయ్యాక ఎవరి కుంపటి వారిదే. ఎవరి తిప్పలు వారివే. ఇక హక్కుల విషయం వచ్చినపుడు ఎవరైనా తమదే న్యాయమని వాదిస్తారు. అది అడ్డగోలు అయినా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలూ సరే అనాల్సిందే. అదే ఇపుడు రాయలసీమ ఆడబిడ్డ అయిన వైఎస్ షర్మిలకు అతి పెద్ద రాజకీయ ఇబ్బందిగా మారుతోంది. ఆమె తండ్రి వైఎస్సార్ ని నీటి దొంగ అని, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ ని గజ దొంగ అని తెలంగాణా మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నారు. మరి ఇపుడు వైఎస్ షర్మిల రూట్ ఏంటి, ఆమె నోటి వెంట వచ్చే మాట ఏంటి అన్నదే చర్చ.

పుట్టిన గడ్డ అటు…..

వైఎస్ షర్మిల ఎంత హైదరాబాద్ లో పెరిగినా ఎన్ని దశాబ్దాలుగా అక్కడ ఉంటున్నా ఆమె పుట్టిన గడ్డ రాయలసీమ అన్నది తెలిసిందే. ఆ సీమకు నీళ్ళ కోసం నాడు సీఎం గా ఉన్న వైఎస్సార్ పోతిరెడ్డిపాడు ఎత్తి పోతల పధకాన్ని తీసుకువచ్చారు. ఇక జగన్ సీఎం అయ్యాక రాయలసీమ ఎత్తిపోతల పధకం అంటున్నారు. కృష్ణా వరద నీరు సముద్రంలో కలవకుండా వాడుకోవాలని ఏపీ సర్కార్ ఈ పధకాన్ని ప్రతిపాదించినా ఇందులో రాజకీయాన్ని మిళాయించి మరీ సరైన సమయంలో కేసీయార్ సర్కార్ తూటాలు పేల్చింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు జగన్ని ఢీ కొడుతూనే ఇటు తెలంగాణాలో హడావుడి చేస్తున్న షర్మిలకు కూడా గట్టి రిటార్ట్ ఇచ్చేసింది.

నోరు మెదపగలరా …?

తెలంగాణాలో కొత్త పార్టీ పెట్టి రాజకీయం చేయాలని చూస్తున్న వైఎస్ షర్మిలకు ఈ పరిణామం అసలు గుక్క తిప్పుకోనీయడంలేదు. ఇంకా పార్టీ పెట్టనే లేదు, అపుడే నీటి కొట్లాటకు కేసీయార్ తెర తీశారు. ఇపుడు వైఎస్ షర్మిల ఓటు ఎటు వేస్తారు. అటు అన్నను విమర్శిస్తూ తాను పుట్టిన గడ్డకు అన్యాయం చేయమంటారా. లేక ఇటు కేసీయార్ తో పాటు ఆయన మంత్రులు వైఎస్సార్ ని జగన్ని తిట్టిన తిట్లను సమర్ధిస్తారా. నిజంగా వైఎస్ షర్మిల ఈ టైంలో నోరు మెదపగలరా. నీరు, ఉద్యోగాలు అన్న పాయింట్ మీదనే తెలంగాణా మలి విడత ఉద్యమం మొదలైంది. తెలంగాణావాసుల కోసం తాను పార్టీ పెడతాను అంటున్న షర్మిల మహబూబ్ నగర్ సహా ఇతర జిల్లాల ప్రయోజనాలకు గండి కొడుతూ కృష్ణా నీరు జగన్ దోచుకుంటున్నారు అన్న దాని మీద ఏం మాట్లాడుతారు.

పెట్టక ముందే …?

మొత్తానికి కేసీయార్ మీద ప్రతీ రోజూ విమర్శలు చేస్తూ దొర అంటూ ఎగిరెగిరి పడుతున్న వైఎస్ షర్మిలకు సరైన టైం చూసి కేసీయార్ షాక్ ఇచ్చేశారు అంటున్నారు. ఇంకా పార్టీ పెట్టకముందే ఆమెకు చుక్కలు చూపించిన గులాబీ నేతలు తెలంగాణా లెక్క ఇలాగే ఉంటుంది అని జ్ణాన బోధ చేశారు అనుకోవాలి. నిజంగా ఈ తలనొప్పులు వస్తాయనే జగన్ తెలంగాణాలో పార్టీని విస్తరించలేదు. చంద్రబాబు తనకంటూ ఒక పార్టీ అక్కడ ఉందని చెప్పుకుంటూ జాతీయ ప్రెసిడెంట్ హోదా కోసం అక్కడా ఇక్కడా నోరెత్తలేకుండా ఉన్నారు. మొత్తానికి కేసీయార్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ వైఎస్ షర్మిలకు పార్టీ పెట్టకముందే క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించింది అంటున్నారు. అంతే కాదు ఆంధ్రా వారు ఎవరూ తెలంగాణాలో రాజకీయాలు చేయలేరు అని చెప్పడానికి వదిలిన చిన్న బాణమిదని కూడా అంటున్నారు.

Tags:    

Similar News