మురికి గబ్బును కడిగేస్తారా… ?

విశాఖ అందమైన నగరం. ఒక వైపు ఆకాశాన్ని అంటే అతి పెద్ద అపార్ట్మెంట్స్. మరో వైపు చూస్తే పూరి గుడిసెలు. అవి కూడా సిటీ మధ్యలోనే. ఒక [more]

Update: 2021-08-12 09:30 GMT

విశాఖ అందమైన నగరం. ఒక వైపు ఆకాశాన్ని అంటే అతి పెద్ద అపార్ట్మెంట్స్. మరో వైపు చూస్తే పూరి గుడిసెలు. అవి కూడా సిటీ మధ్యలోనే. ఒక విధంగా చెప్పాలంటే దిష్టి చుక్కలాగానే ఉన్నాయి. ఎవరైనా స్మార్ట్ సిటీ విశాఖ అనుకుని చూసేందుకు వస్తే నగరానికి నడిబొడ్డునే మురికివాడలు కనిపిస్తూ ఇదే మా అభివృద్ధి అని వెక్కిరిస్తాయి. అవి ఈ రోజుతో పుట్టలేదు. దశాబ్దాలుగా వెలిశాయి. నగరమనే తెల్ల వస్త్రానికి అలా మురికి అంటించేస్తున్నాయి.

పీవీ అన్నారు కానీ….

ప్రధాని అయ్యాక పీవీ నరసింహారావు ఒకసారి విశాఖ వచ్చారు. ఆయన మురికివాడలను చూసి ఆశ్చర్యపోయారు. అలాగే కొండలెక్కిన పూరి పాకలను చూసి విస్తుబోయారు. విశాఖను అందంగా ఉండేలా చూడమని ఆయన అధికారులను నాడు గట్టిగానే కోరారు. కానీ ఇప్పటికి ముప్పయ్యేళ్ళు గడచినా కూడా అవి ఇంకా పెరిగాయి కానీ పట్టించుకున్న వారే లేరు. పైగా ప్రభుత్వ స్థలాల్లో ఎక్కువగా మురికివాడలు ఉన్నాయి. రైల్వేస్, ఇతర కేంద్ర, , రాష్ట్ర ప్రభుత్వ స్థలాలు దొరికితే చాలు పాకలు వేసుకుంటూ బతుకులీడుస్తున్న వారే విశాఖలో లక్షల జనాభాగా ఉన్నారు.

తరలిస్తారా…?

మరో మాట ఏంటి అంటే మురికివాడలకు సంఘాలు ఉన్నాయి. వాటి వెనక నాయకులు ఉన్నారు. వారిని తరలిస్తే వేరే చోటు చూపించాలని, వారికి ఆవాసాలు కూడా నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు అయితే మురికివాడల పేరిట పాకలు వేయించి ప్రభుత్వ స్థలాలను కాజీయాలని చూస్తున్నారు. దీంతో వైసీపీ సర్కార్ దీని మీద బాగానే దృష్టి పెట్టింది. విశాఖకు పట్టిన మురికి గబ్బు వదిలించాలని కూడా గట్టిగానే సంకల్పించింది. జీవీఎంసీ ఎన్నికల వేళ వైసీపీ ఎన్నికల హామీల్లో ఇది ప్రధానమైనది. విశాఖను పాలనా రాజధానిగా చేస్తున్న వేళ మురికివాడలు ఉండరాదు అన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

ఆ క్రెడిట్ వారికే…?

విశాఖకు దశాబ్దాలుగా పట్టిన మురికి కంపుని తొలగిస్తే మాత్రం ఆ క్రెడిట్ కచ్చితంగా వైసీపీ సర్కార్ కే దక్కుతుంది అంటున్నారు నగర వాసులు. ఈ మేరకు జీవీఎంసీ అధికార యంత్రాంగం దాదాపుగా ఎనిమిది వందల దాకా ఉన్న మురికివాడలలో సమగ్ర సర్వే చేపట్టింది. ఈ సర్వే ద్వారా అక్కడ నివసితున్న వారి డేటాను కలెక్ట్ చేస్తోంది. వారికి ఏం కావాలి. ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలి అన్న దాని మీద అభిప్రాయ సేకరణ చేస్తోంది. మురికివాడల వాసులు నగరంతో పని ఉన్న వారే. దినసరి కూలీలుగా పనిచేస్తూ వారు పొట్టపోసుకుంటారు. అందువల్ల వారికి నగరానికి దూరంగా ఎక్కడో ఆవాసాలు ఏర్పాటు చేస్తే వాటిని అమ్ముకుని మళ్ళీ సిటీలోనే పాకలు వేసుకుంటారు. కాబట్టి వారి పనులకు ఇబ్బంది లేకుండా సిటీకి దగ్గరలోనే పక్కా ఇళ్ళు నిర్మించి ఇవ్వాలన్న సూచనలు వస్తున్నాయి. మొత్తానికి విశాఖను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెబుతోంది. అదే కనుక చేస్తే విశాఖ అందాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించినట్లే.

Tags:    

Similar News