వెండితెర వెలుగులు మొదలైనట్లేనా ..?

కరోనా దెబ్బతో సినీ పరిశ్రమ అన్నిటికన్నా ఘోరంగా దెబ్బతింది. సినిమా ప్రదర్శనలకు కేంద్రం ఎప్పుడో అనుమతి ఇచ్చినా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు లేక నిర్వహణ ఖర్చులు కూడా [more]

Update: 2021-01-26 09:30 GMT

కరోనా దెబ్బతో సినీ పరిశ్రమ అన్నిటికన్నా ఘోరంగా దెబ్బతింది. సినిమా ప్రదర్శనలకు కేంద్రం ఎప్పుడో అనుమతి ఇచ్చినా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు లేక నిర్వహణ ఖర్చులు కూడా రాక చాలా చోట్లా ప్రదర్శనలు నిలిపివేశారు. దీనికితోడు షూటింగ్స్ నిలిచిపోయి కొత్త సినిమాలు కూడా లేకపోవడంతో థియేటర్లు బూత్ బంగ్లాలనే తలపించాయి. ఇలాంటి దుస్థితి వస్తుందని ఈ పరిశ్రమపై ఆధారపడిన వారెవ్వరు ఊహించలేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా చిత్ర పరిశ్రమ పై జీవించే లక్షలాది కుటుంబాల దీనస్థితి ఉహకందనిది.

సంక్రాంతి తో కొత్త కాంతి …

ఇలాంటి పరిస్థితుల్లో సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన నాలుగు కొత్త సినిమాలు వెండి తెరకు పూర్వపు వైభవాన్ని తెచ్చే దిశగా నడుస్తున్నాయి. రవితేజ క్రాక్, విజయ్ మాస్టర్, రామ్ రెడ్, బెల్లపుకొండ శ్రీను అల్లుడు అదుర్స్ సినిమాలతో థియేటర్లు అన్ని కిటకిటలాడుతున్నాయి. దాంతో సినీ జనం ఆనందానికి హద్దులు లేవు. ప్రేక్షకులు సైతం ధైర్యంగా కుటుంబాలతో తిరిగి సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉండటంతో ఇకపై రాబోయే సినిమాల షూటింగ్స్ శరవేగాన్ని అందుకోనున్నాయని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. మరోపక్క ఓటీటీ ఫ్లాట్ ఫారం ల నుంచి ప్రేక్షకులను ధియేటర్ల వైపు పూర్తిస్థాయిలో నడిపించడానికి మరికొంత కాలం పడుతుందంటున్నారు.

రెట్టింపు బాదుడు …

కరోనా ప్రభావంతో అన్ని ధరలు పెంచేసినట్లే సినిమా టికెట్ల ధరలు చుక్కలు చూస్తున్నాయి. 50 శాతం ప్రేక్షకులతో మాత్రమే షో లు రన్ చేయాలిసి వస్తూ ఉండటంతో వచ్చిన వారి జేబు నుంచే రెండు టికెట్ల ధరని వసూలు చేసేస్తున్నారని ప్రేక్షకులు వాపోతున్నారు. మరో పక్క పైరసీ విజృంభణ ఎప్పటిలాగే వెండితెర కు తీరని నష్టాన్ని కొని తెస్తుంది. అత్యధిక ధరలతో ఉన్న టికెట్లు అమ్ముతూ ఉండటం అవి కూడా లభించకపోవడంతో ఆన్ లైన్ లో వచ్చే పైరసీ కొత్త చిత్రాల వైపు కొందరు తొంగి చూస్తూ ఉండటం సినీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తుంది. వందశాతం ఆక్యుపెన్సీ కి అనుమతులు లభిస్తే తాము పూర్తిగా గాడిన పడతామని ఇప్పటికే అప్పుల్లో మునిగి తేలుతున్నామని ఎగ్జిబిటర్లు మరోపక్క వాపోతున్నారు. పండగ వెళ్ళాక ఈ సందడి కొనసాగదని కొత్త సినిమాలు వరుసగా వస్తేనే ఈ ట్రెండ్ కొనసాగుతుందని ప్రదర్శకుల టాక్. మొత్తానికి అంతా ఎదురు చూసిన సినీ తరుణం వచ్చేసింది. పూర్తి స్థాయిలో వెండితెర సందడికి ఇక ఎంతోకాలం అయితే లేదన్నది తేలిపోయింది.

Tags:    

Similar News