చిరంజీవికి పొలిటికల్ ఆక్సిజన్ … ?

తొందర పడి ఒక కోయిల ముందే కూసింది అన్న మాటకు చిరంజీవినే ఉదాహరణగా చెప్పుకోవాలి. అటూ ఇటూ రెండు బలమైన పార్టీలు, యోధానుయోధులుగా వైఎస్సార్, చంద్రబాబు ఉన్నారు. [more]

Update: 2021-05-29 08:00 GMT

తొందర పడి ఒక కోయిల ముందే కూసింది అన్న మాటకు చిరంజీవినే ఉదాహరణగా చెప్పుకోవాలి. అటూ ఇటూ రెండు బలమైన పార్టీలు, యోధానుయోధులుగా వైఎస్సార్, చంద్రబాబు ఉన్నారు. మధ్యలో తెలంగాణా ఉద్యమాన్ని రగిలించిన కేసీయార్ ఉన్నారు. రాజకీయమంతా అస్తవ్యస్తంగా ఉన్న వేళ ప్రజారాజ్యం పేరిట చిరంజీవి 2008లో పొలిటికల్ అరంగేట్రం చేశారు. 2009 ఎన్నికలలో ఉమ్మడి ఏపీలోని 294 సీట్లకూ పోటీ పడి ఓడారు. అయితే నాడు 18 ఎమ్మెల్యే సీట్లు, 70 లక్షల దాకా ఓట్లు వచ్చాయి. కానీ రాంగ్ టైమ్ పాలిటిక్స్ వల్లనే చిరంజీవి టార్గెట్ ని రీచ్ కాలేదని అంతా అంటారు.

ఆ బురద అంతా….

ఇక దేశంలో కాంగ్రెస్ రెండవ సారి అధికారంలోకి వచ్చిన కాలమది. యూపీయే టైమ్ లో అనేక కుంభకోణాలు జరిగాయి. అదే కాంగ్రెస్ లో చేరి మంత్రి అయిన చిరంజీవికి కూడా ఆ బురద బాగా అంటుకుంది. దానికి తోడు అడ్డగోలుగా ఏపీ విభజనతో కాంగ్రెస్ మీద కోపం కాస్తా మెగాస్టార్ మీదకూ మళ్ళింది. పార్టీని అమ్మేశారని, పదవి కోసం అవినీతి కాంగ్రెస్ కి దాసోహం అయ్యారని కూడా నిందలు మోశారు. విభజనను వ్యతిరేకించిన ఆంధ్రులకూ అలా ఆయన చెడ్డ అయ్యారు. తెలంగాణా కోరుకున్న చోట కూడా ఏమీ కాకుండా పోయారు.

నెగిటివిటీ అలా…

మొత్తానికి విభజన తరువాత ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రాభవమూ తగ్గింది. అలాగే చిరంజీవి కూడా సైలెంట్ అయ్యారు. అది వ్యూహాత్మకమని ఇపుడు అర్ధమవుతోంది. చిరంజీవి 2017లో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన సినీ జీవితం బాగానే సాగుతోంది. ఎక్కడ నుంచి అయితే ఇంత పేరు తెచ్చుకున్నారో మళ్లీ అక్కడికే చేరి చిరంజీవి అందరివాడు అనిపించు కుంటు న్నారు. ఆయన సేవా కార్యక్రమాలను కూడా మళ్లీ మొదలుపెట్టారు. గతంలో రాజకీయాల్లోకి రావడానికి ఉపయోగపడిన బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ వంటి వాటికి తోడుగా కరోనా వేళ ఆక్సిజన్ బ్యాంకులతో చిరంజీవి మళ్ళీ తెలుగు జనాల మన్ననలు అందుకుంటున్నారు. ఆయన మీద ఉన్న నెగిటివిటీ మెల్లగా తగ్గిపోతోంది. ఆయన లోపలి మనిషిని జనాలు అర్ధం చేసుకుంటున్నారు అనే చెప్పాలి.

సెకండ్ ఇన్నింగ్స్ …?

సినిమాల్లో ఉన్నట్లుగానే రాజకీయాల్లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడా ఇక్కడా ఉండేది ప్రజలే కాబట్టి. వారికి ఒకనాటి కోపాలు మరోనాడు అలాగే ఉండాలన్న రూల్ ఏమీ లేదు. అలా అయితే ఓడిన పార్టీలు ఎప్పటికీ గెలవవు కూడా. ఇదిలా ఉంటే చిరంజీవి మళ్ళీ ప్రజా సేవా కార్యక్రమాల్లో చురుకుగా మారుతున్నారు. ఆయనకు అపరిమితమైన జనాదరణ ఉంది. పైగా బలమైన సామాజికవర్గం దన్ను ఉంది. ఏపీ రాజకీయాల్లో సీఎం సీటు కోసం ఒక వర్గం కన్ను కూడా ఉంది. దీంతో అన్నీ కలసి వస్తే చిరంజీవి 2024 ఎన్నికలకు ముందు మళ్ళీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారా అన్న చర్చ అయితే వస్తోంది. దేశంలో కాంగ్రెస్ రాజకీయం కూడా మారుతోంది. ఆ పార్టీకి ఆదరణ కనుక పెరిగితే దాని ప్రభావం ఏపీ మీద కూడా ఉంటుంది. అపుడు కాంగ్రెస్ ని జనంలోకి తీసుకుపోవడానికి మెగాస్టార్ లాంటి విశేష ప్రజాకర్షణ కలిగిన నేత‌ అవసరం తప్పనిసరిగా ఉంటుంది. మొత్తానికి చిరంజీవి పొలిటికల్ కెరీర్ కి ఆక్సిజన్ లా ఆయన సేవా కార్యక్రమాలు మారుతున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News