చేతులారా చేసుకున్నదేగా…?

అధికారం ద‌క్కక‌, ప్రజ‌ల అభిమానం సొంతం చేసుకోలేక అలో ల‌క్ష్మణా! అని ఏడుస్తున్న నాయ‌కులు కొంద‌రైతే.. త‌మ‌కు అందిన అధికారంతో అహం భావం పెంచుకుని అనుక్షణం.. ప్రజ‌ల‌ను [more]

Update: 2019-09-03 12:30 GMT

అధికారం ద‌క్కక‌, ప్రజ‌ల అభిమానం సొంతం చేసుకోలేక అలో ల‌క్ష్మణా! అని ఏడుస్తున్న నాయ‌కులు కొంద‌రైతే.. త‌మ‌కు అందిన అధికారంతో అహం భావం పెంచుకుని అనుక్షణం.. ప్రజ‌ల‌ను ప‌ట్టి పీడించిన నాయ‌కులు మ‌రికొంద‌రు. ఈ క్రమంలో ఇలా అహం భావం పెంచుకున్న నాయ‌కులు నేడు చిక్కుల్లో ప‌డి చుక్కలు లెక్కబెడుతున్నారు. ఇలాంటి వారిలో ముందు వ‌రుస‌లో ఉన్నారు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వర్గం మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌. టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుడిగా.. 2009, 2014 ఎన్నిక‌ల్లో త‌న‌కంటూ.. ప్రత్యేక‌త‌ను చాటుకుని, రాష్ట్రంలో వైఎస్ గాలుల ప్ర‌భంజ‌నాన్నిసైతం త‌ట్టుకుని 2009లో విజ‌యం సాధించారు చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌.

మాస్ నాయకుడి అయినా…..

మాస్ నాయకుడిగా, క్లాస్ పొలిటీషియ‌న్‌గా ఆయ‌న అంద‌రికీ చేరువ అవుతార‌ని అనుకున్న ఆశ‌లు ఎంతో కాలం నిల‌వ‌లేదు. ఆయ‌న త‌న విశ్వరూపం చూపించారు. సామాన్యులు, మ‌ధ్యత‌ర‌గ‌తి వారిపై త‌న ప్రతాపం చూపించారు. పార్టీలో సీనియ‌ర్లు అయినా, ఇత‌ర పార్టీల వారు అయినా ఎవ‌రైనా చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌ ముందు త‌ల‌వంచి మ‌రీ స‌లాం చేయాల్సిందే. ఎక్కడిక‌క్కడ త‌న దూకుడు ప్రద‌ర్శించారు. సామాన్యుల‌ను బెద‌ర గొట్టారు. త‌న పిల్ల చేష్టలతో నిత్యం వివాదాల చుట్టూ ప‌రిభ్రమించారు. ముఖ్యంగా అధికారులు, పోలీసుల‌పై కూడా త‌న దురుసు త‌నం ప్రద‌ర్శించి చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌ వివాదాస్పద‌మ‌య్యారు. పార్టీలోనూ త‌న‌ను గెలిపించేందుకు కృషి వారిని ప‌క్కన పెట్టారు. త‌నకు భ‌జ‌న చేసే వారిని మాత్రమే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ.. ఎందుకు గెలిపించాం రా! అని అనుకునే రేంజ్‌కు ఆయ‌న వెళ్లిపోయారు.

తన పతనాన్ని తానే…

ఈ నేప‌థ్యానికి తోడు ఎస్సీ ఎస్టీల‌కు అదికారం ఎందుకు ? అంటూ చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌ చేసిన ప్రసంగాలు మ‌రింత‌గా దుమ్ము రేపాయి. అగ్రవ‌ర్ణానికి చెందిన నాయ‌కుడు, పైగా చంద్రబాబు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ కుడు కావడంతో ఈ వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌ ఎన్నో వివాదాల‌కు కార‌ణ‌మైనా చంద్రబాబు మాత్రం ప్రతిసారి వెన‌కేసుకు వ‌చ్చేందుకే ప్రయ‌త్నించారు. దీంతో చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌పై రాష్ట్ర స్థాయిలో తీవ్రమైన వ్యతిరేక‌త వ్యక్తమైంది. వీటికితోడు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌కు స‌వాళ్లు రువ్వడం కూడా వివాదానికి కార‌ణ‌మైంది. ఇలా త‌న ప‌త‌నాన్నితానే కొనితెచ్చుకున్నారు.

అయినా దూకుడు తగ్గలేదు….

తాజాగా ఓడిపోయిన త‌ర్వాత కూడా త‌న దూకుడు త‌గ్గలేదు. నియోజ‌క‌వ‌ర్గంలోని పెదవేగి మండలం పినకడిమి గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం ఇసుకను తీసుకువెళుతున్న దళిత యువతపై ప్రభాకర్‌ దుర్భాషలాడుతూ, దాడికి యత్నించారు. ఈ సంఘటనపై చింతమనేనితోపాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.

నాలుగు రోజులుగా….

ఏలూరు నగరంలోని పోలీసు యంత్రాంగం భారీగా స్పెషల్‌ పోలీసులు చింతమనేని ఇంటి వద్ద మోహరించారు. పోలీసులు పెద్ద సంఖ్యలో తన ఇంటికి చేరుకోవడంతో చింతమనేని ప్రభాకర్ త‌న ఇంటి నుంచి త‌ప్పించుకుని ప‌రార‌య్యారు. ఇప్పటికి నాలుగు రోజులు గడిచినా.. ఆయ‌న ఎక్కడ ఉన్నారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. మొత్తానికి చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌ దుస్థితికి ఆయ‌నే కార‌ణ‌మ‌నే వ్యాఖ్యలు భారీగా వినిపిస్తున్నాయి. మ‌రి ఇంత‌టితో ఆయ‌న క‌థ ముగిసిపోతుందా? మ‌ళ్లీ పుంజుకుంటారా? చూడాలి.

Tags:    

Similar News