కేసీఆర్… జగన్.. రిలేషన్స్ బాగున్నాయే… ?

కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీ తెలంగాణాల మధ్య ఎంతటి రాజకీయ రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. తెలంగాణా మంత్రులు అయితే హద్దులు మరచి మరీ జగన్ [more]

Update: 2021-07-28 14:30 GMT

కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీ తెలంగాణాల మధ్య ఎంతటి రాజకీయ రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. తెలంగాణా మంత్రులు అయితే హద్దులు మరచి మరీ జగన్ ని తూలనాడారు. వైసీపీ మంత్రులు కూడా ఇవతల వైపు చిటపటలాడారు. ఇక కేసీఆర్ తన మంత్రి వర్గ సమావేశాల్లో జగన్ మీద ఘాటుగా కామెంట్స్ చేశారు అన్న వార్తలు వచ్చాయి. మరో వైపు జగన్ కూడా తన మంత్రులతో కేసీఆర్ సర్కార్ తీరుపైన తీవ్ర అసహనం వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. కట్ చేస్తే ఇపుడు కృష్ణా, గోదావరి జలాల పెత్తనం కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత అటూ ఇటూ కూడా సైలెంట్ అయ్యారు.

బంధం గట్టిదే ….?

ఇక తాజాగా ఏపీ సర్కార్ నాడు నేడు పేరిట రూపొందిచ్నిన సాఫ్ట్ వేర్ కావాలని తెలంగాణా ప్రభుత్వం కోరడమే తరువాత ఏపీ సర్కార్ ఓకే అనేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు రూపొందించిన సాఫ్ట్ వేర్ బాగుందని, తాను ఉపయోగించుకుంటామని ఏపీని తెలంగాణా పెద్దలు కోరారు. దానికి సై అంటూ అనుమతించడం అంటే నిజంగా రెండు వైపులా మంచి సంబంధాలే నడుస్తున్నాయి అనుకోవాలి. పైగా ఏపీ సర్కార్ కి ఇది ఒక విధంగా కితాబే. ఏపీలోని విపక్షాలు ఏవీ కూడా జగన్ ప్రభుత్వం అభివృద్ధి మీద అసలు దృష్టి పెట్టడం లేదు అంటూ విమర్శలు చేస్తున్న వేళ ఏపీయే బెస్ట్ అన్నట్లుగా కేసీఆర్ సర్కార్ సాఫ్ట్ వేర్ కోరడం అంటే అది మెచ్చతగినదే.

భావ సారూప్యం…..

ఏపీ తెలంగాణాలు ఒకనాడు ఉమ్మడి ఏపీలో భాగమే. ప్రజల ఆలోచనలే కాదు, పాలకుల ఆలోచనలు కూడా ఒక్కలాగానే ఉంటాయని చెప్పాలి. ఇక ఒక చోట అభివృద్ధి జరిగితే రెండవ వైపు వారు కూడా దాన్ని కోరడమూ సహజం. ఇక కేసీఆర్ రెండు తడవలుగా సీఎం గా ఉన్నా జగన్ తొలిసారి ముఖ్యమంత్రి అయినా కూడా ఇద్దరి ఆలోచనలు దాదాపుగా ఒక్కటే. తామే ఎక్కువ కాలం సీఎంలుగా ఉండాలన్నదే కోరిక. పైగా ఇద్దరికీ ఉమ్మడి శతృవులుగా బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి. ఇద్దరూ కూడా ఈ పార్టీలకు దూరంగానే ఉంటారు. అవసరార్ధమే కేంద్ర ప్రభుత్వంతో రిలేషన్స్ పెట్టుకుంటారు. ఇద్దరికీ ఒకరి తోడు మరొకరికి అవసరం అని తెలుసు. ఇక ఇద్దరూ కూడా ఒకరిని మరొకరు దెబ్బతీయాలని అనుకోరు. ఎందుకంటే ఆ ప్లేస్ లో మూడవ వారు వస్తే ఇద్దరికీ ఇబ్బందే కాబట్టి.

అలా జరగాలిగా…

సరే కృష్ణా జలాల విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలసి మాట్లాడుకోవాలని అంతా కోరారు. ఇక ఈ ఇద్దరు మంచి మిత్రులు అని విపక్షాలే కాదు, స్వయాన జగన్ సోదరి షర్మిల కూడా ధృవీకరించారు. మరో వైపు చూస్తే ఈ బంధం వారి రాజకీయాలకు, వ్యక్తిగత విషయాలకు మాత్రమే ఎక్కువగా ఉపయోగపడుతుంది తప్ప ప్రజల కోసం కాదు అన్నదే మేధావుల భావన. ఇక కేసీఆర్ అయినా జగన్ అయినా రెండు వైపులా ఉన్న ప్రజల కోసం ఆలోచించి శాశ్వతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడితేనే వారి పేరు కలకాలం నిలుస్తుంది. అంతే తప్ప బయటకు కొట్టుకుంటూ లోపల కౌగిలించుకుంటూ ప్రత్యర్ధుల ఎత్తులను చిత్తు చేసే పాలిటిక్స్ చేస్తే మాత్రం జనాలు కూడా ఏదో రోజున అర్ధం చేసుకుంటారు అన్నది నిజం అంటున్నారు.

Tags:    

Similar News