చేగొండి ….. చేజేతులా?

రాష్ట్రంలో మునుప‌టి త‌రం నాయ‌కుల్లో చాలా ఎక్కువ‌గా పేరు తెచ్చుకున్న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కు చెందిన సీనియ‌ర్ దిగ్గజం చేగొండి హ‌రిరామ జోగ‌య్య. ఈయ‌న పేరు [more]

Update: 2019-10-01 08:00 GMT

రాష్ట్రంలో మునుప‌టి త‌రం నాయ‌కుల్లో చాలా ఎక్కువ‌గా పేరు తెచ్చుకున్న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కు చెందిన సీనియ‌ర్ దిగ్గజం చేగొండి హ‌రిరామ జోగ‌య్య. ఈయ‌న పేరు చెప్ప‌గానే ఆయ‌న చేసే సునిశిత విమ‌ర్శలు, దూర దృష్టితో ఆలోచించే త‌త్వం వంటివి మ‌న క‌ళ్లకు క‌ట్టిన‌ట్టు క‌నిపిస్తాయి. అయితే, ఆయ‌న ప్రజ‌ల విష‌యంలో దూర దృష్టితో చేసిన రాజ‌కీయం.. త‌న ద‌గ్గర‌కు, త‌న కుటుంబం ద‌గ్గర‌కు వ‌చ్చే స‌రికి మాత్రం రివ‌ర్స్ అయింది. దీంతో ఇప్పుడు చేగొండి హ‌రిరామ జోగ‌య్య ఫ్యామిలీ రాజ‌కీయంగా చుక్కాని లేని నావ‌లా ఉసూరు మంటోంది. ఇంత అనుభవం, ఇంత ప్రజాద‌ర‌ణ ఉన్నప్ప‌టికీ.. గోడ చేర్పు లేని బంగారు ప‌ళ్లెం మాదిరిగా త‌యారైంది.

ఎక్కువ కాలం టీడీపీతోనే…

విష‌యంలోకి వెళ్లే.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం నుంచి ప్రారంభ‌మైన చేగొండి హ‌రిరామ జోగ‌య్య రాజ‌కీయం.. ఎక్కువ కాలం టీడీపీతో కొన‌సాగింది. ఈ పార్టీ టికెట్‌పై న‌ర‌సాపురం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న త‌ర్వాత రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యత‌లు చేప‌ట్టారు. ఇక‌, ఆ త‌ర్వాత ప‌ద‌వీ వ్యామోహంతో పార్టీ మారిపోయి.. కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేశారు. ఆ త‌ర్వాత మ‌రోసారి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన పాల‌కొల్లుకు మారి అక్కడ కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఆయ‌న 2004లో న‌ర‌సాపురం నుంచే ఎంపీగా విజ‌యం సాధించారు. ఇలా హ్యాపీగా సాగుతున్న చేగొండి హ‌రిరామ జోగ‌య్య రాజ‌కీయం.. 2007లో ప్రజారాజ్యం ఎంట్రీతో ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వ‌ర‌కు ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా కాద‌ని వెంట‌నే చేగొండి హ‌రిరామ జోగ‌య్య ప్రజారాజ్యంలోకి జంప్ చేశారు.

ప్రజారాజ్యంలోకి వెళ్లడమే….

ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌తోనే చేగొండి హ‌రిరామ జోగ‌య్య తీవ్రంగా విబేధించారు. ఈ క్రమంలోనే వైఎస్ చేగొండి హ‌రిరామ జోగ‌య్యను రాజ‌కీయంగా అణ‌గ‌దొక్కుతూ ఎమ్మెల్యేల‌కు ప్రయార్టీ ఇస్తూ వ‌చ్చారు. జోగ‌య్య ప్రజారాజ్యంలోకి వెళ్లడ‌మే ఆయ‌న వేసిన రాంగ్‌స్టెప్‌. ఆయ‌న రాజ‌కీయ జీవితం ఈ పార్టీలో స‌క్సెస్ కాలేదు. జోగ‌య్య ప్రజారాజ్యంలోకి వెళ్లినా పోటీ చేయ‌లేదు. ఆ పార్టీ ఓట‌మితో రాజ‌కీయంగా కొన్నాళ్లు మౌనం పాటించారు. వైఎస్ జ‌గ‌న్ పార్టీ పెట్టినా. దానిలోకి వెళ్లే ప్రయ‌త్నం అప్పట్లో చేయ‌క‌పోగా.. విమ‌ర్శలు సంధించారు. ఇదిలావుంటే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెట్టిన పార్టీ జ‌న‌సేన‌లోకి వెళ్లారు.

జనసేనలో చేరి…..

ఈ క్రమంలోనే చేగొండి వ‌య‌సు రీత్యా వృద్ధుడు కావ‌డంతో ఎన్నిక‌ల్లో త‌న కుమారుడికి అవ‌కాశం ఇవ్వాలంటూ.. చేగొండి సూర్యప్రకాశ‌రావును తెర‌మీదికి తెచ్చారు. తాను మాత్రం స‌ల‌హాలు, సూచ‌నల‌కే ప‌రిమిత‌మ‌ని చెప్పారు. అలానే ఆసుప‌త్రి నుంచి కూడా ప‌వ‌న్‌కు సూచ‌న‌లు స‌ల‌హాలు ఇచ్చారు. అయితే, చేగొండి కుమారుడు సూర్యప్రకాశ్ జ‌న‌సేన‌లోకి వెళ్లినా… ప‌వ‌న్‌ టికెట్ మాత్రం ఇవ్వలేదు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు పాల‌కొల్లు జ‌న‌సేన సీటు సూర్యప్రకాశ్‌కే అని అంద‌రూ అనుకున్నారు. అయితే చివ‌ర్లో వైసీపీ నుంచి జ‌న‌సేన‌లో చేరిన నాగ‌బాబుకు సీటు ఇచ్చారు ప‌వ‌న్‌. దీంతో చేగొండి హ‌రిరామ జోగ‌య్య వార‌సుడి ఆశ‌లు ఆదిలోనే మాడిపోయాయి.

వైసీపీ నుంచి ఆఫర్ వచ్చినా….

ప్రస్తుతం చేగొండ హ‌రిరామ జోగ‌య్య వార‌సుడు సూర్యప్రకాశ్ న‌ర‌సాపురం పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ఇంచార్జ్‌గా కొన‌సాగుతున్నా.. జ‌న‌సేన ప‌రిస్థితి ఏమంత ఆశించిన విధంగా లేక పోవ‌డంతో సూర్యప్రకాశ్ స‌హా.. చేగొండి ఫ్యామిలీకి రాజ‌కీయంగా ఎలాంటి దిశా క‌నిపించ‌డం లేదు. నిజానికి వారికి ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే, అప్పట్లో ప‌వ‌న్ సీఎం అయిపోతాడ‌ని భావించిన ఈ ఫ్యామిలీ జ‌గ‌న్‌పై అభాండాలు వేసేందుకే ప్రాధాన్యం ఇచ్చింది. అదే వైసీపీలోకి వెళ్లి ఉంటే.. మంచి లైఫ్ ఉండేద‌ని ఇప్పుడు చేగొండి హ‌రిరామ జోగ‌య్య అనుచ‌రులు అంటున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న చేగొండి శ్రేయోభిలాషులు.. చేజేతులా చేసుకున్నదే ఇదంతా అంటూ.. వ్యాఖ్యలు సంధిస్తున్నారు.

Tags:    

Similar News