Achanta : మరో తాడిపత్రిలాగానే ఆచంట… మంత్రి గారికి?

మొన్న జరిగిన పరిషత్ ఎన్నికల్లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఘన విజయం సాధించింది. అయితే కొన్ని చోట్ల పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు ప్రాతినిధ్యం [more]

Update: 2021-09-21 05:00 GMT

మొన్న జరిగిన పరిషత్ ఎన్నికల్లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఘన విజయం సాధించింది. అయితే కొన్ని చోట్ల పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంటలో వైసీపీ పరాజయం పాలయింది. అయితే ఈ ఎంపీపీని దక్కించుకోవడానికి చెరుకువాడ శ్రీరంగనాధరాజు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆచంటలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణను దొడ్డిదారిన దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

టీడీపీ, జనసేన….

మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు ప్రాతనిధ్యం వహిస్తున్న ఆచంట నియోజకవర్గంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇందులో కేవలం ఆరింటిలో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. జడ్పీటీసీ కూడా టీడీపీ దక్కించుకుంది. 17 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ ఏడు స్థానాల్లో, జనసేన నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. ఇక్కడ ఎంపీపీని దక్కించుకోవాలంటే తొమ్మిది ఎంపీటీసీ సభ్యుల మద్దతు అవసరం.

క్యాంప్ కు తరలించి…

కానీ ఇక్కడ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ జనసేన ఎంపీటీసీలతో కలసి ఆచంట ఎంపీపీని కైైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం జనసేన అగ్రనేతలను కూడా సంప్రదించారు. ఈ నెల 24వ తేదీన ఎంపీపీ ఎన్నిక జరగనుంది. దీంతో టీడీపీ, జనసేన ఎంపీటీసీలను క్యాంప్ లకు తరలించారు. క్యాంప్ ల నుంచి రప్పించి ఆచంట ఎంపీపీని దక్కించుకోవాలని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు ప్రయత్నిస్తున్నారు.

జనసేన సభ్యుల మద్దతు కోసం….

కానీ జనసేన గుర్తు మీద గెలిచిన నలుగురు ఎంపీపీలు ససేమిరా అంటున్నారు. మంత్రి మాత్రం పట్టుదలకు పోతున్నారు. ఇది తనకు ప్రిస్టేజ్ అని, జనసేన సభ్యుల మద్దతు కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు పితాని సత్యనారాయణ కూడా తన పట్టును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన తాడిపత్రి మున్సిపాలిటీ మాదిరిగానే ఆచంట ఫలితం కూడా ఉంటుందని, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజుకు భంగపాటు తప్పదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News