చంద్రబాబు అక్కడ సక్సెస్ అయ్యారు..!

లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చాడనే సినిమా డైలాగు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సరిగ్గా సరిపోలేలా ఉంది. ఆయన రాజకీయ వ్యూహాలు, వేగంగా నిర్ణయాలు తీసుకోగలిగిన, మార్చుకోగలిగిన [more]

Update: 2019-02-12 05:00 GMT

లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చాడనే సినిమా డైలాగు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సరిగ్గా సరిపోలేలా ఉంది. ఆయన రాజకీయ వ్యూహాలు, వేగంగా నిర్ణయాలు తీసుకోగలిగిన, మార్చుకోగలిగిన స్వభావం, మీడియా అండ, జాతీయ స్థాయిలో పలుకుబడి.. అన్నీ కలగలిసి చంద్రబాబుకు ప్రత్యేక హోదా ఉద్యమ క్రెడిట్ ను కట్టబెట్టినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా మరో నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం ద్వారా చంద్రబాబుకు ఎన్నికల్లో మేలు జరిగే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఇక సోమవారం ఢిల్లీలో వేదికగా చంద్రబాబు చేసిన ధర్మపోరాట దీక్షతో ఆయన ఉద్యమ హోదా క్రెడిట్ ను పూర్తిగా తన ఖాతాలో వేసుకున్నారు. ఎలాగూ మూడురోజుల్లో పార్లమెంటు ముగియనున్న నేపథ్యంలో చంద్రబాబు దీక్ష వల్ల కేంద్రం ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశమైతే లేదు. ఈ విషయం చంద్రబాబుకూ తెలుసు. అయినా, హోదా కోసం దీక్ష చేయడం ద్వారా చంద్రబాబుకు రాజకీయంగానైతే మేలు జరిగే అవకాశమే ఉంది.

క్యూ కట్టిన నేతలు

సోమవారం ఢిల్లీలో చంద్రబాబు ఓ రకంగా బలప్రదర్శన చేశారు. ఆయన దీక్షకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. వివిధ ప్రజా సంఘాలు, మేధావులు ఆయనకు మద్దతు తెలిపారు. ఇక, జాతీయ నేతలైతే చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు క్యూ కట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, కమల్ నాథ్ తదితరులు చంద్రబాబు దీక్షకు వచ్చి మద్దతు తెలిపారు. సీనియర్ నేతలు ములాయం సింగ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, శరద్ యాదవ్, శరద్ పవార్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే నేతలు చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపారు. ఇక, కాంగ్రెస్ నేతలైతే చంద్రబాబుకు పెద్దఎత్తున మద్దతు తెలిపారు. ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఢిల్లీలో దీక్ష చేసినా అంతమంది కాంగ్రెస్ ముఖ్యులు వచ్చే వారు కారేమో. ఆఖరుకి రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషించిన గులాంనబీ ఆజాద్, జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ వంటివారు కూడా చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు.

నాలుగేళ్లుగా జగన్… ఆరునెలలుగా బాబు

దీంతో చంద్రబాబు దీక్షకు జాతీయ మీడియా కూడా ప్రాముఖ్యత ఇచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా చంద్రబాబు దీక్షకు కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. మొత్తానికి, ఈ దీక్ష ద్వారా ప్రత్యేక హోదా ఉద్యమ క్రెడిట్ చంద్రబాబు ఖాతాలో పడిపోయే అవకాశం ఉంది. వాస్తవానికి, ప్రతిపక్ష నేత జగన్ నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో యువతతో సమావేశాలు నిర్వహించి హోదా వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ధర్నాలు, బంద్ లు, దీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి పెద్దగా పట్టించుకోలేదు సరికదా హోదా అవసరం కూడా లేదన్నట్లుగా మాట్లాడారు.

ఎంపీలు రాజీనామా చేసినా….

అయితే, గత ఆరు నెలలుగా చంద్రబాబు హోదా నినాదాన్ని ఎత్తుకున్నాక జగన్ సైలెంట్ అయినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఈ డిమాండ్ తో వైసీపీ ఎంపీలు రాజీనామా చేసినా వైసీపీకి ఎటువంటి క్రెడిట్ రాలేదు. రానీయలేదు. ఇక, ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ ప్రత్యేక హోదా నినాదాన్ని పక్కనపెట్టి ఎన్నికలకు సిద్దమవుతుండగా… చంద్రబాబు మాత్రం వ్యూహాత్మకంగా ఎన్నికల వేళ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. జగన్ మాత్రం తానూ గతంలో ఉద్యమం చేశానని గుర్తు చేయాల్సిన పరిస్థితి. మరి, ప్రత్యేక హోదా ఉద్యమ క్రెడిట్ నాలుగేళ్లుగా ఉద్యమించిన జగన్ కు దక్కుతుందో.. లేటుగా మొదలుపెట్టినా తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్న చంద్రబాబుకు దక్కుతుందో చూడాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News