వ్రతం చెడినా ఫలితం దక్కుతుందంటారా?

రాయలసీమ. ఒకనాటి వైభోగం. రతనాలను రాశులుగా పోసి రోడ్డు మీద విక్రయించారని చరిత్ర చెబుతోంది. తెలుగు వల్లభుడు శ్రీక్రిష్ణ దేవరాయల పాలనలో స్వర్ణ యుగాన్నే చూసిన ప్రాంతం. [more]

Update: 2021-01-04 06:30 GMT

రాయలసీమ. ఒకనాటి వైభోగం. రతనాలను రాశులుగా పోసి రోడ్డు మీద విక్రయించారని చరిత్ర చెబుతోంది. తెలుగు వల్లభుడు శ్రీక్రిష్ణ దేవరాయల పాలనలో స్వర్ణ యుగాన్నే చూసిన ప్రాంతం. అంత ఎందుకు ఉమ్మడి మద్రాస్ స్టేట్ లో కూడా బాగానే మనుగడ సాగించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో జరిగిన విభజన బళ్ళారి వంటి ప్రాంతాలను తుంగభద్ర వంటి నదీ నదాలను ఎటూ కాకుండా చేసిన దైన్యం సీమది. ఇక మద్రాస్ నుంచి విడిపోయాక రాజధాని తమకే కావాలని పట్టుబట్టి కర్నూలు ని సాధించుకున్నా ఆ సంబరం కూడా ఎక్కువ సేపు నిలవలేదు.

సెంటిమెంట్ తోనే….

రాయలసీమకు న్యాయం జరగాలని ఇపుడు పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. చంద్రబాబు హై కోర్టు సహా రాజధానిని కూడా అమరావతిలోనే ఏర్పాటు చేశారు. అంతే కాదు, హైదరాబాద్ మోడల్ కేంద్రీకృత అభివ్రుద్ధిని బాబు అమరావతిలో కూడా చేపట్టాలనుకున్నారు. అయితే జనం దాన్ని గట్టిగానే తిప్పికొట్టారు. అందుకే జగన్ కి జై కొట్టారు. జగన్ కూడా రాయలసీమకు న్యాయం చేద్దామనే చూస్తున్నారు. అయితే ఆయన అందుకు ప్రతిపాదించినవి, ఇస్తున్నవి ఏ మాత్రం సీమ జనాలకు సంతృప్తిగా లేవని అంటున్నారు. వారికి కర్నూలు రాజధాని సెంటిమెంట్ అలాగే ఉండిపోయింది మరి.

విశాఖతోనే పోటీ……

ఇక్కడ ఒక చిత్రం కనిపిస్తోంది. అమరావతిలో రాజధాని పెట్టినపుడు హై కోర్టు అయినా కర్నూలు లో ఏర్పాటు చేయరా అన్న డిమాండ్ వచ్చింది. ఏకంగా అన్ని పార్టీలకు చెందిన నేతల నుంచే ఈ నినాదం వచ్చింది. అంటే ప్రజల మనసులోని భావాలే కదా ఇవి. దాన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ కర్నూలు ని న్యాయ రాజధానిని చేస్తూ చట్టం చేశారు. విశాఖను పాలనారాధానిగా చేశారు. అమరావతిని శాసన రాజధాని అని అన్నారు. అయితే ఈ ప్రతిపాదనే ఇపుడు సీమ జనాల్లో కొత్త చర్చకు తావిస్తోంది. విశాఖకు రాజధాని ఇవ్వడమేంటి అన్న మాటా వారి నోట్లోంచి వస్తోంది. ఇస్తే రాజధాని కర్నూలు కి ఇవ్వాలి. లేకపోతే అమరావతిలోనే ఉంచాలన్నది కూడా సీమ జనం మనోగతంగా కనిపిస్తోంది అంటున్నారు.

వ్రతం చెడినా.?

చంద్రబాబు ఏ ముహూర్తాన అమరావతి రాజధాని అన్నారో కానీ అక్కడే రాజధాని అని కోస్తా జనాలు ఉద్యమాలే చేస్తున్నారు. మూడు ముక్కలాట వద్దే వద్దు అంటున్నారు. ఇపుడు వారికి అనూహ్యంగా సీమ జనాల నుంచి మద్దతు వస్తోంది. తమకు హై కోర్టు ఇచ్చి అమరావతిలో రాజధానిని ఉంచాలని లేకపోతే తమకు రాజధాని ఇచ్చి విశాఖకు హై కోర్టు తరలించాలని కొత్త ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నారు. అంతే తప్ప విశాఖకు మాత్రం పాలనా రాజధాని వద్దు అన్నదే వారి అభిమతంగా ఉన్ని ప్రచారం సాగుతోంది. జనంలో ఈ రకమైన అభిప్రాయాలను చూసిన మీదటనే సోము వీర్రాజు అమరావతిలోనే రాజధాని ఉంటుందని ప్రకటించారని చెబుతున్నారు. మరి జగన్ మూడు రాజధానులు అంటున్నారు. దాని కోసం గట్టిగా పోరాడుతున్నారు. మరి వ్రతం చెడినా ఫలితం దక్కుతుందా అన్నదే ఇపుడు చూడాలి.

Tags:    

Similar News