విశాఖకు బాబే విలన్ అట.. నిజమేనా ?

విశాఖ అంటే తనకు చాలా ఇష్టమని చంద్రబాబు పదే పదే చెబుతారు. విశాఖను తాను ఎంతో అభివృద్ధి చేశానని ఒకటికి పదిసార్లు చెప్పుకుంటారు. కానీ విశాఖకు చంద్రబాబు [more]

Update: 2020-08-23 14:30 GMT

విశాఖ అంటే తనకు చాలా ఇష్టమని చంద్రబాబు పదే పదే చెబుతారు. విశాఖను తాను ఎంతో అభివృద్ధి చేశానని ఒకటికి పదిసార్లు చెప్పుకుంటారు. కానీ విశాఖకు చంద్రబాబు ఏమీ చేయలేదని గాలి తీసేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. విశాఖకు నిజమైన విలన్ బాబేనని ఆధారారలతో సహా వల్లె వేస్తున్నారు. చంద్రబాబు బూటకపు ప్రకటనలు తప్ప అసలైన ప్రగతి గతి విశాఖకు చూపించలేకపోయారని కూడా సాయిరెడ్డి అంటున్నారు. విశాఖలో ఈ మాత్రమైన అభివృద్ధి జరిగింది ఆ ఘనత అంతా వైఎస్సార్ దేనని కూడా చెబుతున్నారు.

ఏయూని దెబ్బతీశారు ….

విశాఖలో పురాతనమైన యూనివర్శిటీగా అంధ్ర విశ్వవిద్యాలయం ఉంది. తన వారికి చెందిన ప్రైవేట్ విశ్వవిద్యాలయం అభివృద్ధిని చేసి ఏయూని పక్కకు నెట్టిన ఘనత బాబుదేనని సాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. విశాఖలో ఐటీ సెక్టార్ అభివృద్ధి కోసం వైఎస్సార్ హయాంలో తీసుకున్న చర్యల మూలంగా 18 వేల మంది ఆనాడు ఇక్కడ ఉద్యోగాలు పొందారని చంద్రబాబు అయిదేళ్ల సీఎం పాలనలో వారి సంఖ్య పన్నెండు వేలకు ఎందుకు పడిపోయిందో జవాబు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

భూ కబ్జాలే కానుక‌….

ఇక విశాఖలో చంద్రబాబు జమానాలో భూకబ్జాలే ఎటు చూసిన చోటు చేసుకున్నాయని కూడా సాయిరెడ్డి చెప్పుకొస్తున్నారు. ఈ అయిదేళ్ళలో లక్ష వరకూ ప్రభుత్వ ఎకరాలకు సంబంధించిన భూమి రికార్డులు కనిపించలేదంటే ఆశ్చర్యమే మరి. ఇక వేలాది ఎకరాల భూములు దందాలకు గురి అయితే చంద్రబాబు తూతూ మంత్రంగా సిట్ విచారణను వేసి ఊరుకున్నారు. ఇదంతా అభివృద్ధే అంటారా బాబూ అని వైసీపీ నేత‌ ఆధారసహితంగానే నిలదీస్తున్నారు. విశాఖలో పెట్టుబడులు పెడతామని నాడు అంతా వస్తే వారిని అమరావతిలో పెట్టమని ఎగదోసి ఎటూ కాకుండా చేసిన ఘనత చంద్రబాబుదేనని కూడా అంటున్నారు.

గిరిపుత్రుడు జగనే…

అసలైన గిరిపుత్రుడు జగనేనని కూడా ఆయన చెబుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల విషయాల్లో రద్దు చేస్తూ ఒక జీవోను తెచ్చారని గుర్తు చేశారు. అదే చంద్రబాబు మాత్రం బాక్సైట్ తవ్వకాల విషయంలో గట్టి పట్టుదలతో పనిచేశారని, గిరిజనుల ప్రయోజనాలను దెబ్బతీశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇక అయిదేళ్ళ పాలన చివరకు వచ్చేంత వరకూ ఒక గిరిజన‌ మంత్రిని కూడా నియమించుకోలేని చిత్తశుద్ధి చంద్రబాబుది కాదా అని కూడా నిగ్గదీస్తున్నారు, ఇపుడు విశాఖ పాలనా రాజధాని అవుతోందని, అయినా కూడా దాన్ని దెబ్బతీయడానికి కుట్రలు పన్నుతున్నారంటే చంద్రబాబుకు విశాఖ మీద ప్రేమ ఉందా. లేక విలన్ గా ఆయన ఉన్నారా అన్నది జనమే తేల్చుకోవాలని అంటున్నారు. మొత్తానికి సాయిరెడ్డి చేస్తున్న విమర్శలతో తమ్ముళ్ళు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Tags:    

Similar News