ఏంటి…విడ్డూరం కాకపోతేనూ

ఏపీలో అధికారం మారి గట్టిగా రెండు నెలలు కూడా కాలేదు. ఇంకా బిగిసి యాభై ఎనిమిది నెలల సమయం ఉంది. జగన్ ను ఓడించి ముఖ్యమంత్రి కుర్చీ [more]

Update: 2019-07-14 13:30 GMT

ఏపీలో అధికారం మారి గట్టిగా రెండు నెలలు కూడా కాలేదు. ఇంకా బిగిసి యాభై ఎనిమిది నెలల సమయం ఉంది. జగన్ ను ఓడించి ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కాలన్న ఆశ తమ్ముళ్లకు ఉన్నా కూడా ఓపికగా ప్రతిపక్షంలో ఉండాలి. తమకు ప్రజలు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించి మెప్పు పొందాలి. అధికార పార్టీ తప్పులు చేస్తే ఎండగట్టాలి. అంతే తప్ప ముఖ్యమంత్రి కుర్చీ దిగు అని మొదటి రోజు నుంచే డిమాండ్ చేయడం మంచిది కాదు. ఇక అధికార పార్టీగా వైసీపీకి ఏపీ జనం కనీ వినీ ఎరగని మెజారిటీ కట్టబెట్టారు. జగన్ పార్టీలో ఉన్న వారికే పదవులు కేటాయించలేక సతమవుతున్నారు. అందుకే కొత్తగా బయట పార్టీల నుంచి మాకెవరూ వద్దు అంటూ డోర్లు మూసేసుకున్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో జగన్ చంద్రబాబు రాజీనామా కోరడం ఏంటి. విడ్డూరం కాకపోతేనూ. ఒకవేళ చంద్రబాబు రాజీనామా చేస్తే జగన్ కి కొత్తగా ఒరిగింది కూడా ఏమీ లేదు. ఇలా రెండు పార్టీలు కూడా అపుడే రాజీనామాల డిమాండ్లు పెట్టి సవాళ్ళు చేసుకోవడం ఓ విధంగా రాజకీయ దారుణంగానే చూడాలి.

రుణమాఫీ చేయలేదని….

చంద్రబాబు హయంలో రైతులకు రుణ మాఫీయే సరిగా చేయలేదన్న సంగతి అందరికీ తెలుసు. ఆ సంగతి అలా ఉంచితే రైతు రుణాల మీద వడ్డీలు లేకుండా మొత్తం ఖర్చు ప్రభుత్వమే కట్టేసిన పరిస్థితి లేనే లేదు. అసలు చంద్రబాబు జమానాలో సున్నా వడ్డీ ప్రస్తావనే లేదు. ఇది ఏపీలోని ప్రజలకు, రైతులకు కూడా తెలుసు కాబట్టే టీడీపీని ఓడించి వైసీపీకి పట్టం కట్టారు. ఇపుడు జగన్ కొత్తగా రుణ మాఫీ మీరు చేయలేదని నిరూపిస్తాను రాజీనామా చేస్తారా అని నిండు అసెంబ్లీలో సవాల్ చేయడం అనవసరమైన వాదనే. చంద్రబాబుని జనమే సీఎం పదవి నుంచి రాజీనామా చేయించారు. ఇపుడు 23 మందితో ఉన్న విపక్ష పదవి ఉన్నా లేకున్నా పెద్దగా విలువేముంది. జగన్ తన విషయంలో రాజీనామా ప్రస్తావన తేవడంతో బాబుకు ఎక్కడలేని రోషం తన్నుకువచ్చి ఆయన సైతం తాము ఎంతో కొంత రుణ మాఫీ చేశాం కాబట్టి జగన్ని రాజీనామా చేయమన్నారు. ఇలా ఆదిలోనే రాజీనామాల సవాళ్ళు చేసుకుంటూ ఇద్దరు నాయకులూ ఏం సందేశం జనాలకు ఇచ్చారన్నది వారికే తెలియాలి.

హుందా రాజకీయాలేనా…..

ప్రతీ రోజూ హుందా రాజకీయాలపై మాటలు చెప్పే చంద్రబాబు తాను మాత్రం వాటిని పాటించనని ఒట్టేసుకుంటారు. అందుకే ఆయన చెప్పేవి ఒకటి, చేసేవి ఒకటి అన్నట్లుగా ఉంటుంది. అసెంబ్లీలో తమ పాత్ర, పరిమితులు ఎరిగి మరీ చంద్రబాబు, ఆయన గారి తమ్ముళ్ళు వ్యవహరిస్తే ఏ ఇబ్బందులూ రావు. పైగా టీడీపీ దారుణమైన అయిదేళ్ళ పాలన ఇంకా కళ్ళ ముందు ఉంది. ప్రజలు దేన్ని మరచిపోలేదు.అందువల్ల ఏ విమర్శ చేసినా తిరిగి తమకే తగులుతుందని బాబు అండ్ కో గుర్తుంచుకోవాలి.. ఇక వైసీపీ సర్కార్ మీద ఇపుడే జోరు పెంచితే రానున్న రోజుల్లో ఇంకేం చేయగలుగుతారన్నది పెద్ద ప్రశ్న. ఇప్పటికైతే జగన్ మీద జనాలకు బాగా మోజు ఉంది. కొత్త సర్కార్ ఏదో ఒకటి తమకు చేస్తుందన్న ఆశ ఉంది. దాంతో జనాల చూపు జగన్ వైపు ఉంది. వైసీపీ సర్కార్ పనిని ముందు చేయనివ్వాలి. తప్పులు ఉంటే అది కూడా జనంలో ఏమైనా వ్యతిరేకత వస్తే అపుడు చంద్రబాబు గొంతు చించుకున్నా అర్ధం ఉంది. మరి తలపండిన రాజకీయనేత చంద్రబాబు తీరు మాత్రం హుందాగా లేదన్నది అందరి భావన.

Tags:    

Similar News