జూమ్ బరా బర్ జూమ్.. చంద్రబాబు ఇందులోనూ?

ప్రపంచంలో కరోనా తెచ్చిన మార్పులు అన్ని ఇన్ని కావు. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. ఒక్క ఫార్మా రంగం తప్ప అన్ని కుదేలు అయిపోయాయి. ఐటి రంగం పెను మార్పులకు [more]

Update: 2020-05-27 05:00 GMT

ప్రపంచంలో కరోనా తెచ్చిన మార్పులు అన్ని ఇన్ని కావు. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. ఒక్క ఫార్మా రంగం తప్ప అన్ని కుదేలు అయిపోయాయి. ఐటి రంగం పెను మార్పులకు లోనయింది. ఉద్యోగులు కోట్ల సంఖ్యలో నిరుద్యోగులుగా మహమ్మారి మార్చేసింది. ఇక రాజకీయ పార్టీల కార్యక్రమాల తీరు మొత్తం సమూల మార్పులకు లోనౌతుంది. అంతా కలిసి చర్చించుకునే కీలకమైన పాలిట్ బ్యూరో సమావేశాలనుంచి భారీ సభల వరకు ఇక పై అంతా ఆన్ లైన్ మయం కాబోతుంది. దీనికి తెలుగుదేశం పార్టీ తొలిగా శ్రీకారం చుట్టనుండటం విశేషం.

గతేడాది అలా ఈ ఏడాది ఇలా …

గత ఏడాది నుంచి తెలుగుదేశం పార్టీకి చెడ్డ రోజులే నడుస్తున్నాయి. సరిగ్గా ఎన్నికల ఫలితాలు వచ్చి పార్టీ చరిత్రలో ఎరుగని ఘోర పరాజయం మూటగట్టుకోవడంతో టిడిపి మహానాడు ను ఎగ్గొట్టేసింది. అసలే తీవ్ర అవమానాలు, అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్న వేళ, అధినేత చంద్రబాబు సైతం షాక్ నుంచి కోలుకొని సందర్భంలో పార్టీ మహానాడు ను నిర్వహించడం వల్ల మరిన్ని వివాదాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుందని పసుపు సంబరం ఏడాది పాటు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో 2020 మహానాడు మాత్రం మంచి ధూమ్ ధామ్ గా చేపట్టాలని భావించిన టిడిపికి కరోనా రూపంలో మరో అడ్డంకి వచ్చి పడింది. దాంతో ఈసారి కూడా ఈ వంక తో నిర్వహించకపోతే పార్టీ పని అయిపోయిందనే ప్రచారం ఎక్కువ అవుతుందని భావించి కొత్త తరహాకు అధిష్టానం సన్నాహాలు చేస్తుంది.

ఇక అంతా జూమ్ జూమ్ …

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు జూమ్ యాప్ ద్వారా సభలు, సమావేశాలు జోరుగా నడుస్తున్నాయి. ఆన్లైన్ క్లాస్ లు సైతం విద్యార్థులకు జూమ్ లోనే మొదలు అయ్యాయి. మహమ్మారి వచ్చిన నాటినుంచి టిడిపి అధినేత సైతం టిడిపి శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ నుంచి హోమ్ క్వారంటైన్ నుంచే సలహాలు సూచనలు, విమర్శలు ఆరోపణలు మొదలు అన్ని ఆన్లైన్ లో నడిపించేస్తున్నారు. ప్రధాని మోడీ నుంచి అంతా ఇదే బాటలో ప్రయాణం సాగిస్తున్నారు. టెక్నాలజీ అంటే బాబు … బాబు అంటే టెక్నాలజీ అనే స్థాయిలో గతంలో పద్నాలుగున్నర ఏళ్ళు ఆయన ప్రచారాన్ని ఆ పార్టీ మీడియా బాగా నడిపింది. ఇప్పుడు కూడా మారిన ప్రపంచంతో బాటు తమ పార్టీ ఆధునికతను సంతరించుకుందని చాటిచెప్పేందుకు ఇప్పుడు మహానాడు ను టిడిపి వేదికగా చేసుకోనుంది.

ఆ సందడి ఇక ఉండదేమో …

ధునిక సాంకేతికతతో నడిచే తాజా మహానాడు లో 10 వేలమంది ఆన్ లైన్ లోకి వచ్చి సందడి చేయనున్నారు. ఈ వినూత్న కార్యక్రమం విజయవంతం అయితే భవిష్యత్తులో చంద్రబాబు తాజా ఫార్ములానే అనుసరించే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి పండుగనే చెప్పాలి. అన్ని జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చే నేతలు, కార్యకర్తలు వారిని సాదరంగా ఆహ్వానిస్తూ షడ్రుచులతో ఘుమ ఘుమలాడే వంటకాలతో మహానాడు అదిరిపోయేది.

పది రోజుల ముందు తర్వాత….

మహానాడు కి పదిరోజుల ముందు తరువాత కూడా దీనిపై చర్చ నడిచేది. ఇప్పుడు అదంతా పాత కథగానే కరోనా మార్చేసింది అనే చెప్పొచ్చు. తాజాగా అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని కోట్ల రూపాయల ఖర్చును సైతం ఆదా చేసుకునే అవకాశం కొత్త తరహా మహానాడు కల్పించనుంది. దాంతో కరోనా కు వ్యాక్సిన్ వచ్చే వరకు అన్ని రాజకీయ పార్టీలు తమ తమ పార్టీ పండుగలను ఇదే తీరులో నిర్వహించక తప్పక పోవచ్చు. బహిరంగ సభలు సమావేశాలు పెడితే భౌతిక దూరం సాధ్యం కాదు. దాంతో ఈ ఫార్ములానే ఇక అంతా అనుసరిస్తే ఖర్చు కు ఖర్చు తగ్గుతుంది శ్రమ కూడా ఉండదు మరి.

Tags:    

Similar News