బాబు తప్పుడు వ్యూహాలే జగన్ కి బలం… ?

చంద్రబాబు ముక్కుసూటిగా ఏనాడూ మాట్లాడరు, అలాగే రాజకీయాలు కూడా స్ట్రైట్ గా చేయరు. ఆయన చెప్పింది చేయరు, చేసింది చెప్పరు అని పేరు. అలాంటి చంద్రబాబు జగన్‌ను [more]

Update: 2021-08-27 06:30 GMT

చంద్రబాబు ముక్కుసూటిగా ఏనాడూ మాట్లాడరు, అలాగే రాజకీయాలు కూడా స్ట్రైట్ గా చేయరు. ఆయన చెప్పింది చేయరు, చేసింది చెప్పరు అని పేరు. అలాంటి చంద్రబాబు జగన్‌ను గద్దె దించాలంటే ప్రజా బలం ఉండాలి అనుకోవడంలేదు. ఇంతటి సుదీర్ఘ అనుభవం కలిగిన నేత ప్రజలతో కాకుండా జగన్‌ను వేరే మార్గాల ద్వారా పక్కన పెట్టాలని అనుకుంటోన్న ప‌రిస్థితే ప్ర‌స్తుతం టీడీపీలో క‌నిపిస్తోంది. దాంతో అక్కడే చంద్ర‌బాబు ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు రాజకీయం డెబ్బైల నాటిది. ఈ రోజుల్లో అసలు కుదిరేది కాదు, ఇది సోషల్ మీడియా యుగం. చీమ చిటుక్కుమంటే చాలు అందరికీ తెలిసిపోతోంది. అలాంటిది వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజుని అడ్డం పెట్టుకుని జగన్‌ను బదనాం చేయాలని చంద్రబాబు వేసిన ఎత్తులు బ‌ట్ట‌బ‌య‌లు అవుతున్నాయి. దీంతో రఘురామ కంటే కూడా టీడీపీ ఇరకాటంలో పడాల్సి వస్తోంది.

పొత్తులు, ఎత్తులతోనే….?

నాడు ఎన్టీఆర్ ప్రజాదరణతోనే మూడు సార్లు సీఎం అయ్యారు. చంద్రబాబు మాత్రం ఎప్పుడూ పొత్తులు ఎత్తులు, వ్యూహాలనే నమ్ముకుంటున్నారు. ఆయన ఎత్తులు గతంలో పారేవి. ఇపుడు మాత్రం చిత్తు అవుతున్నాయి. చంద్రబాబు నిజంగా జగన్‌ను ఓడించాలి అంటే జనంలోకి రావాలి. ఆయన విధానాల మీద పోరాడాలి. అటు క్యాడర్ కి గట్టి భరోసా కల్పించాలి. ఇటు జనాలకు తాను బ‌ల‌మైన ప్ర‌త్యామ్నాయ నేత‌ను అని చెప్పాలి. కానీ చంద్రబాబు ఎందుకో ఆ రూట్ ఎంచుకోవడంలేదు. ఎంతసేపూ అనుకూల మీడియా ద్వారా జగన్ మీద విమర్శలు చేయించడం వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూడడంతోనే రెండేళ్ల పుణ్య కాలం కాస్తా గడచిపోయింది.

ప్రతిపక్షంలో ఉండి….

నిజానికి రెండేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉండ‌డం అంటే ఎక్కువ కాల‌మే. మ‌రో రెండు మూడు నెల‌ల్లో స‌గం టైం అయిపోతుంది. ఈ రెండున్న‌రేళ్ల‌లో చంద్రబాబు చేసిన ప్ర‌జా ఉద్య‌మాల వ‌ల్ల వైసీపీకి చిన్న మైన‌స్‌కూడా లేదు. ఇవేమీ జనాలను ప్రభావితం చేయలేదని ఈ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎన్నికల వరకూ ఫలితాలు నిరూపించాయి. ప్రజలకు కావాల్సింది తమ గురించే. ఏ నాయకుడు ఏంటి అన్నది వారికి అనవసరం. వారికి ఇపుడు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఇక జగన్ తప్పుడు నిర్ణయాలు ఎన్ని తీసుకున్నా వాటి ప్రభావం జనాల మీద పడనంతవరకూ వారు మౌనంగానే ఉంటారు. ఇపుడు అదే జరుగుతోంది.

ఇలాగే వెళితే…?

ఇక రఘురామ ఎపిసోడ్ విషయంలో కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కానీ చంద్రబాబు మాత్రం దాన్ని హైలెట్ చేసి జగన్ని జైలుకు పంపాలని చూస్తున్నారు. కానీ జగన్ ప్రజలలో ఉన్న నేత. ఆయన్ని ఓడించాలి అంటే ఎప్పటికైనా టీడీపీ కూడా ప్రజలలో ఉండి మాత్రమే గెలవాలి. ఇంద్రజిత్తు మాదిరిగా ఆకాశంలో ఉంటూ బాణాలు వేస్తే కుదరదు. ఇప్పటికే చంద్రబాబు, చినబాబు ఇద్దరూ కూడా విపక్ష పాత్ర సవ్యంగా పోషించడంలేదని సొంత పార్టీలోనే విమర్శలు ఉన్నాయి.ఇదే తీరున టీడీపీ బండి సాగితే మాత్రం టీడీపీ 2024 ఎన్నిక‌ల‌కు ముందే బొక్క బోర్లా ప‌డేలా ఉంది.

Tags:    

Similar News