మళ్లీ రిపీట్ చేయాలనేనా?

చంద్రబాబు రాజకీయాలకు మిత్ర పక్షాలు ఎపుడూ కరివేపాకులే అవుతూ వస్తున్నాయి. ఆ సత్యం తెలిసినా కూడా బలం పెంచుకోకుండా ప్రతీ అయిదేళ్ళకూ ఏదో ప్రధాన‌ పార్టీ జట్టు [more]

Update: 2021-01-01 03:30 GMT

చంద్రబాబు రాజకీయాలకు మిత్ర పక్షాలు ఎపుడూ కరివేపాకులే అవుతూ వస్తున్నాయి. ఆ సత్యం తెలిసినా కూడా బలం పెంచుకోకుండా ప్రతీ అయిదేళ్ళకూ ఏదో ప్రధాన‌ పార్టీ జట్టు కట్టాలని తాపత్రయపడుతూనే ఉంటాయి. ఏపీలో రాజకీయ పరిస్థితులు ఇపుడు కొంత సందిగ్దంలో ఉన్నాయి. తెలుగుదేశానికి దూరం అని బీజేపీ అంటున్నా ఎన్నికలు జరిగే సమయం వరకూ ఎవరూ ఏమీ చెప్పలేరు. బహుశా ఆ ధీమాతోనే చంద్రబాబు కూడా బీజేపీని పల్లెత్తు మాట అనకుండా జాగ్రత్తగా ఉన్నారు. మరో వైపు చూసుకుంటే అమరావ‌తి రాజధాని వేదికగా వామపక్ష పార్టీలు టీడీపీకి చెరో వైపునా నిలబడ్డాయి.

కోటి ఆశలతోనే …

చంద్రబాబుకూ బీజేపీకి చెడిందని వామపక్షాలు ఇప్పటికైతే గట్టిగానే నమ్ముతున్నాయి. పైగా అమరావతి ఉద్యమానికి మొదటి నుంచి సీపీఐ మద్దతు ఇస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ చంద్రబాబుకు కుడి భుజంగా మారి ఆయన మాటలనే వల్లిస్తున్నారు. మరో వైపు జాతీయ కార్యదర్శి నారాయణ కూడా చంద్రబాబు కంటే కూడా ఎక్కువగా జగన్ ని విమర్శిస్తున్నారు. అమరావతి రాజధానిని కొనసాగించాలని గట్టిగా కోరుతున్నారు. జగన్ ముప్పయేళ్ళ సీఎం కాదు, మూడేళ్ళ సీఎం అంటూ జమిలి ఎన్నికల ఉత్సాహం కూడా తెచ్చుకుని నారాయణ హుషార్ చేస్తున్నారు.

వాడుకుంటున్నారా…?

చంద్రబాబు అమరావతి రాజధాని ఉద్యమం పేరిట చంద్రబాబు హడావుడి చేసినపుడు బీజేపీ దూరంగా ఉంది. జనసేన కూడా బీజేపీతో పొత్తు బంధం పెనవేసుకుంది. అపుడు పక్కన ఉన్నది సీపీఐ మాత్రమే. ఈ మధ్యనే సీపీఎం కూడా తన స్టాండ్ మార్చుకుని ఒకే రాజధాని అమరావతి అంటూ నినదిస్తోంది. అయితే అమరావతి ఉద్యమం ఏడాది అయిన వేళ నిర్వహించిన జనభేరి సభకు అటు వామపక్షాలే కాదు, ఇటు బీజేపీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ మధ్యన సోము వీర్రాజు కూడా అమరావతి రాజధానికి మోడీ మద్దతు ఉందంటూ తాను మోడీ మనిషిగా దీనిని చెబుతున్నానని పక్కా క్లారిటీగా చెప్పడంతో ఏపీ రాజకీయం కీలకమైన మలుపు తిరిగింది.

బాబు కూటమి అదేనా…?

సరిగ్గా ఇపుడే చంద్రబాబు తన అసలైన ఆలోచనలకు పదును పెడుతున్నారు. ఎటూ బీజేపీ అమరావతి రాజధానికి మద్దతు ఇచ్చింది. జనసేన కూడా కలసివస్తోంది. దాంతో 2014 నాటి పొత్తును ఏపీలో రిపీట్ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో జమిలి ఎన్నికలు వస్తే బీజేపీకి శక్తి కూడదీసుకునే టైమే కాదు చాన్సే కూడా ఉండదు, అందువల్ల టీడీపీతో సీట్ల బేరానికి దిగాల్సిందే. అది తనకు అడ్వాంటేజ్ గా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఎటూ జనసేన అధినేత పవన్ చంద్రబాబుకు సానుకూలంగానే ఉంటారు. కాబట్టి బీజేపీని దారికి తేవడం పెద్ద కష్టం కాబోదని బాబు సరికొత్త లెక్కలు వేసుకుంటున్నారు. అదే కనుక జరిగితే బీజేపీ ఉన్న కూటమిలో వామపక్షాలు అసలు ఉండవు, చంద్రబాబు కూడా వారిని పెద్దగా పట్టించుకోరు. మరి బాబు పక్కన నిలబడి ఇపుడు జగన్ మీద ఎగిరెగిరి పడుతున్న ఎర్రన్నలు రేపటి రోజున ఎటూ కాకుండా పోయి బాబు రాజకీయానికి కరివేపాకులు అవుతారా అన్న డౌట్లు అయితే ఉన్నాయి.

Tags:    

Similar News