లోకేష్ ప్లేస్ లో….?

చంద్రబాబు తరువాత తెలుగుదేశానికి బాస్ ఎవరు ? అనే ప్రశ్నకు మొన్నటివరకు లోకేష్ అన్నది సమాధానం. కానీ మొన్నటి ఎన్నికల్లో మంగళగిరి లో లోకేష్ ఓటమి తరువాత [more]

Update: 2020-01-16 05:00 GMT

చంద్రబాబు తరువాత తెలుగుదేశానికి బాస్ ఎవరు ? అనే ప్రశ్నకు మొన్నటివరకు లోకేష్ అన్నది సమాధానం. కానీ మొన్నటి ఎన్నికల్లో మంగళగిరి లో లోకేష్ ఓటమి తరువాత జరిగిన పరిణామాలు ఆ పదవిని చినబాబు కి దూరం చేస్తున్నట్లు ఆ పార్టీ లో చర్చ నడుస్తుంది. అద్భుత సినీ చరిష్మా తో రాజకీయ అరంగేట్రం చేసిన ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ లో సంక్షోభాలు కొత్తేమీ కాదు. లక్ష్మీపార్వతిని సాకుగా చూపి అదను చూసి ఎన్టీఆర్ ను దెబ్బకొట్టి పదవీచ్యుతుడ్ని చేసిన తరువాత చంద్రబాబు తెలుగుదేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోరాటం చేసే దశలోనే ఎన్టీఆర్ అస్తమయంతో చంద్రబాబు రాజకీయ జైత్ర యాత్రకు పార్టీలో తిరుగు లేకుండా పోయింది. ఎన్టీఆర్ టిడిపి గా పేరుపెట్టుకుని లక్ష్మీపార్వతి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆ తరువాత అన్న తెలుగుదేశం పార్టీ పేరిట హరికృష్ణ చేసిన మరో ప్రయత్నాన్ని చంద్రబాబు తన మేధస్సుతో తిప్పికొట్టి పార్టీ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గత పాతికేళ్లుగా సోలో గానే చక్రం తిప్పేస్తున్నారు.

వయోభారం తో …

ఏడుపదుల వయసులో యువకుడైన జగన్ తో సమానంగా చంద్రబాబు పోరాటం సాగిస్తున్నారు. అయితే పరిస్థితులు గతానికన్నా భిన్నంగా వున్నాయి. ఒక పక్క సీనియర్లు పార్టీ కి గుడ్ బై కొడుతూ ఉండటం, మరోపక్క పార్టీని నడిపించడానికి ఆర్ధిక వనరులు సమీకరణ కష్టమౌతున్న నేపధ్యం ఇంకోపక్క చేతికి అందిరాని కుమారుడు చంద్రబాబును, పార్టీ ని సైతం కుంగదీస్తున్నాయి. లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించలేకే ఇటీవల చాలా మంది వైసిపి, బిజెపి ల తీర్ధం పుచ్చేసు కుంటున్నారు. ప్రస్తుతం వున్న ఎమ్యెల్యేలను సైతం కాపాడుకోలేక నిస్సహాయస్థితికి టిడిపి పడిపోతుంది. ఈ నేపథ్యంలో పార్టీకి యువరక్తం తక్షణ అవసరం గా కనిపిస్తుంది. దాంతో చంద్ర బాబు తరువాత టిడిపి కి నేతృత్వం ఎవరు వహిస్తారు అన్న చర్చ పెద్ద ఎత్తునే నడుస్తుంది.

యనమల తేల్చేశారు …

ఇటీవల మాజీ ఆర్ధికమంత్రి టిడిపి పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తరువాత ఎవరు అనే ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో జవాబు చెబుతూనే లోకేష్ నేతృత్వానికి పార్టీలో మద్దతు పెద్దగా లేదనే అంశం తేల్చేశారు. లోకేష్ కి పార్టీని ప్రస్తుతం డీల్ చేసే స్థాయికి రాలేదని సమర్ధత ఎవరికి ఉంటే వారు ఆ స్థానం భర్తీ చేస్తారని చెప్పేశారు. టిడిపి లో కీలక నేత అయిన యనమల వ్యాఖ్యలను బట్టి లోకేష్ కి బదులు మరొకరికి చంద్రబాబు పట్టాభిషేకం చేయడానికి డిసైడ్ అవుతున్నట్లు టాక్ రన్ అవుతుంది.

బ్రహ్మిణి అయితేనే ….

అటు నారా ఇటు నందమూరి కుటుంబాల్లో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఉండాలంటే పార్టీ డ్రైవింగ్ సీటు ఆయన కోడలు బ్రహ్మిణి అయితేనే కరెక్ట్ అని పార్టీ వర్గాలు కోరుకుంటున్నాయి. విద్యావంతురాలు, వ్యాపారవేత్తగా ఆమె దూసుకుపోతున్న నేపథ్యంలో రాజకీయాల్లో సైతం తాత ఎన్టీఆర్ వారసత్వాన్ని అలాగే మామగారు చంద్రబాబు మార్క్ కాపాడుతూ పార్టీని ఒడ్డున పాడేస్తారని ఎక్కువమందిలో చర్చ సాగుతుంది. బ్రహ్మిణి కి క్యాడర్ లో వున్న నమ్మకం గమనించే అమరావతి ఉద్యమంలోకి కోడల్ని తాజాగా చంద్రబాబు రంగంలోకి దించేశారని ఇప్పటినుంచి ఆయన శిక్షణ మొదలు పెట్టినట్లే అంటున్నారు. కోడలు బ్రహ్మిణి, భార్య భువనేశ్వరి ఉద్యమ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటే ఈ కార్యక్రమంలో లోకేష్ ను పక్కన పెట్టేశారు చంద్రబాబు. ఏ సమయంలో ఎవరు తనకు అవసరం అవుతారో వారిని సరిగ్గా వినియోగించుకోవడంలో చంద్రబాబు ను మించిన దిట్ట ఎవ్వరు లేరు. ఎత్తుగడల్లో చాణుక్య నీతిని అనుసరించే చంద్రబాబు భవిష్యత్తు నేతను తొందరగా బరిలోకి దింపుతారా లేక మరికొన్నాళ్లు ఆగుతారా అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News