బాబు పక్కన శల్యులే ఎక్కువటగా

అసలే ఓటమి భారంతో కుంగిపోయి ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి సొంత పార్టీ నేతలే ఇబ్బందికరంగా మారారు. అనవసరమున్నా లేకపోయినా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ పరువును [more]

Update: 2019-09-15 14:30 GMT

అసలే ఓటమి భారంతో కుంగిపోయి ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి సొంత పార్టీ నేతలే ఇబ్బందికరంగా మారారు. అనవసరమున్నా లేకపోయినా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ పరువును బజారు కీడుస్తున్నాయి. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ఏం చేయలేని పరిస్థితి. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకబోగా పార్టీ లైన్ కు విరుద్ధంగా మాట్లాడుతుండటాన్ని టీడీపీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. నేతల నోళ్లను కట్టడి చేయాలని చంద్రబాబుకు ఉన్నప్పటికీ తన మాట వింటారో లేదో? అన్న డౌట్ తో ఆయన కూడా మౌనంగానే ఉన్నారు.

బాబు పోరాటం చేస్తుంటే…..

వైఎస్ జగన్ వంద రోజుల పాలనపై చంద్రబాబు అండ్ టీం ఏకంగా రెండు పుస్తకాలు విడుదల చేసింది. జగన్ పాలన అంతా ప్రతీకారంతోనే సాగుతుందని, అభివృద్ధి పూర్తిగా పడకేసిందని టీడీపీ ఆరోపించింది. జగన్ ది రాక్షస పాలనగా అభివర్ణించింది. అయితే ఇందుకు విరుద్థంగా సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. జగన్ తెలివైనోడని పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు తాజాగా చంద్రబాబు చేసిన తప్పుల వల్లనే పార్టీ నేతలు వెళ్లిపోతున్నారన్నారు. బీజేపీ రాష్ట్రంలో బలపడుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

డొక్కా వివాదాస్పద వ్యాఖ్యలతో….

ఇక మరో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా పార్టీని కరెక్ట్ సమయంలో ఇరకాటంలో పడేశారు. తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీదేవిని కొందరు అగ్రకులాల వాళ్లు దూషించడం సెన్సేషనల్ అయింది. టీడీపీ నేతలే దళిత ఎమ్మెల్యేను అడ్డుకున్నారని, దూషించారని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే టీడీపీలోనే ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ మాత్రం ఎమ్మెల్యే పై జరిగిన ఘటనను ఖండిస్తూ వైసీపీ వ్యాఖ్యలను సమర్థించారు. ఆయనకు, తాడికొండ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కు మధ్య ఉన్న విభేదాలతోనే ఆయన పార్టీ లైన్ కు విరుద్ధంగా ఈ వ్యాఖ్యలను చేసినట్లు పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.

శక్తినంతా కూడదీసుకుని….

ఒకవైపు చంద్రబాబు పోయిన శక్తినంతా కూడదీసుకుని జగన్ పై పోరాటానికి దిగుతుంటే శల్య సారథ్యంలా కొందరు టీడీపీ నేతలే అడ్డుకుంటున్నారన్నది వాస్తవం. డొక్కా మాణిక్య వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరాలని ఒక దశలో చంద్రబాబు అనుకున్నప్పటికీ మళ్లీ దానిని సీనియర్ నేతల సూచనతో విరమించుకున్నారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే గంటా శ్రీనివాసరావు కూడా విశాఖ భూకుంభకోణంపై పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా జగన్ కు లేఖ రాయడాన్ని కూడా కొందరు నేతలు తప్పుపడుతున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు ఇంట్లో అంటే పార్టీలోనే శత్రువులు ఎక్కువగా తయారయినట్లు కనపడుతుంది. మరి ఈ పరిస్థితిని చంద్రబాబు ఎలా చక్కదిద్దుతారో చూడాలి.

Tags:    

Similar News