బాబు ఆ పని చేసి ఉంటే?

అమ‌రావ‌తి విష‌యంలో ఏం జ‌రిగింది ? ఎందుకు ఇప్పుడు ఇంత‌గా అల్లరి జరుగుతోంది? జ‌గ‌న్ ప్రభుత్వం.. గ‌త చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు తిర‌గ‌దోడింది ? [more]

Update: 2020-01-09 12:30 GMT

అమ‌రావ‌తి విష‌యంలో ఏం జ‌రిగింది ? ఎందుకు ఇప్పుడు ఇంత‌గా అల్లరి జరుగుతోంది? జ‌గ‌న్ ప్రభుత్వం.. గ‌త చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు తిర‌గ‌దోడింది ? ఏ ప్రభుత్వమైనా.. మారిన త‌ర్వాత ఇలా రాజ‌ధానుల‌ను మార్చే అవ‌కాశం ఉంటుందా ? ఉంటే అదెలా సాధ్యం? ఇప్పుడు రాష్ట్రంలో సామాన్యుల‌ను వేధిస్తున్న ప్రధాన ప్రశ్న. నిజానికి రాజ‌ధాని విష‌యం తెర‌మీదికి వ‌చ్చిన త‌ర్వాత అమ‌రావతిని మారిస్తే.. న‌ష్టం.. క‌ష్టం.. అంటూ చెబుతున్న వారు ఈ కోణాన్ని మాత్రం దాస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. నాడు చంద్రబాబుకు కూడా ప్రజ‌లే అధికారం ఇచ్చారు.

భిన్నాభిప్రాయాలు….

ఆయ‌న.. రాజ‌ధానిని అమ‌రావ‌తిలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 5200 కోట్లను ఖ‌ర్చును చేశారు. వివిధ భ‌వంతుల‌ను నిర్మించారు. మ‌రిన్నింటికోసం ప‌క్కా ప్రణాళిక‌తో ముందుకు సాగారు. ఇంత‌లోనే ఎన్ని క‌లు వ‌చ్చాయి. ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ రాజ‌ధానిని మూడు భాగాలుగా చేసి ప్రధాన రాజ‌ధానిని విశాఖ‌కు త‌ర‌లిస్తామ‌ని వైసీపీ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీంతో రాజ‌ధాని ప్రాంతంలో ఆందోళ న‌లు మిన్నంటాయి. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణయం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ‌, క‌ర్నూలు ప్రాంతాల్లో రాజ‌ధానులు వ‌స్తున్నాయ‌నే ఆనందం ఆయా ప్రాంతాల్లో క‌నిపిస్తున్నా మ‌ళ్లీ ప్రభుత్వం మారితే ఇవి ఉంటాయా? అనే సందేహం వ్యక్తమ‌వుతోంది.

నాడు బాబు….

ఈ నేప‌థ్యంలో నాడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఎందుకు ఇప్పుడు రివ‌ర్స్ అయింది? రేపు జ‌గ‌న్ తీసుకోబోయే నిర్ణయం ఎందుకు రివ‌ర్స్ కాకుండా ఉంటుంది? అనే అంశాల‌పై సామాన్యుల నుంచి ప్రశ్న లు వ‌స్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వ హ‌యాంలో ఏం జ‌రిగిందో ఒక్క‌సారి ప‌రిశీలిద్దాం. అప్పటి రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఉన్న కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఏపీకి రాజ‌ధాని కోసం శివ‌రా మ‌కృష్ణన్ క‌మిటీని వేసింది. ఈ క‌మిటీ అధ్యయ‌నం చేసి.. కొన్ని ప్రతిపాద‌న‌లు పంపింది. మూడు ప్రాంతా ల్లోనూ అభివృద్ది కోరుకుంటున్నార‌ని క‌మిటీ తెలిపింది. అయితే, మూడు ప్రాంతాల్లోనూ రాజ‌ధానుల ఏర్పా టు అసాధ్యం అని తేల్చి చెప్పింది. కానీ, పాల‌న మాత్రం మూడు ప్రాంతాల నుంచి స‌మానంగా సాగాల‌ని స్పష్టం చేసింది.

కమిటీ సూచనలను పట్టించుకోకుండా…

అదే స‌మ‌యంలో ప్రజ‌లు ఎక్కువ‌గా విజ‌య‌వాడ కేంద్రంగా రాజ‌ధానిని కోరుకుంటున్నార‌ని శివ‌రామ‌కృష్ణన్ కమిటీ త‌న నివేదిక‌లో చెప్పారు. అయితే న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో వ‌ద్ద‌దని కూడా సూచించారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో రాష్ట్ర రాజ‌ధాని అంశం రాష్ట్రం ప‌రిధిలోనే ఉంటుంద‌ని శివ‌రామ‌కృష్ణన్ కమిటీ స్పష్టం చేసింది. అయితే, రాజ‌ధానిని ఏర్పాటు చేయాల‌నుకున్న స‌మ‌యంలో మాత్రం కేంద్రంతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాల‌ని ప్రధాన సూచ‌న చేశారు. ఇక‌, ఈ క‌మిటీ నివేదిక‌ను ప‌క్కన పెట్టిన చంద్రబాబు అప్పటి మంత్రి పొంగూరు నారాయ‌ణ నేతృ త్వం తో బీద మ‌స్తాన్ రావు(ఇప్పుడు వైసీపీలో ఉన్నారు) స‌భ్యుడి గా క‌మిటీ వేశారు.

మంత్రి వర్గ నిర్ణయాన్నే……

ఈ క‌మిటీ దేశ‌వ్యాప్తంగా ప‌ర్యటించి వివిధ రాజ‌ధానులు ప‌రిశీలించి నివేదిక ఇచ్చింది. దీనిని ఆధారంగా చేసుకునిఅప్పటి సీఎం చంద్రబాబు త‌న కేబినెట్ లో చ‌ర్చించి దీనిపై అసెంబ్లీలో ప్రక‌ట‌న చేశారు. 2014, సెప్టెంబ‌రు 4న జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశంలో రాజ‌ధానిపై త‌న కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అసెంబ్లీ లో చ‌దివి వినిపించారు. అనంతరం త‌మ రాజ‌ధానికి కేంద్రం సాయాల‌ని కోరుతూ కేంద్రానికి విన‌తిని అసెంబ్లీ ద్వారా పంపారు. అయితే, ఇక్కడే తొలి త‌ప్పట‌డుగు ప‌డింది. రాజ‌ధానిపై అసెంబ్లీ తీర్మానం చేయ‌లేదు. కేవ‌లం కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే చ‌దివి వినిపించారు.

భాగస్వామ్యం లేకుండా….

ఇక, రెండో త‌ప్పు.. రాజ‌ధాని ఎంపిక‌లో అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని భాగ‌స్వామ్యం చేయాలని శివ‌రామ‌కృష్ణన్ క‌మిటీ సిఫార‌సు చేసినా.. చంద్రబాబు ఈ సూచ‌న‌ను ప‌ట్టించుకోకుండా.. తాము ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నామ‌ని సాయం చేయాల‌ని మాత్రమే ఆయ‌న కేంద్రాన్ని కోరుతూ విన‌తిని పంపారు. ఇది కూడా అసెంబ్లీలో తీర్మానం కాలేదు. ఫ‌లితంగా ఏపీ రాజ‌ధానిపై కేంద్రం ప‌ట్టించుకోలేదు. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న మేర‌కు నిధులు ఇచ్చేందుకు సిద్ధప‌డినా మాకెందుకులే అనుకుంది. దీనికితోడు ఏపీ రాజ‌ధాని విష యంపై పార్లమెంటులో చ‌ర్చ కూడా జ‌ర‌గలేదు.

గజిట్ ప్రకటించి ఉంటే….

(ఇలా ఎందుకు చేయాలి? అంటే.. పార్లమెంటులో చ‌ర్చ జ‌రిగి.. పార్లమెంటులోనూ కేంద్రం ఓకే చేసి ఉం టే.. రాష్ట్రప‌తి ఆమోద ముద్రతో గెజిట్‌లో ప్రక‌టించేవారు. ఫ‌లితంగా.. ఇది రాజ్యాంగంలోని రాష్ట్రాల జాబి తాలో ఉన్న రాజ‌ధానుల్లో చేరిపోయి ఉండేది. కానీ అలా చేర‌లేదు) దీంతో రాజ‌ధానిపై రాజ్యాంగ ర‌క్షణ కొర వ‌డింది. దీంతో రాజ‌ధాని విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. రాజ్యాంగ ర‌క్షణే కొర‌వ‌డిన‌ప్పుడు కేంద్రం ఎలా జోక్యం చేసుకుంటుంది? అనేది కీల‌క ప్రశ్న. మొత్తంగా చంద్రబాబు అప్పట్లోనే జాగ్రత్త ప‌డి అసెంబ్లీలో ఉభ‌య‌స‌భ‌ల స‌మావేశం ఏర్పాటు చేసి ప‌క్కాగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించి ఆమోదముద్ర వేయించుకుని, రాజ్యాంగంలో చేర్చి ఉంటే ఇప్పుడు మార్పు అనేది ఎవ‌రికీ సాధ్యమ‌య్యే అవ‌కాశం ఉండేది కాదు.

కేంద్రం నిర్ణయంతోనే?

ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ విష‌యం చూద్దాం.. పైన చెప్పుకొన్న విధంగా ఇప్పుడు జ‌గ‌న్ ప్రతి విష‌యంలోనూ జాగ్రత్త తీసుకుంటున్నారు. రెండు క‌మిటీల‌ను వేశారు. నివేదిక‌లు తెప్పించుకున్నారు. దీనిపై హైప‌వ‌ర్ మంత్రులు, అధికారుల క‌మిటీ వేశారు. దీనిని కేబినెట్లో చ‌ర్చిస్తున్నారు. అనంత‌రం అసెంబ్లీ, మండ‌లిని సంయుక్తంగా స‌మావేశ ప‌రిచి తీర్మానం చేయ‌నున్నారు. అనంత‌రం దీనిని కేంద్రానికి పంపించ‌నున్నా రు. అప్పుడు కేంద్రం ఒక నిర్ణయం ప్రక‌టించి(పైన‌.. అమ‌రావ‌తి విష‌యం ఇది జ‌ర‌గ‌లేదు.. ఇదే విష‌యాన్ని తాజాగా కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి కూడా చెప్పారు. మ‌మ్మ‌ల్ని అడిగిన‌ప్పుడు మా అభిప్రాయం చెబు తాం అన్నారు) రాజ‌ధానికి ఆమోద ముద్ర వేస్తుంది. దీంతో ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా.. రాజ‌ధానిపై క‌లుగ‌జేసుకునే అవ‌కాశం ఉండ‌దు. సో.. చంద్రబాబు చేసిన వ్యూహాత్మక‌ లోపంతో కూడిన త‌ప్పిదం ఇప్పుడు రాజ‌ధాని మార్పుకు కార‌ణ‌మ‌నే విస‌యం స్పష్టంగా తెలుస్తోంది. అయితే, ఇది తెలిసిన కొన్ని వ‌ర్గాలు చంద్రబాబును త‌ప్పు ప‌ట్టాల్సి వ‌స్తుంద‌నే కార‌ణంగా దాస్తున్నాయ‌నే అభిప్రాయం వ్యక్తమ‌వుతోంది.

Tags:    

Similar News