ఆశ జారి గల్లంతయ్యిందే

వారంతా ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, రాజ‌కీయాల్లో వార‌సులుగా ఎదిగిన వారు కొంద‌రు… రాజ‌కీయాల‌ను అడ్డు పెట్టుకుని వ్యాపారాలు సాగిస్తున్నవారు మ‌రికొంద‌రు.. వారంద‌రికీ ఏకైక నాయ‌కుడు చంద్రబాబు. ప‌దేళ్లపాటు [more]

Update: 2019-12-26 06:30 GMT

వారంతా ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, రాజ‌కీయాల్లో వార‌సులుగా ఎదిగిన వారు కొంద‌రు… రాజ‌కీయాల‌ను అడ్డు పెట్టుకుని వ్యాపారాలు సాగిస్తున్నవారు మ‌రికొంద‌రు.. వారంద‌రికీ ఏకైక నాయ‌కుడు చంద్రబాబు. ప‌దేళ్లపాటు ప్రతిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో వారంతా ఆయ‌న‌కు అండ‌గా నిలిచారు. ఈ క్రమంలోనే చంద్రబాబు చేసిన వ‌స్తున్నా మీకోసం.. వంటి యాత్రల‌కు విరివిగా ధ‌నాన్ని ఇచ్చారు. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో వ్యూహాత్మకంగా ఖ‌ర్చు చేశారు. టీడీపీ గెలిచి, నిలిచేలా వారంతా తెర‌చాటు ప్రయ‌త్నాలు చేశారు. మొత్తానికి వారంతా క‌లిసి చంద్రబాబును నాడు ముఖ్యమంత్రిని చేయగలిగారు.

ఏదో చేయాలన్న తపనతో….

దీంతో వారికి ఏదైనా చేయాల‌ని చంద్రబాబు తాము ఇన్నాళ్లు ఎంతో చేశాం.. మాకు ప్రతిఫ‌లం కావాల‌ని వారు ప‌ర‌స్పరం ఓ అండ‌ర్ స్టాండింగ్‌కు వ‌చ్చారు. ఈక్రమంలోనే అమ‌రావ‌తిలో భూముల క్రయ‌విక్రయాలు, సీఆర్డీఏ ప‌రిధి మార్చడం వంటివి జ‌రిగాయ‌ని, ఫ‌లితంగా చంద్రబాబు బంధువులు, పార్టీ నాయ‌కులు, వారి బంధువులు భారీ ఎత్తున ల‌బ్ధి పొందార‌ని వైసీపీ నేత‌ల ఆరోప‌ణ‌. ఇదే విష‌యాన్ని సాక్షాత్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు రాజ‌ధాని అంశం.. సెంట‌రాఫ్‌ది టాపిక్ గా మారిపోయింది. ఈ ప‌రిణామం రాజ‌కీయంగా ఒక‌ప‌క్క టీడీపీకి ఇబ్బంది క‌లిగిస్తే.. ఇప్పుడు చంద్రబాబు రిలేష‌న్స్ విష‌యంలోనూ దెబ్బకొట్టే ప్రమాదం ఉంద‌ని అంటున్నారు.

కరెక్ట్ గా చేసి ఉంటే….

నిజ‌మే నాడు.. త‌న‌కు సాయం చేసిన వారికి చంద్రబాబు కూడా సాయం చేయొచ్చు. ఈ విష‌యంలో ఎవ రూ త‌ప్పుప‌ట్టరు. అయితే, ఆ చేసేదేదో ఎవ‌రికీ దొర‌క‌కుండా , పూర్తి న్యాయ వివాద ర‌హితంగా త‌మ‌కు చేసి ఉంటే.. నేడు జ‌గ‌న్ ప్రభుత్వం వేసే ప్రశ్నల‌కు, చేసే బెదిరింపుల‌కు తాము భయ‌ప‌డాల్సిన అవస‌రం ఉండ‌దు క‌దా అనేది చంద్రబాబు మిత్రుల‌, ఆయ‌న సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల మాట‌. రాజ‌ధాని పై జ‌గ‌న్ ప్రక‌ట‌న త‌ర్వాత టీడీపీలో ఇదే విష‌యంపై భారీ ఎత్తున చ‌ర్చ సాగింది. దీంతో తొలిరెండు రోజులు ఒకింత మౌనంగా ఉన్న చంద్రబాబు.. సోమ‌వారం మాత్రం తీవ్ర యుద్దానికి రెడీ అయ్యారు.

సక్సెస్ అవుతుందా?

ఈ క్రమంలోనే ఆయ‌న అమ‌రావ‌తిని ద‌ళితుల రాజ‌ధానిగా పేర్కొంటూ కొత్త నినాదాన్ని అందుకున్నారు. అదే స‌మ‌యంలో తాడికొండ నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా తెర‌మీదికి తెస్తున్నారు. అయితే, ఈ ప్రయ‌త్నం ఏమేర‌కు ఫ‌లిస్తుంద‌నేది ఇప్పుడు ప్రధాన చ‌ర్చ. నాడు ద‌ళిత రైతుల‌ను బెదిరించి పొలాలు లాక్కున్నా రంటూ.. వ‌చ్చిన వ్యాఖ్యల‌పై చంద్రబాబు స్పందించ‌లేదు. అదే స‌మ‌యంలో ఇప్పటి వ‌ర‌కు గ‌డిచిన ఐదేళ్లలో ఏనాడూ చంద్రబాబు ద‌ళిత రాజ‌ధాని అనే మాట‌ల‌ను కూడా తెర‌మీదికి తీసుకురాలేదు. పైగా ద‌ళిత రైతుల‌కు కేటాయించిన ప్లాట్లు ఓ మూల‌గా ఉన్నాయ‌ని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులే గ‌తంలో వెల్లడించారు. మ‌రిఇలాంటి విష‌యాల‌కు చంద్రబాబు ఇప్పుడు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయ‌త్నం స‌క్సెస్ అయ్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు.

Tags:    

Similar News