ఫస్ట్ టార్గెట్ బాబే.. ఇదే నిజం ?

బీజేపీ మీద చంద్రబాబుకు మోజు తీరలేదు. తనతోనే ఉన్న పార్టీని తన్నేసినందుకు ఆయన బాధపడని రోజంటూ లేదు, 2019లో బీజేపీతో బాబు జట్టు కట్టి ఎన్నికల గోదాలోకి [more]

Update: 2020-12-24 13:30 GMT

బీజేపీ మీద చంద్రబాబుకు మోజు తీరలేదు. తనతోనే ఉన్న పార్టీని తన్నేసినందుకు ఆయన బాధపడని రోజంటూ లేదు, 2019లో బీజేపీతో బాబు జట్టు కట్టి ఎన్నికల గోదాలోకి దిగినా ఆయన గెలిచేది ఉండదు, కానీ ఇంత ఘోరంగా సీట్లు తగ్గి ఉండవు. ఇది ఒక పాయింట్ అయితే కేంద్రంలో మోడీ మళ్ళీ అధికారంలోకి రావడంతో మిత్రుడిగా చంద్రబాబుకు అక్కడ ఏమైనా సాయం అందివచ్చే అవకాశం అయితే ఉండేది. ఇక అమరావతి రాజధానిని మరీ మూడు ముక్కలు చేసి జగన్ దూకుడు చేయడం అయితే అసలు జరిగేది కాదు. ఇవన్నీ జరుగుతున్నాయంటే బాబు వేసిన రాంగ్ స్టెప్ బీజేపీ నుంచి విడిపోవడమేనని అంతా ఒప్పుకుంటారు.

అజెండా వేరుగా…..

అయితే బీజేపీ అజెండా వేరు అన్నది అందరికీ తెలిసిందే. చంద్రబాబు తనకు తానుగా ఎన్డీయే కూటమి నుంచి వెళ్ళిపోయే పరిస్థితులను బీజేపీ సృష్టించింది అంటారు. నాటి విపక్ష నేత జగన్ కి తరచూ అపాయింట్ మెంట్లు ఇస్తూ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుని మాత్రం పక్కన పెడుతూ మోడీ మార్క్ పాలిటిక్స్ నాడు నడిపారు. దాంతోనే చంద్రబాబుకు పూర్తిగా చిర్రెత్తుకుని వచ్చిందని కూడా అంటారు. ఇక బంగారం లాంటి గత అయిదేళ్ల కాలంలోనూ జగన్ మీద కేసులు తిరగతోడి జైలుకు పంపించకుండా బాబు మీద ఎగదోయడం వెనక కూడా బీజేపీ ఉందన్నది అందరికీ తెలుసు. ఇలా బాబునే దెబ్బ కొట్టాలన్నది బీజేపీ అజెండా అయితే బలి అయింది మాత్రం కోరి బాబే అంటారు.

ఓటుకు నోటుతో….

ఓటుకు నోటు అన్నది పాత కేసు. చంద్రబాబు కచ్చితంగా ఇరుక్కుపోయే ఈ కేసులో పై లెవెల్లో రాజీలు జరిగి బతుకు జీవుడా అనుకుని విజయవాడకు చంద్రబాబు మకాం మార్చారు అన్నది ప్రచారంలో ఉన్న ఒక రాజకీయ కధ. ఇపుడు దానికి రెక్కలు వస్తున్నాయి. మెల్లగా అది కదులుతోంది. వచ్చే ఏడాది చంద్రబాబుకు చుక్కలు చూపించేలా ఈ కేసు బిగుసుకునే అవకాశాలు ఉన్నాయి. సుప్రీం కోర్టులో ఈ కేసుపైన విచారణ 2021 వేసవి సెలవుల తరువాత చేపడతారని అంటున్నారు. బాబు మీదే సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఈ కేసు వేశారు. చూడబోతే ఇదే పెద్ద కేసులా ముందుకు వస్తుందని అంటున్నారు. ఇక మరో వైపు ఏసీబీ కోర్టులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు చంద్రబాబు మీద విచారణ దశ‌లో ఉందన్నదీ తెలిసిందే.

డౌటే లేదుట …..

ఏపీ రాజకీయాల్లో బీజేపీ చొచ్చుకుపోవాలంటే టీడీపీ పూర్తిగా నిర్వీర్యం కావాలి. చంద్రబాబు ఎంత దారుణంగా ఓడిపోయినా కూడా ఆయన నాయకత్వం ఉన్నంతవరకూ టీడీపీ ఏదో విధంగా రేసులో ఉంటుంది. అందువల్ల చంద్రబాబు మీద కేసుల ఉచ్చు బిగించి పక్కకు నెడితేనే ఏపీలో టీడీపీ కుప్పకూలుతుంది. అపుడు బీజేపీకి కావాల్సినంత రాజకీయ ఖాళీ దొరుకుతుంది. టీడీపీ నేతలకు వైసీపీ వ్యతిరేకులకు బీజేపీ అసలైన రాజకీయ ఆల్టర్నేషన్ కూడా అవుతుంది మరి ఈ స్కెచ్ చాలా జాగ్రత్తగానే బీజేపీ పెద్దలు వేస్తున్నారు. చంద్రబాబును ముందు దెబ్బ తీస్తే ఆనక జగన్ సంగతి చూడవచ్చు అన్నదే కమలనాధుల రాజకీయ విధానంగా ఉంది. అందువల్ల వంగి దండాలు పెట్టినా మరేం చేసినా కూడా బీజేపీ గురి మాత్రం బాబు మీదనే. ఆ ముచ్చటను చూసేందుకు 2021లో రెడీ అయిపోవచ్చేమో.

Tags:    

Similar News