Tdp : అందుకోసమే గేమ్ లోకి దిగారట… ఫలితం తర్వాత?

ట్రాక్ రికార్డు సరిగా లేదు. అయినా పార్టీని ట్రాక్ లో పెట్టాలంటే పోటీకి దిగాల్సిందే. బద్వేలు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీకి సిద్దమయింది. 2001లో తెలుగుదేశం [more]

Update: 2021-09-28 08:00 GMT

ట్రాక్ రికార్డు సరిగా లేదు. అయినా పార్టీని ట్రాక్ లో పెట్టాలంటే పోటీకి దిగాల్సిందే. బద్వేలు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీకి సిద్దమయింది. 2001లో తెలుగుదేశం పార్టీకి బద్వేలులో చివరి గెలుపు. అంటే ఇక్కడ గెలిచి దాదాపు ఇరవై ఏళ్లు కావస్తుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో మాదిరి ఓటు బ్యాంకును పటిష‌్టం చేసుకోవడం కోసం, ఫీడ్ బ్యాక్ ను తెలుసుకోవడం కోసం టీడీపీీ బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పక తప్పదు.

వైసీపీకే అడ్వాంటేజీ…

గత ఎన్నికల్లోనే టీడీపీ దాదాపు 44 వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థిపై ఓటమిని చవిచూసింది. పైగా ఇది ఉప ఎన్నిక. అధికార పార్టీకే అడ్వాంటేజీ అని టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలుసు. అయితే గత ఎన్నికల మెజారిటీని తగ్గించాలన్నదే చంద్రబాబు ఆలోచనగా ఉంది. పార్టీ క్యాడర్ ను మరింత పటిష్టం చేసుకోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపై వ్యతిరేకత పెరిగిందన్న సంకేతాలను తీసుకెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచన.

షరతులతో పోటీ….

అందుకోసమే ముందుగానే చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన ఓబులాపురం రాజశేఖర్ పేరును ఖరారు చేశారు. తొలుత ఆయన అంగీకరించకపోయినా ఖర్చు మొత్తం పార్టీయే భరిస్తుందని హామీ ఇచ్చి ఆయనను రంగంలోకి దింపుతున్నారు. ఇటీవలే ఇక్కడ టీడీపీకి కీలకంగా ఉన్న విజయమ్మను యాక్టివ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కుమార్తె విజయమ్మ ఇక్కడ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.

మెజారిటీ తగ్గించి….

బిజివేముల వీరారెడ్డి కుటుంబానికి ఇక్కడ మంచి పట్టుంది. 1994, 1999లో రెండుసార్లు ఆయన టీడీపీ నుంచి విజయం సాధించారు. మరో మూడేళ్లు ఎమ్మెల్యే పదవి ఉండనుండటంతో సహజంగా ప్రజలు కూడా నియోజకవర్గం అభివృద్ధి కోసం వైసీపీ వైపు మొగ్గు చూపుతారు. అయితే రాష్ట్రంలో అభివృద్ధి లేదన్నది బద్వేలు తీర్పు ద్వారా చూపించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆయన బద్వేలు ఎన్నిక ప్రచారానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. మండలాల వారీగా నేతలను నియమించనున్నారు. నేడో, రేపో కడప జిల్లా నేతలతో సమావేశాన్ని చంద్రబాబు నిర్వహించనున్నారు.

Tags:    

Similar News