chandrababu : నమ్ముతారా? నవ్వి పోతారా?

కొత్తోడికి చెప్పుకునే అవకాశముంటుంది. పాతోడికి ఆ పరిస్థితి లేదు. గతంలో తాను తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాలు ప్రతి దానికీ ఆటంకంగా మారతాయి. తెలుగుదేశం పార్టీ [more]

Update: 2021-09-21 12:30 GMT

కొత్తోడికి చెప్పుకునే అవకాశముంటుంది. పాతోడికి ఆ పరిస్థితి లేదు. గతంలో తాను తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాలు ప్రతి దానికీ ఆటంకంగా మారతాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తనకు దూరమైన వర్గాలను దరి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రైతుల కోసం ఐదు రోజుల పాటు పార్టీని చంద్రబాబు పోరాట బాట పట్టించారు.

రైతు వ్యతిరేకిగా…

చంద్రబాబు రైతు వ్యతిరేకిగా ముద్రపడ్డారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన వ్యాఖ్యలు రైతులకు వ్యతిరేకమని తేల్చి చెప్పాయి. ఉచిత విద్యుత్తు మీద చంద్రబాబు చేసిన కామెంట్లు ఆయనకు ఆ వర్గాన్ని దూరం చేశాయి. ఇక సబ్సిడీలను కూడా తగ్గించాలనే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రయత్నించారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన వర్గంగా ఉన్న రైతాంగం ఆగ్రహానికి కారణమని చెప్పక తప్పదు.

రుణ మాఫీ ప్రకటించి…

ఇక 2014 అధికారంలోకి రావడానికి రైతులకు రుణమాఫీ హామీని ప్రకటించారు. దీంతో ఆ ఎన్నికల్లో రైతులు చంద్రబాబు పక్షాన నిలబడ్డారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ ఊసు మర్చారు. ఎంతసేపటికీ అమరావతి, పోలవరం అంటూ ఏమార్చే ప్రయత్నం చేశారు. రుణమాఫీని విడతల వారీగా చేయడంతో రైతాంగం తీవ్ర అసంతృప్తి చెందింది. ఫలితంగానే చంద్రబాబుకు రైతులు 2019 ఎన్నికల్లో ఝలక్ ఇచ్చారు.

రైతుల కోసం పోరాటం….

ఇప్పుడు మరోసారి వచ్చే ఎన్నికలకు రైతాంగం మద్దతు పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రైతులకు సబ్సిడీలు ఇవ్వడం లేదని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ మూతపడిందంటున్నారు. తాము అమలు చేసిన పథకాలను కూడా జగన్ నిలపేసి రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. రైతులకు అండగా ఉండేందుకు జోనల్ వారీగా పోరాట కార్యక్రమం చేపట్టారు. మరి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నానికి రైతులు అండగా నిలుస్తారా? లేదా? బాబును నమ్ముతారా? నవ్వి ఊరుకుంటారా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News