టీడీపీలో కోవర్టుల కలకలం… వారిపైనే అనుమానం?

తెలుగుదేశం పార్టీలో కోవర్టుల కలకలం రేగుతుంది. పార్టీలోనే ఉంటూ అధికార వైసీపీకి సహకరించేవారు ఉన్నారన్న అనుమానం నిజమవుతుంది. ఇటీవల వరసగా జరుగుతున్న అనేక సంఘటనలు ఇందుకు ఉదాహరణగా [more]

Update: 2021-08-01 06:30 GMT

తెలుగుదేశం పార్టీలో కోవర్టుల కలకలం రేగుతుంది. పార్టీలోనే ఉంటూ అధికార వైసీపీకి సహకరించేవారు ఉన్నారన్న అనుమానం నిజమవుతుంది. ఇటీవల వరసగా జరుగుతున్న అనేక సంఘటనలు ఇందుకు ఉదాహరణగా నిలిచాయి. పార్టీ అంతర్గత సమావేశాల్లో జరుగుతున్న విషయాలు కూడా బయటకు లీకవుతుండటంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సాంకేతిక సిబ్బంది వరకూ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు తర్వాత?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంకు ఉన్న తెలుగుదేశం పార్టీకి నాయకత్వ సమస్య వెంటాడుతుంది. చంద్రబాబు తర్వాత ఎవరు? అన్న ప్రశ్న సీనియర్ నేతల నుంచి జూనియర్ ల వరకూ వేధిస్తుంది. అధికారం కోల్పోయిన రెండేళ్లలో నేతలంతా పెద్దగా యాక్టివ్ గా లేరు. అలాగని పక్క చూపులు చూడటం లేదు. ఎన్నికల సమయానికి నియోజకవర్గాల్లో చెలరేగిపోతామని వారు సమావేశాల్లో చెబుతున్నారు.

అంతర్గత చర్చలు…

అయితే ఇటీవల కాలంలో పార్టీ అంతర్గతంగా జరుగుతున్న చర్చలు కూడా లీకవుతున్నాయి. ఇది చంద్రబాబుకు ఆందోళన కల్గిస్తుంది. ఇటీవల కాలంలో కరోనా కారణంగా చంద్రబాబు ఎక్కువగా జూమ్ మీటింగ్ లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో కెమెరా ఆఫ్ అయినా వీడియోలు మాత్రం బయటకు వస్తుండటం కలవర పరుస్తుంది. కొందరు కావాలని పనిగట్టుకుని నేతల సంభాషణలను సోషల్ మీడియాలో పెడుతున్నారని అనుమానిస్తున్నారు.

వారి సహకారం….

ఇందుకు సాంకేతిక సిబ్బంది సహకారం ఉండి ఉండవచ్చని కూడా టీడీపీ నేతల్లో సందేహం ఉంది. అందుకే చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తన వద్ద పనిచేస్తున్న సాంకేతిక సిబ్బంది విషయంలో జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారు. రాజధాని అమరావతి భూ కుంభకోణం కేసులో కూడా వైసీపీ నేతలకు ఉప్పందించింది కూడా టీడీపీ నేతలేనన్న అనుమానం ఉంది. దీంతో చంద్రబాబు మరింత అప్రమత్తమయ్యారు. మరి టీడీపీలో కోవర్టులు ఎవరు? అన్న దానిపై పార్టీ అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News