పార్టీ పాయే.. ఆఫీస్ కూడా… ?

తెలుగుదేశం పార్టీకి చెడ్డ రోజులు ముందున్నాయా. రాజకీయంగా అసలు కాని కాలమే నడుస్తోందా అంటే అవును అనే సమాధానం వస్తోంది. తెలంగాణాలో టీడీపీ పాలిటిక్స్ ఖతం అయింది. [more]

Update: 2021-07-24 11:00 GMT

తెలుగుదేశం పార్టీకి చెడ్డ రోజులు ముందున్నాయా. రాజకీయంగా అసలు కాని కాలమే నడుస్తోందా అంటే అవును అనే సమాధానం వస్తోంది. తెలంగాణాలో టీడీపీ పాలిటిక్స్ ఖతం అయింది. ఇది వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ వందల కోట్ల విలువ చేసే భవనం మాత్రం ఆ పార్టీకి రాజధాని నడిబొడ్డున ఉంది. ఇంతటి ఆస్తిని కాపాడుకోవడం కోసమే తెలంగాణాలో మాకూ ఒక పార్టీ శాఖ ఉందని టీడీపీ పెద్దలు హడావుడి చేస్తూ ఉంటారు. అయితే ఇపుడు ఆ భవనానికి కూడా రోజులు దగ్గరపడ్డాయని అంటున్నారు.

కారు చౌకగా….

ఆనాడు చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎం గా ఉండగా బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2 లో సువిశాలమైన భూమిని తానే పెద్దగా ఉన్న ప్రభుత్వం నుంచి పొందారు. ఎన్టీయార్ మెమోరియల్ ట్రస్ట్ పేరిట దాన్ని తీసుకున్నారు. ముప్పయ్యేళ్ళకు లీజు లెక్కన ఆ భూమిని చంద్రబాబు సీఎంగా పార్టీ ప్రెసిడెంట్ చంద్రబాబుకు కేటాయించారు. నెలకు తొంబై వేల అద్దెతో ఈ భూమి దఖలు పడింది. ఆ తరువాత మరో ఏడేళ్ల పాటు టీడీపీ ప్రభ వెలిగింది. ఇక తెలంగాణా ఉద్యమం పుట్టింది. వైఎస్సార్ రెండు సార్లు సీఎం గా పనిచేశారు. విభజన తరువాత రెండు సార్లు టీయారెస్ అధికారంలోకి వచ్చింది. మొత్తానికి 1999 ఎన్నికలే టీడీపీకి తెలంగాణాలో చివరికి అయ్యాయి.

నామమాత్రం …?

హైదరాబాద్ లో ఎన్టీయార్ భవన్ ఒకనాడు సందడిగా ఉండేది. ఇపుడు చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటున్నా అక్కడికి వెళ్ళరు. విభజన ఏపీకి తొలి సీఎంగా ఆయన గుంటూరు దగ్గర ప్రభుత్వం నుంచి పార్టీ అధినేతగా భూమి తీసుకుని భవ్యమైన బిల్డింగ్ అక్కడా కట్టేశారు. ఇలా ఎన్టీయార్ ట్రస్ట్ పేరిటనే ఈ ఆస్తులు ఉన్నాయి. కానీ తెలంగాణాలో పని లేదు. పార్టీ వ్యాపకాలు అంతకంటే లేవు. మరి ఎన్టీయార్ భవన్ ని ఏం చేస్తున్నారు అంటే పూర్తి వ్యాపార అవసరాలకు వాడుకుంటున్నారుట. ఈ ఆరోపణలు చేసింది ఆ భవన్ లో దశాబ్దాలుగా పనిచేస్తున్న తెలంగాణాకు చెందిన ఉద్యోగులు. ఈ భవనాన్ని తెలంగాణా సర్కార్ లీజు రద్దు చేసి వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నేరుగా కేసీయార్ కే వారు లేఖ కూడా రాశారు.

ఖేల్ ఖతం..?

అసలే తన శిష్యుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేసి తన మీదకు ఉసి గొల్పాడని కేసీయార్ చంద్రబాబు మీద గుర్రు మీద ఉన్నారు. తెలంగాణా అస్తులు ఎవరి దగ్గర ఉన్నా లాగేస్తామంటూ గర్జించే కేసీయార్ కి ఇది అంది వచ్చిన అవకాశమే. వందల కోట్ల విలువ చేసే ఈ సంపదను తెలంగాణా ప్రభుత్వ ఆస్తి అని లాగేసుకుంటే చేసేది ఏమీ ఉండదు. లీజు నిబంధనల ప్రకారం సేవా కార్యక్రమాలకే ఉపయోగించాలి. కానీ ఇప్పటిదాకా అక్కడ రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఇన్నాళ్ళూ పార్టీ ఉంది కాబట్టి దాన్ని టీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఇపుడు టీడీపీ అన్నదే లేదు అంటున్నారు. దాంతో పాటు ప్రెసిడెంటే గోడ దూకేలా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఎన్టీయార్ భవన్ని కేసీయార్ స్వాధీనం చేసుకుంటారా. లీజు గడువు చూస్తే 2027 దాకా మాత్రమే ఉంది. నిబంధనలు పాటించడం లేదు అని చెప్పి కధ క్లోజ్ చేస్తే టీడీపీ ఖేల్ ఖతమే అంటున్నారు.

Tags:    

Similar News