జగన్ తనంతట తాను చెడగొట్టుకుంటే తప్ప?

ఒకనాడు ఇదే చంద్రబాబు లోకేష్ బాబు ఒక మాట తరచూ అనేవారు. ఎక్కడో తెలంగాణాలో కూర్చుని ఏపీ మీద విమర్శలు చేసే వారిని ఎన్నారైలుగా చిత్రీకరించేవారు. అవును [more]

Update: 2021-07-06 13:30 GMT

ఒకనాడు ఇదే చంద్రబాబు లోకేష్ బాబు ఒక మాట తరచూ అనేవారు. ఎక్కడో తెలంగాణాలో కూర్చుని ఏపీ మీద విమర్శలు చేసే వారిని ఎన్నారైలుగా చిత్రీకరించేవారు. అవును మరి ఆ రోజుల్లో తెలుగుదేశం జోరు సాగుతోంది. రాజకీయ ప్రభ వెలుగుతోంది. అందుకే ఆ మాటలు తూటాలుగా దూసుకొచ్చాయి. ఇపుడు సీన్ మొత్తం మారిపోయింది. విపక్ష పాత్రలోకి టీడీపీని జనం నెట్టేశారు. దాంతో చంద్రబాబు తన మకాం వందల‌ కోట్లతో నిర్మించిన అతి విలాసవంతమైన హైదరాబాద్ లోకి మార్చేశారు. ఆయన కలల రాజధాని అమరావతికి దగ్గరలో అయినా కాపురం ఉండడానికి ఎందుకో ఇష్టపడలేదు. అందుకే వైసీపీ రివర్స్ లో అటాక్ చేస్తోంది. చంద్రబాబుకు ఏపీతో ఏం పని అంటూ వారి పాఠాలను తిరిగి అప్పచెబుతోంది.

గుమ్మం దిగలేరా …?

చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అయ్యాక రెండేళ్ళుగా హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. ఆయన అక్కడ నుంచే జూమ్ యాప్ ద్వారా కధ నడిపిస్తున్నారు. ఈ లోగా ఎన్నో పరిణామాలు జరిగిపోతున్నాయి. ఢిల్లీలో జాతీయ రాజకీయాల్లో కీలకమైన మార్పులు వస్తున్నాయి. శరద్ పవార్ లాంటి నాయకులు మూడవ ఫ్రంట్ పేరిట వంటకం మొదలుపెట్టారు. అసలు ఇలాంటి రాజకీయ వంటకాలను వండడంతో నలభీములను తలపించే చంద్రబాబు మాత్రం ఢిల్లీ వైపు చూడడం లేదు. కనీసం ఆయన ఊసు కూడా లేకుండా కూటములు కట్టేస్తున్నారు. అంటే ఢిల్లీ ఫ్లైట్ బాబు ఎక్కాల్సిన అవసరం లేదా. లేక ఆయనకే ఆసక్తి లేదా అన్నది ఒక ప్రశ్న.

ఎంతకాలమిలా..?

కరోనా కష్టం వచ్చిందని విపక్ష నేత సొంత రాష్ట్రానికి దూరంగా ఉంటే ఎలా. ఇది వైసీపీ విమర్శించిందని కాదు కానీ జనాల్లో కూడా ఉన్న సందేహమే ఇది. పైగా సొంత పార్టీ వారికీ ఇలాంటి డౌట్లే వస్తున్నాయట. రెండేళ్ళ జగన్ పాలన ముగిసింది. ఇక ఎక్కడికక్కడ నట్లు బిగించాలి అంటే విపక్ష నేత జనాల్లో ఉండాలి. ఎక్కడో దూరంగా కూర్చుని జూమ్ యాప్ ద్వారా విమర్శలు చేస్తూ అనుకూల మీడియాలో బ్యానర్ ఐటెమ్స్ రాయించుకుంటూ ఉంటే బాధ్యత పూర్తి అవుతుందా అన్నదే తమ్ముళ్లకు పట్టుకున్న ఆవేదన. కానీ చంద్రబాబు మాత్రం హైదరాబాద్ కదిలి రావడంలేదు.

వెయిట్ చేస్తున్నారా …?

జగన్ సర్కార్ మీద వ్యతిరేకత వస్తే తానే మళ్ళీ ఏపీ జనాలకు గుర్తుకువస్తాను అన్న ధీమాలో చంద్రబాబు ఉన్నారని చెబుతారు. నిజమే ఈ రోజుకి కూడా వైసీపీకి గట్టి ప్రతిపక్షం టీడీపీనే. ఆ పార్టీకి గ్రాస్ రూట్ లెవెల్ లో కార్యకర్తలు ఉన్నారు. పటిష్టమైన యంత్రాంగం ఉంది. కానీ అవన్నీ కూడా అధినాయకుడు కదిలించినపుడే కదా ఉత్తేజమయ్యేది. ఎంతసేపూ కోర్టులలో కేసులు వేస్తూ న్యాయ పోరాటాల ద్వారానే చంద్రబాబు కాలం గడిపేస్తున్నారు. దీన్ని చూసిన వారు బాబులో మునుపటి ఉత్సాహం లేదని అనేస్తున్నారు. ఆయనకు కూడా రాజకీయం ఏంటో అర్ధం కావడంలేదుట. తాను వేస్తున్న ప్రతీ బాణం వెనక్కి తిరిగి వచ్చేస్తోంది. దాంతో కాలానికే వదిలిపెట్టి బాబు వేచి చూసే ధోరణిలో ఉన్నారని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే జగనే తనకు తానుగా చెడగొట్టుకుని చంద్రబాబుకు పీఠం అప్పగిస్తాడన్నదే బాబు టీమ్ అశగా ఉందిట. మరి జగన్ ఈ పరిణామాలను చూసి అతి ధీమాకు పోకుండా జనం మనసు ఎరిగేలా వ్యవహరిస్తే మాత్రం కాలం తీర్పు ఆయనకే అనుకూలంగా ఉంటుంది అంటున్నారు.

Tags:    

Similar News