బాబుకు ముందున్న కాలమంతా ఇరకాటమే?

ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి అని ఒక సినీ కవి అన్నాడు. అలాగే రాజకీయాల్లో విమర్శలు చేస్తున్నపుడు ముందూ వెనకా అసలు చూసుకోరు. బుర్రకు తోచినట్లుగా [more]

Update: 2021-06-06 00:30 GMT

ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి అని ఒక సినీ కవి అన్నాడు. అలాగే రాజకీయాల్లో విమర్శలు చేస్తున్నపుడు ముందూ వెనకా అసలు చూసుకోరు. బుర్రకు తోచినట్లుగా అప్పటి పరిస్థితుల బట్టి మాట్లాడేస్తారు. కానీ సోషల్ మీడియా యుగంలో ప్రతీ విమర్శా రికార్డు అవుతోంది. రేపటి రోజున తిరగేసి మరగేస్తాను అని ఎంతటి రాజకీయ ఘనాపాటీ అయినా అనుకుంటే అంతకంటే పొరపాటు లేదు. ఇపుడు జగన్ విషయంలో తీసుకుంటే చంద్రబాబు ప్రతీ నిత్యం చేస్తున్న విమర్శలు ఏపీని అప్పుల పాలు చేస్తున్నారని, ఏపీని ముంచబోతున్నాడని. అయితే జగన్ చేస్తున్న అప్పులన్నీ జనాలకు నగదు పంచడం కోసమే. అనేక పధకాలు ఆయన అమలు చేసి వాటి కోసమే బయట అప్పులకు చేతులు చాస్తున్నారు అన్న సంగతి చంద్రబాబుకు కూడా తెలుసు.

కాదనగలరా….?

చంద్రబాబు తీరు చూస్తే ఎప్పటి పరిస్థితులకు తగినట్లుగా గొడుగు పడతారు. ఆయన 2004 వరకూ సంస్కరణల బాట నాది అన్నారు. ఆ తరువాత టీడీపీ ఓడాక సంక్షేమ జపం మొదలుపెట్టారు. ఇక 2014 ఎన్నికల వేళ చంద్రబాబు ఎన్నికల మ్యానిఫేస్టోలో 600 హామీలు ఉన్నాయి. వాటిలో ఎన్ని నెరవేర్చారో తెలియదు కానీ 2019 నాటికి టీడీపీ ఓడింది. మరి 2024 ఎన్నికల్లో తాము సంక్షేమ పధకాలు అసలు ఏపీలో అమలు చేయమని చంద్రబాబు అనగలరా. ఆ విధంగా జనాల వద్దకు వెళ్ళి ఓట్లు అడగగ‌లరా అన్న కీలకమైన ప్రశ్న అయితే మేధావి వర్గం నుంచి వస్తోంది.

జగన్ని మించాలిగా…?

సరే సంక్షేమ పధకాల విషయంలో తాను పొదుపుగా ఉంటానని, ఏపీ ఆర్ధిక పరిస్థితులను చూసుకుని హామీలు ఇస్తున్నానని చంద్రబాబు 2024 వేళకు చెప్పుకోవచ్చు. కానీ అప్పటికే జగన్ పధకాలతో తడిసి ముద్ద అయిన ఏపీ జనం చంద్రబాబు పొదుపుగా పధకాలు అమలు చేస్తామంటే ఓటేస్తారా. కనీసం ఆ వైపునకు చూస్తారా. అలా కనుక చూసుకుంటే జగన్ కంటే ఎక్కువగానే పధకాలను బాబు ప్రవేశపెట్టాలి. ఆ విధంగా ఆయన జనం ముందు 2014 ఎన్నికలను మించి కనీసం ఒక వేయి హామీలు అయినా తీసుకుపోవాలి. అదే జరిగితే ఏపీ అభివృద్ధి అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు అభివృద్ధి గురించి ఏం చేప్పుకుంటారు. అలా చూసుకున్నా కూడా సీన్ రివర్స్ అవడమూ ఖాయమే.

జనాలు మారితేనే ..?

చంద్రబాబు ఈ రోజు పధకాల విషయంలో జగన్ని విమర్శిస్తున్నారు కానీ రేపు ఎన్నికల వేళ ఒడ్డున పడాలంటే ఈ పధకాలే శరణ్యమన్న మాటను టీడీపీ మేధావుల నుంచి కూడా వస్తోంది. ఇపుడు ఎవరు కాదన్నా కూడా జనాలు మాత్రం పధకాల మీద వ్యామోహం పెంచుకున్నారు. జగన్ అయితే తాను మళ్లీ అధికారంలోకి వస్తేనే ఈ పధకాలు అనీ అమలు అవుతాయని గట్టిగా చెప్పుకుంటారు. అపుడు చంద్రబాబు సంస్కరణశీలిగా మాట్లాడితే జనం అసలు పట్టించుకుంటారా. లేక తానూ అవే పధకాలు ఇస్తాను అన్నా కూడా బాబుని నమ్ముతారా. ఎందువల్ల అంటే జగన్ నగదు బదిలీ పధకాల మీద టీడీపీ కానీ దాని అనుకూల మీడియా కానీ ఈ రోజు చేస్తున్న రాద్ధాంతమే రేపటి రోజున వారికి జనంలో విశ్వాసం తగ్గించే ప్రమాదం ఉంది. మొత్తానికి జగన్ని అన్నామని కాదు, రేపటి రోజున జనంలోకి వెళ్తే ఏం చేప్పాలి అన్నది కూడా చంద్రబాబు అండ్ కో గుర్తు పెట్టుకోవాలని తెలుగు జనాలు కోరుతున్నారు. మొత్తానికి తాను సంస్కరణవాదినా, సంక్షేమ శీలినా అన్నది చంద్రబాబు డిసైడ్ అయితే తప్ప ఆయన రేపటి రాజకీయం పండదు అన్న మాట అయితే ఉంది.

Tags:    

Similar News