బాబు మదిలో గ్రాండ్ అలయెన్స్ ?

చంద్రబాబు రాజకీయ గండర గండడు. కింద పడ్డా పై చేయి నాదే అని వాదిస్తారు. ఆయన ఇపుడు కసి మీద ఉన్నారు. మరోసారి ఏపీలో అధికారం ఎలాగైనా [more]

Update: 2021-06-03 02:00 GMT

చంద్రబాబు రాజకీయ గండర గండడు. కింద పడ్డా పై చేయి నాదే అని వాదిస్తారు. ఆయన ఇపుడు కసి మీద ఉన్నారు. మరోసారి ఏపీలో అధికారం ఎలాగైనా సాధించలన్నది చంద్రబాబు లక్ష్యం. అందుకోసం అటు తూరుపూ ఇటు పడమరను కూడా కలిపేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇక ఏపీలో రాజకీయ వాతావరణం కూడా బాబుకు కలసి వస్తోంది. జగన్ కి ఏ ఒక్క పార్టీతోనూ పొత్తు లేదు. దోస్తీ అంతకంటే కూడా లేదు. ఆ అవసరం లేదు అని ఖరాఖండీగా వైసీపీ నేతలు చెప్పేస్తున్నారు. దాంతో అందరికీ పెద్దన్నలా మారి జగన్ మీద ఉసిగొలపడానికి చంద్రబాబు తయారుగానే ఉన్నారట.

యాంటీ జగన్ …

ఏపీలో ఇదే అన్ని పార్టీల స్లోగన్. జగన్ సర్కార్ మీద విరుచుకుపడడానికి అందరూ పెద్ద నోరుతో ముందుకు వస్తారు. నాడు చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు వైసీపీ ఎదురు నిలిచి పోరాటాలు చేసేది. అప్పట్లో జనసేన సైలెంట్ గా ఉండేది. బీజేపీ ఎటూ చివరి దాకా మిత్ర పక్షంగా ఉంది. ఇక కాంగ్రెస్ తో సహా కామ్రెడ్స్ చంద్రబాబు కంటే జగన్ మీదనే ఎక్కువగా విమర్శలు చేసేవారు. ఒక విధంగా చీలిపోయిన విపక్షంతో బాబుకు నాడు హ్యాపీగా ఉండేది. కానీ ఇపుడు అంతా రివర్స్. జగన్ సైతం లౌక్యంగా ఎవరో ఒకరిని చేరదీయాలనుకోవడంలేదు. దాంతో ఎవరికి ఏ రకమైన కోపాలు ఉన్నా జగన్ మీద ఒక్కసారిగా విరుచుకుపడుతున్నారు.

ఇలాంటి కాంబోతో….?

మరి దీనిని చూసే చంద్రబాబుకు కొత్త ఆలోచనలు వస్తున్నాయి అనుకోవాలేమో. ఏపీలో జనసేన, వామప‌క్షాలు జగన్ తో కలిసేందుకు రెడీగా లేవు. అలాగే కాంగ్రెస్ అయితే జగన్ అంటే కస్సుమంటుంది. దీంతో పాటు జాతీయంగా మారుతున్న రాజకీయాన్ని దృష్టిలో ఉంచుకుంటే బీజేపీ కి ఆల్టర్నేషన్ గా యూపీయే ఉంది. దాన్ని కాంగ్రెస్ లీడ్ చేస్తోంది. అందువల్ల ఏపీలో కూడా కాంగ్రెస్ ని దగ్గర చేర్చుకుని జనసేన వామపక్షాలతో గ్రాండ్ అలయెన్స్ ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీద టీడీపీలో చర్చలు సాగుతున్నాయట. దేశంలో మోడీకి వ్యతిరేక వాతావరణం ఉందని, దాంతో పాటు ఏపీలో కూడా బీజేపీకి పెద్దగా బలం లేదని అందువల్ల అటు జగన్, ఇటు బీజేపీలను టార్గెట్ చేస్తూ ఈ కొత్త కూటమి ఎన్నికల ముందు రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

నాటి మాట అలా…?

నాడు కాబోయే ప్రధాని హోదాలో మోడీ ఏపీ జనులకు భారీ హామీలు ఇచ్చారు. ప్రత్యేక హోదాను ఇస్తామని చెప్పారు. అలాగే ఢిల్లీని తలదన్నే రాజధానిని కూడా నిర్మిస్తామని కూడా అన్నారు. మరి రేపటి రోజున గ్రాండ్ అలయెన్స్ తరఫున కాబోయే ప్రధానిగా రాహుల్ గాంధీతో ఆ హామీ ఇప్పిస్తే వర్కౌట్ అవుతుందని కూడా టీడీపీలో చర్చ సాగుతోందిట. అంతే కాదు ఏపీ లాంటి చితికిపోయిన రాష్ట్రానికి కేంద్రం అండ తప్పకుండా ఉండాలని, అందుకే కాంగ్రెస్ తో పొత్తు అని సమర్ధిచుకోవడానికి కూడా వీలు అవుతుందని పసుపు శిబిరం పెద్దలు తలపోస్తున్నారుట. అదే టైమ్ లో వైసీపీ వల్ల ఏమీ కాలేదని, కేంద్రంలో రేపటి రోజున అధికారంలో వచ్చేది విపక్ష కూటమి కాబట్టి తమకు ఏపీలో కూడా పట్టం కట్టాలని కోరబోతారుట. ఇక ఏపీలో కాంగ్రెస్ కి జీవం పోయాలని కూడా బాబు అతి పెద్ద వ్యూహరచనలో ఉన్నారుట. ఆ పార్టీకి ఎన్నో కొన్ని సీట్లు ఇచ్చి కూటమిలో చేర్చుకుంటే చాలు జగన్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ ని భారీగా చీల్చడానికి కూడా ఉపయోగపడుతుంది అన్న విశ్లేషణతోనే ఇదంతా చంద్రబాబు చేయబోతున్నారుట. మరి జగన్ మీద ఇలా దండెత్తి వస్తే ఆయన ఎలా రివర్స్ అటాక్ ఇస్తారు అన్నదే చూడాలి.

Tags:    

Similar News