టీడీపీలో యాంటీ బాడీస్ డెవలెప్ అవుతున్నాయా?

ఈ దేశంలో కరోనా కేసులు ఎన్ని. మరణాలు ఎన్ని. వ్యాక్సినేషన్ ఎంతమందికి వేశారు. రెండు డోసులు పూర్తి అయిన వారు ఎందరు. దేశాన వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్ధ్యం [more]

Update: 2021-05-12 06:30 GMT

ఈ దేశంలో కరోనా కేసులు ఎన్ని. మరణాలు ఎన్ని. వ్యాక్సినేషన్ ఎంతమందికి వేశారు. రెండు డోసులు పూర్తి అయిన వారు ఎందరు. దేశాన వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్ధ్యం ఎంత. ఇవన్నీ బుర్రకు అర్ధం కాని లెక్కలు. ఇక టీకాల పంపిణీ విషయాన్ని తన చేతుల్లోనే ఉంచుకున్న కేంద్రం రాష్ట్రాలు ఎన్ని డిమాండ్లు పెట్టినా తమకు తోచినట్లుగానే పంపుతోంది అన్న విమర్శలు అయితే ఉన్నాయి. ఈ తీరున అయితే ఏ రాష్ట్రం కూడా మొత్తం జనాభాకు టీకాలు ఇవ్వాలంటే ఏళ్ళూ ఊళ్ళూ గడచిపోతాయి. దాంతోపాటు మేజర్ సెక్షన్ కి టీకాలు ఇవ్వాల్సిన బాధ్యత‌ను పూర్తిగా రాష్ట్రాల మీద పెట్టేసి కేంద్రం చేతులు దులిపేసుకుంది.

చోద్యం చూస్తున్నారుగా..?

ఎపుడైతే రాష్ట్రాల మీద 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ల లోపు వారికి టీకాలు ఇచ్చే విధానాన్ని పెట్టేశారో అక్కడి విపక్షాలకు ముఖ్యమంత్రులు టార్గెట్ అయిపోయారు. అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో ఒక్కసారిగా టీకాలకు డిమాండ్ వచ్చిపడింది. కొంటామన్నా కూడా సరిపడా టీకాలు ఇచ్చే సీన్ లేదు. మరో వైపు చూస్తే నత్తనడకగా వ్యాక్సినేషన్ సాగుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల విపక్షాల చేతికి కోరి మోడీ ఆయుధాన్ని ఇచ్చారా అన్న చర్చ వస్తోంది. ఒక్క వ్యాక్సిన్ విషయంలోనే చంద్రబాబు జగన్ సర్కార్ ని చెడుగుడు ఆడుకుంటున్నారు. 18 ఏళ్ళ లోపు వారికి టీకాలు జనాలకు ఎందుకు ఇవ్వడంలేదు అంటూ లాజిక్ పాయింట్లు లాగుతున్నారు. ఆయనకు టీకాల కొరత విషయంతో సంబంధం లేదంతే.

అయ్యే పనేనా…?

దీంతో జగన్ ఈ తలకాయ నొప్పి భరించలేక గ్లోబల్ టెండరి కి వెళ్ళి అయినా బయట దేశాలలో తయారు చేసే వ్యాక్సిన్ ని కొని తమ రాష్ట్రంలో వేయించాలని అనుకుంటున్నారు. ఆ విధంగా అమెరికా వ్యాక్సిన్ ఫైజర్, రష్యా ప్రొడక్షన్ స్పుత్నిక్ వంటి టీకాలను పెద్ద ఎత్తున కొనాలని కూడా ఆలోచన చేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా అంతర్జాతీయ వ్యవహారం. దానికి కేంద్రం అనుమతి తప్పనిసరిగా ఉండాలి. దేశంలో జగన్ ఒక్కరే కాదు, మహారాష్ట్ర, యూపీ సర్కార్ కూడా గ్లోబల్ టెండరింగ్ కి వెళ్తామని అంటున్నాయి. కానీ దీని మీద కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదు. దాంతో అది అంత సులువు కాదు అనే తెలుస్తోంది.

ఇదే పాయింట్ తో …?

కరోనా తో సహజీవనం చేయాల్సిందే అని జగన్ గత ఏడాది ఎవరూ కనుగొనని మాటను చెప్పి షాక్ తినిపించారు. అయితే చంద్రబాబు టీడీపీ మాత్రం వ్యాక్సిన్ తో సహజీవనం చేయడానికే నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో అయిదు కోట్ల మంది జనాభా ఉన్నారు. వారిలో 18 లోపు వారిని మినహాయించినా కూడా మూడున్నర కోట్ల మందికి టీకాలు ఇవ్వాల్సిందే. ఇప్పటికి రెండు డోసులు అయిన వారు 30 లక్షలు కూడా దాటలేదు. అంటే టార్గెట్ బహు దూరంలో ఉంది. దాంతో ఏపీ సర్కార్ ని రఫ్ఫాడించేందుకు వ్యాక్సిన్ ఇపుడు చంద్రబాబుకు సరికొత్త బలంగా మారుతోంది. అలా యాంటీ బాడీస్ టీడీపీలో డెవలప్ అయితే మాత్రం వచ్చే ఎన్నికల్లో ధీటైన పోరుకు రెడీ అయినా ఆశ్చర్యం లేదు మరి. మొత్తానికి జగన్ కి ఈ టీకా తాత్పర్యం వెనక ఉన్న సిసలైన రాజకీయమే అర్ధం కావాలేమో.

Tags:    

Similar News