మూడేళ్ల ముందే మొదలుపెట్టేశారట.. ఆ త్యాగానికి సిద్ధమేనట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ యాత్రకు సిద్ధమవుతున్నారు. జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయడంతో పాటు వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు కేంద్ర పెద్దలను కలుస్తారని [more]

Update: 2021-04-27 03:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ యాత్రకు సిద్ధమవుతున్నారు. జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయడంతో పాటు వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు కేంద్ర పెద్దలను కలుస్తారని టాక్. ఈ మేరకు ఆయన మోదీ, అమిత్ షాల అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం కీలక నేత ఒకరు ఢిల్లీలోనే ఉండి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రెండేళ్ల నుంచి…..

చంద్రబాబు ఢిల్లీ వెళ్లి దాదాపు రెండేళ్లు కావస్తుంది. 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిశారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ను కూడా కాంగ్రెస్ తో కలసి వెళ్లి ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు ఇక ఢిల్లీ వెళ్లలేదు. మరోసారి కేంద్రంలో మోదీ అధికారంలోకి రావడం, తాను ఇక్కడ దారుణ ఓటమి పాలు కావడంతో ఆయన ఢిల్లీ వైపు చూడలేదు.

బీజేపీ పెద్దలతో…

కానీ ఇక ఎన్నికలకు మరో మూడేళ్ల సమయమే ఉంది. ఇప్పటి నుంచే కమలం పార్టీ పెద్దలతో సయోధ్య కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ పెద్దలతో తనకున్న సంబంధాలను చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు. మూడు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేయకపోతే జగన్ ను ఎదుర్కొనడం కష్టమవుతుందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. అందుకే బీజేపీ, జనసేన తో కలసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

సీట్ల త్యాగానికి కూడా….

ముందుగా బీజేపీని ఒప్పించగలిగితే పవన్ కల్యాణ్ కలిసేందుకు రెడీగా ఉన్నారు. టీడీపీకి స్థానాలను కొన్ని తగ్గించుకునైనా మిత్ర పక్షాలకు సీట్లను త్యాగం చేసేందుకు చంద్రబాబు రెడీ అయిపోయారంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు దక్కకుంటే పార్టీ మనుగడే కష్టమవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ఢిల్లీ టూర్ ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. మొత్తం మీద ఎన్నికలకు మూడేళ్ల ముందే చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టేశారంటున్నారు.

Tags:    

Similar News