బంగారు పళ్ళెంలో పెట్టి అప్పగించారా ?

చంద్రబాబు అంటే ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అని ట్యాగ్ ఉంటుంది. అటువంటి రాజకీయ దిగ్గజం తీసుకున్న ఒకే ఒక నిర్ణయం వల్ల వైసీపీకి జిల్లాలలో పాలనాధికారాన్ని బంగారు [more]

Update: 2021-04-12 14:30 GMT

చంద్రబాబు అంటే ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అని ట్యాగ్ ఉంటుంది. అటువంటి రాజకీయ దిగ్గజం తీసుకున్న ఒకే ఒక నిర్ణయం వల్ల వైసీపీకి జిల్లాలలో పాలనాధికారాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి అప్పగించినట్లు అయిందని తమ్ముళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలు కంచుకోటలుగా టీడీపీకి ఉండేవి. ఇపుడు వాటిలో వైసీపీ పాగా వేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో గాలివాటం గెలుపు అని టీడీపీ తమ్ముళ్ళు ఎద్దేవా చేశారు. కానీ స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చూపిస్తూ నూటికి ఎనభై శాతం తమ వైపునకు తిప్పుకుంది. ఇపుడు చూస్తే పరిషత్ ఎన్నికల్లో చేతులెత్తేయడం ద్వారా టోటల్ గా అప్పరించేసింది టీడీపీ అంటున్నారు.

పరువు పోయిందా…?

టీడీపీకి ఎటువంటి విపత్కర కాలంలో అయినా కంచుకోట జిల్లా అని చెప్పే శ్రీకాకుళంలో ఇపుడు వైసీపీ జెండా గట్టిగా గర్వంగా ఎగురుతోంది. ఇక్కడ నుంచే ఇద్దరు టీడీపీ అధ్యక్షులను ఏపీకి అందించామని చంద్రబాబు ఎంత గొప్పగా చెప్పుకున్నా కూడా ఫలితం లేదులా ఉంది. గతంలో కళా వెంకటరావు ఏపీ ప్రెసిడెంట్ గా ఉంటూనే తన సొంత సీట్లో ఓడారు. పరిషత్ ఎన్నికల్లో ఎక్కువ ఏకగ్రీవాలు ఆయన ఇలాకాలోనే జరిగాయి. ఇపుడు అదే తీరు అచ్చెన్నాయుడు సొంత సీటు టెక్కలిలోనూ ఉంది. ఇక్కడ కూడా వైసీపీ దూసుకువచ్చేసింది అంటున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ కూన రవికుమార్ సొంత సీటు ఆముదాల వలసలో కూడా ఫ్యాన్ దూకుడుగానే ఉంది. మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ ఇలాకా పలాసాలో సైతం వైసీపీదే రాజ్యం అయింది. ఇక జిల్లాలో మిగిలిన చోట్ల సీనియర్ల సీట్లలో అలవోకగా వైసీపీ దూసుకుపోతోందని అంటున్నారు.

ఇక్కడా అదే సీన్….

విజయనగరం అయితే టీడీపీ నుంచి చేతులు మారిపోయి వైసీపీకి కంచుకోటలా రూపుదాల్చింది. ఇక్కడ పసుపు పార్టీలో వర్గ పోరు పెచ్చరిల్లుతోంది. దానికి తోడు అన్నట్లుగా పరిషత్ ఎన్నికల బహిష్కరణ పిలుపుతో మొత్తం సీట్లు వైసీపీకి దక్కేలా ఉన్నాయని అంటున్నారు. దీంతో విజయనగరం జెడ్పీ పీఠం మీద వైసీపీ కూర్చోవడం ఖాయంగా ఉంది. విశాఖ జిల్లాలోనూ ఇదే సీన్ ఉంది. ఈసారి ఎస్టీ మహిళకు ఇక్కడ రిజర్వ్ అయింది. చంద్రబాబు నిర్ణయంతో పరిషత్ ఎన్నికల్లో మొత్తం 39 మండలాల్లో ఏకపక్షంగా వైసీపీ గెలిచేందుకు పూర్తిగా అనుకూల వాతావరణం ఉంది అంటున్నారు.

దిద్దుకోలేనిదే…?

బహిష్కర‌ణ అన్న ఒక్కమాటతో ఉత్తరాంధ్రాలో టీడీపీకి అధినాయకత్వమే వెన్నుపోటు పొడించింది అన్నదే ఇపుడు తమ్ముళ్ళ ఆరోపణ. తాము చేతులు కట్టేసుకుని కూర్చున్నామని, అధికార పార్టీ పరుగును ఎవరూ ఆపలేకపోయారని వారే అంటున్నారు. ఒక్కసారి వద్దు అనుకున్నాక మళ్లీ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని ఏ ముఖం పెట్టుకుని అడుగుతామని కూడా అంటున్నారు. దాంతో పాటు జనాలు కూడా అలవాటు తప్పిపోతారని కూడా భయపడుతున్నారు. మూడు జిల్లాల్లో ఉన్న సీనియర్లు ఇక చాలు రాజకీయం అనుకుంటున్నారు. జూనియర్లు మాత్రం ఈ పరిణామలను చూసి పార్టీలో కొనసాగాలా వద్దా అని డోలాయమానంలో ఉన్నారు. మొత్తానికి అధికారాన్నివైసీపీకి బంగారు పళ్ళెం పెట్టి అప్పగించడం అంటే ఏంటో ఉత్తరాంధ్రాలో చంద్రబాబు చేసి చూపించారని అంటున్నారు.

Tags:    

Similar News