టీడీపీలో ట్విస్ట్‌: బాబు ఫొటో పోయే… ఎన్టీఆర్ ఫొటో వ‌చ్చే

ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో గ‌తంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు అన్నగారి నామ‌స్మర‌ణ పెరిగింది. పార్టీ వ్యవ‌స్థాప‌కుడు.. దివంగ‌త సీఎం..నంద‌మూరి తార‌క రామారావు పేరు ఇప్పుడు [more]

Update: 2021-05-04 09:30 GMT

ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో గ‌తంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు అన్నగారి నామ‌స్మర‌ణ పెరిగింది. పార్టీ వ్యవ‌స్థాప‌కుడు.. దివంగ‌త సీఎం..నంద‌మూరి తార‌క రామారావు పేరు ఇప్పుడు మార్మోగుతోంది. వాస్తవానికి పార్టీ త‌ర‌ఫున ఏ కార్యక్రమం చేప‌ట్టినా.. అన్నగారిని త‌లుచుకుంటారు. అన్నగారికి దండ‌లు వేసి ..ప‌క్కన పెడ‌తారు. ఇక‌, అప్పటి నుంచి చంద్రబాబు నామ స్మర‌ణ‌లో మునిగితేలుతున్న విష‌యం తెలిసిందే. ఏ కార్యక్రమం జ‌రిగినా.. ఇదే ప‌రిస్థితి టీడీపీలో క‌నిపిస్తోంది. కానీ, ఇప్పుడు చంద్రబాబును ప‌క్కన పెట్టి.. అన్నగారిని భుజాన వేసుకున్నారు త‌మ్ముళ్లు. పార్టీలో ఇటీవ‌ల ఇది ఎక్కువుగా క‌నిపిస్తోంది.

ఎన్నికలను బహిష్కరించడంతో…..

ఇటీవ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్కరిస్తున్నట్టు చంద్రబాబు ప్రక‌టించారు. రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్య పూరితంగా.. వ్యవ‌హ‌రిస్తోంద‌ని.. ఎన్నిక‌ల్లో అంగ‌బ‌లం, అర్ధబ‌లం, అధికార బ‌లం ప్రయోగించి.. గెలుస్తోంద‌ని.. సో.. తాము త‌ప్పుకొంటున్నామ‌ని చెప్పారు. అయితే.. దీనిపై పార్టీలోనే రెండు వ‌ర్గాలు ఏర్పడ్డాయి. ఎప్పటి నుంచో చంద్రబాబును పూజిస్తున్న నాయ‌కులు అశోక్ గ‌జ‌ప‌తిరాజు వంటి వారు కూడా బాబు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో చంద్రబాబు మాట మార్చారు. ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు సంబంధించి గ‌త ఏడాది బ‌ల‌వంతపు ఏక‌గ్రీవాలు జ‌రిగాయ‌ని.. వాటిని ర‌ద్దు చేసి.. కొత్తగా నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని.. ఇది ఇవ్వడం లేదు క‌నుక బ‌హిష్కరిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు.

కొత్త ఎత్తుగడతో….

కానీ, చంద్రబాబు చేసిన ఈ ప్రక‌ట‌న కూడా వ‌ర్కవుట్ కాలేదు. క్షేత్రస్థాయిలో నాయ‌కులు ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను ప్రతిష్టగా తీసుకోవ‌డం.. ఇప్పటికే అన్నీ సిద్ధం చేసుకోవ‌డం.. ప‌రువుతో కూడిన వ్యవ‌హారం కావ‌డంతో.. వారు ఎన్నిక‌ల వైపు మొగ్గు చూపారు. అయితే.. ఎవ‌రి ఫొటో పెట్టుకోవాలి ? అనే ప్రశ్న త‌లెత్తింది. విశాఖ‌, తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, కృష్ణాల్లోనూ నాయ‌కుల‌కు ఈ స‌మ‌స్య వ‌చ్చింది. చంద్రబాబు ఫొటోతో వెళ్తే.. అధికార ప‌క్షం తీవ్రస్థాయిలో విమ‌ర్శలు గుప్పిస్తోంది. అధినేత వ‌ద్దంటే.. నాయ‌కులు కావాలంటున్నారు. అంటే.. టీడీపీలో తిరుగుబాటు వ‌చ్చింద‌ని.. ప్రచారం చేస్తున్నారు. దీంతో టీడీపీ నేత‌లు… ముఖ్యంగా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డుతున్న నాయ‌కులు.. కొత్త ఎత్తుగ‌డ వేశారు.

పరిషత్ ఎన్నికల ప్రచారంలో…

ఇప్పుడు చంద్రబాబు ఫొటోల‌ను ప‌క్కన పెట్టి.. అన్న ఎన్టీఆర్ ఫోటోల‌తో ప్రచారం చేశారు. అన్నగారి సెంటిమెంటును రెచ్చగొట్టాలని యత్నించారు. ఎక్కడా చంద్రబాబుపేరును కూడా మ‌చ్చుకైనా వినిపించ‌కుండా.. అన్నగారి పాట‌లు.. అన్నగారి మాట‌ల‌ను మైకుల్లో వినిపిస్తు.. ప్రచారం చేశారు. ఇక‌, దీనిపై వైసీపీ నుంచి కూడా విమ‌ర్శలు వ‌చ్చే అవ‌కాశం లేదు. సో.. ఇప్పటికైతే.. టీడీపీ నేత‌లు ఈ వ్యూహాన్ని బాగానే అమ‌లు చేస్తున్నా.. రాబోయే రోజుల్లోనూ ఇదే త‌ర‌హా వ్యూహంతో చంద్రబాబును పూర్తిగా ప‌క్కన పెడితే.. ఆయ‌న‌కు మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్పవు.

పార్టీ ఓడినప్పుడల్లా…..

పార్టీ నేత‌లు ఇప్పుడేదో ఎన్టీఆర్ ఫొటో వాడ‌డం కాదు… 1999లో చంద్రబాబు గెలిచిన త‌ర్వాత క్రమ‌క్రమంగా చంద్రబాబు ఎన్టీఆర్‌ ఫొటో ప‌క్కన పెట్టేసి అన్ని ప‌థ‌కాల‌కు త‌న పేరు త‌గిలించుకుంటూ వ‌చ్చారు. 2004లో పార్టీ ఓడిపోయాక మ‌ళ్లీ ఎన్టీఆర్‌ను వాడ‌డం స్టార్ట్ చేశారు. తిరిగి 2014లో బాబు గెలిచాక ఒక‌టి రెండు ప‌థ‌కాల‌కు త‌ప్పా అన్ని ప‌థ‌కాల‌కు చంద్రన్న పేరు త‌గిలించుకుంటూ పోయారు. ఇక ఇప్పుడు పార్టీ నేత‌లే చంద్రబాబు ఫొటో తీసేసి ఎన్టీఆర్ ఫొటోను వాడుకుంటున్నారు.

Tags:    

Similar News