బీజేపీకి చంద్రబాబు రాజమార్గం చూపారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని అపర చాణక్యుడు అని అంతా అంటారు. కానీ గత మూడేళ్ళుగా ఆయన వ్యూహాలు ఏవీ పారకపోగా నేలబారుడుగా ఉంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. [more]

Update: 2021-04-03 08:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని అపర చాణక్యుడు అని అంతా అంటారు. కానీ గత మూడేళ్ళుగా ఆయన వ్యూహాలు ఏవీ పారకపోగా నేలబారుడుగా ఉంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. బంగారం లాంటి బీజేపీ బంధాన్ని పుటుక్కున 2018లో తెంచేసుకున్నపుడే చంద్రబాబు రాజకీయ వ్యూహం ఎంత పేలవంగా ఉందో అర్ధమైందని అన్న వారూ ఉన్నారు. ఇక ఆ తరువాత వరస తప్పులు చేస్తూ ఏపీలో టీడీపీని చేపచుట్టేసే స్థితికి చంద్రబాబు తెచ్చారని అంటున్నారు.

ఎవరికి మేలు…?

టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించామని గొప్పగా చెప్పుకుంటోంది. దీని వల్ల లాభం ఎవరికి అన్నది మాత్రం ఆ పార్టీ పెద్దల బుర్రలకు తట్టడంలేదు. ఏపీలో పక్కనే బీజేపీ కాచుకుని కూర్చుంది. ఆ పార్టీ కూడా తాజా నోటిఫికేషన్ అని డిమాండ్ చేస్తోంది. కానీ ఎన్నికల బహిష్కరణ వంటి కఠిన నిర్ణయం తీసుకోవడంలేదు. దాంతో ఇపుడు టీడీపీ ఎన్నికల్లో పాల్గొనకపోతే లాభం చేకూరేది బీజేపీ జనసేన కూటమికే అని కూడా అంటున్నారు. చంద్రబాబు తాను రేసులో లేను ఓట్లేయవద్దు అనడం ద్వారా అసలుకే ఎసరు తెచ్చుకుందని కూడా విశ్లేషణలు ఉన్నాయి.

వ్యతిరేకత అలా…?

ఎంతటి ఘనమైన ప్రభుత్వమైనా కూడా వ్యతిరేకత ఉంటుంది. వైసీపీ వ్యతిరేక ఓట్లను రాబట్టుకోవడంలో ఫెయిల్ అయిన టీడీపీ మాకు అసలు ఎన్నికలే వద్దు అనేస్తోంది. మరి ఆ వ్యతిరేక ఓట్లు ఎటు పోతాయి. అవి కచ్చితంగా మరో పార్టీకి పడాలి కదా. మాకు ఎన్నికలూ వద్దు, మీ ఓట్లూ వద్దు అన్న టీడీపీకి జనాలు ఓట్లు వేయరు కదా. అలా ఫస్ట్ టైమ్ అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు టీడీపీకి కాకుండా బీజేపీ కూటమికి కనుక పడితే అంతకంటే ఆత్మహత్యాసదృశ్యం అన్నది వేరోటి ఉండదు. చంద్రబాబు ఈ విషయంలో రాంగ్ రూట్లో వెళ్తున్నారని పార్టీలోని సీనియర్లు కూడా అంటున్న మాట.

రాజకీయ శూన్యత …

ఏపీలో రాజకీయ శూన్యతనే బీజేపీ కోరుకుంటోంది. అది కూడా విపక్షంలో. ఇపుడు ఆ చోటే ఖాళీ చేసి పెడుతోంది టీడీపీ. మరి రోగి కోరింది, డాక్టర్ ఇచ్చిన మందూ ఒక్కటే అయితే అంతకంటే మజా ఏముంది. అలా ఏపీలో బీజేపీ గట్టిగా కాళ్ళూనడానికి ఇదొక సువర్ణ అవకాశంగా భావిస్తున్నారు. ఏపీలో ఇంతమంచి అవకాశం చంద్రబాబు ఇవ్వడం అంటే తన పసుపు కోటలను తానే ముక్కలు చేసుకున్నట్లే. ఇక ఏపీలో ఇంతదాకా స్థానిక ఎన్నికలను ఏ పార్టీ బహిష్కరించలేదు. ఫస్ట్ టైమ్ టీడీపీ అలా చేస్తోంది. దాంతో బీజేపీకి ఎదగడానికి దగ్గరదారి ఏర్పడుతోంది అన్న మాట ఉంది. పరిషత్ ఎన్నికల్లో దాదాపుగా రెండున్నర కోట్ల మంది ఓట్లు వేస్తారు. వారి ఓటు కనుక ఒక్కసారి బీజేపీ వైపు వెళ్ళిందంటే తిరిగి రాబట్టడానికి టీడీపీ తాతలు దిగిరావాల్సిందే. ఇంత మంచి అవకాశం ఇచ్చిన టీడీపీకి బీజేపీ థాంక్స్ చెప్పుకోవాల్సిందే మరి.

Tags:    

Similar News