బాబు మూతికి ప్లాస్టర్ పడిందా?

చంద్రబాబు తన రాజకీయాన్ని గేర్ మార్చారా. జగన్ మీద ఎంతలా గొంతు చించుకుంటున్నా జనంలో టీడీపీ మీద ఏ రకమైన పాజిటివ్ రియాక్షన్ లేకపోవడంతో ఎన్నికలు అయిన [more]

Update: 2021-03-21 13:30 GMT

చంద్రబాబు తన రాజకీయాన్ని గేర్ మార్చారా. జగన్ మీద ఎంతలా గొంతు చించుకుంటున్నా జనంలో టీడీపీ మీద ఏ రకమైన పాజిటివ్ రియాక్షన్ లేకపోవడంతో ఎన్నికలు అయిన రెండేళ్ల తరువాత ఇన్నాళ్ళకు చంద్రబాబు కొత్త రూట్ మారుస్తున్నారా అన్న చర్చ అయితే నడుస్తోంది. చంద్రబాబు జగన్ మీద ప్రతీ రోజూ పదే పదే విమర్శలు చేయడం వల్లనే జగన్ కి అది సానుభూతిగా మారుతోంది అని కూడా గ్రహించారుట. పైగా జగన్ కి అనవసరంగా ప్రచారం తెచ్చిపెడుతున్నామని కూడా చంద్రబాబు భావిస్తున్నారట. దాంతో ఇకపైన అవసరం అయితేనే తప్ప చంద్రబాబు గొంతు మెదపరు అంటున్నారు తమ్ముళ్ళు.

అచ్చం జగన్ లాగానే …

వయసులో చిన్నవాడు అయినా జగన్ని చంద్రబాబు కొన్ని విషయాల్లో అనుసరించకతప్పడంలేదు. చంద్రబాబు సెవెంటీస్ కాలం నాటి పొలిటీషియన్. జగన్ ఈ తరం రాజకీయ నేత. దాంతో పాటు జగన్ చాలా ఈజీగా జనాల్లో కనెక్ట్ అవుతున్నాడు. ఇపుడు దాన్నే స్టడీ చేస్తున్న చంద్రబాబు జగన్ మాదిరిగానే తాను కూడా ఉండే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. జగన్ ఎక్కువగా మాట్లాడరు, ఆయన ఉన్నారా లేరా అన్నట్లుగా ఏపీలో పాలన సాగిపోతుంది. మీడియాకు దూరంగా ఉంటారు. తాను ఏం చెప్పాలనుకున్నా తన వారి ద్వారానే జనాలకు చేరవేస్తారు. కొందరి నాయకులను నమ్ముకుని వారి ద్వారానే ప్రభుత్వం పార్టీ ఏదైనా కధ నడిపిస్తారు. సరిగ్గా ఈ ప్రాక్టీస్ నే చంద్రబాబు చేయబోతున్నారు అంటున్నారు.

అలా ఉండగలరా…?

మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత చంద్రబాబు మాట్లాడడం బాగా తగ్గించేశారు. బాబు లాంటి నాయకుడిలో అది గుణాత్మకమైన మార్పుగానే చూడాలి అని అంతా అంటున్నారు. చంద్రబాబు మాట్లాడకుండా అసలు ఉండలేరు. ఆయన రాజకీయమే అంత. కానీ ఇపుడు ఆయన మూతికి ప్లాస్టర్ వేసుకున్నట్లుగా చాలా కామ్ గా ఉన్నారు. ఇక చంద్రబాబు మీద సీఐడీ నోటీసులు ఇచ్చినా కూడా బయటకు వచ్చి జగన్ మీద బీభత్సమైన విమర్శలు చేయలేదు. తుగ్లక్ పాలన అంటూ నిందించలేదు. తాను చేయాల్సింది కామ్ గా చేసుకున్నారు. కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుని తన రాజకీయం ఇదీ అని చెప్పకనే చెప్పేశారు. ఇలా సైలెంట్ తోనే తానేంటో చంద్రబాబు మచ్చుకు ఒకటి అన్నట్లుగా రుచి చూపించారు. మరి ఇదే విధంగా ఫ్యూచర్ పాలిటిక్స్ ని బాబు కంటిన్యూ చేయగలరా అన్నది ఒక డౌట్.

సానుభూతి కోసమా…?

చంద్రబాబు ఇప్పటిదాకా జనాల్లో తిరిగారు, మీడియాలో కనిపించారు. ప్రతీ రోజూ ఏదో సబ్జెక్ట్ పట్టుకుని వైసీపీ మీద రంకెలు వేశారు. దాంతో చంద్రబాబు తీరు మీదనే జనాలకు ఒక దశలో విసుగు కలిగింది అంటారు. ఇపుడు బాబు సైలెంట్ మంత్రతో ముందుకు పోవాలనుకుంటున్నారు. అవసరం అయితే తప్ప తాను జనాలకు కనిపించకూడదు, వినిపించకూడదు అని నిర్ణయించుకున్నారని భోగట్టా. అదే కనుక జరిగితే జనాలకు చంద్రబాబు గురించి తిరిగి ఆలోచించే పరిస్థితి వస్తుంది అంటున్నారు. చంద్రబాబు ఎక్కడ అంటూ మొదలయ్యే ఆలోచనలు చివరికి ఆయన మీద సానుభూతి పవనాలు వీచేలాగా మారుతాయని బాబు మాస్టర్ మైండ్ అంచనా వేస్తోందిట. మొత్తానికి మౌన మునిలాగా చంద్రబాబు మారబోతారు అన్నది కొత్త వార్త. అదే నిజమైతే ఏపీ పాలిటిక్స్ మరింత ఆసక్తిగా ఉంటాయి మరి.

Tags:    

Similar News