ఇప్పుడు కూడా బయటకు రాకపోతే ఎలా?

పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మున్సిపల్ ఎన్నికలు ముందున్నాయి. అయినా టీడీపీ నేతలు మాత్రం పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు రావడం లేదు. అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు [more]

Update: 2021-03-07 08:00 GMT

పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మున్సిపల్ ఎన్నికలు ముందున్నాయి. అయినా టీడీపీ నేతలు మాత్రం పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు రావడం లేదు. అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు తమ వ్యాపారాలకే పరిమితమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండేళ్లు కావస్తున్నప్పటికీ టీడీపీ నేతలు మాత్రం పార్టీ బాగోగులను పట్టించుకోక పోవడం చర్చనీయాంశమైంది. పదమూడు జిల్లాల్లోనూ ముఖ్యమైన నేతలు మొహం చాటేయడం పార్టీ దుస్థితికి అద్దం పడుతుంది.

రెండేళ్లవుతున్నా…..

అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండేళ్లు కావస్తుంది. ప్రభుత్వం పై వ్యతిరేకత ఉన్నా లేకపోయినా విపక్ష పార్టీ నేతలు ప్రజల్లో ఉంటేనే వారికి వచ్చే ఎన్నికల్లో జనాదరణ లభిస్తుంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల వైపు కూడా చూడటం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నిత్యం వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా పార్టీలో జోష్ నింపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు.

నిర్లక్ష్యమే కారణం కాదా?

పంచాయతీ ఎన్నికలలో పార్టీ మద్దతుదారులు స్వల్ప సంఖ్యలో గెలవలేక పోవడానికి కూడా నేతల నిర్లక్ష్యమే కారణమని చెప్పకతప్పదు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం వంటి నియోజకవర్గంలోనూ ఇన్ చార్జులు పార్టిని పట్టించుకోక పోవడంతోనే దారుణ ఫలతాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు కూడా పార్టీని సమాయత్తం చేసేందుకు టీడీపీ నేతలు ముందుకు వస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది.

బాబు పర్యటనతోనైనా…?

చంద్రబాబు వచ్చే నెల 1వ తేదీ నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. దాదాపు అన్ని కార్పొరేషన్ల పరిధిలో చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు. కొన్ని కీలకమైన మున్సిపాలిటీల్లో కూడా చంద్రబాబు ప్రచారం చేసే అవకాశముంది. చంద్రబాబు ప్రచారం సమయంలోనైనా టీడీపీ నేతలు బయటకు వస్తారా? లేదా? అన్నది సందేహమే. ఆర్థిక పరమైన ఇబ్బందులు, కేసుల భయంతోనే టీడీపీ నేతలు గుమ్మం దాటి బయటకు రావడం లేదు. ఈ పరిస్థితి పార్టీకి భవిష్యత్ లో నష్టం చేకూరుస్తుందన్న ఆందోళన క్యాడర్ లో వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News