ఈ మూడు నెలలు గడిస్తే చాలట

టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో మూడు నెలలు పరీక్ష కాలమే. పంచాయతీ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికలో కనీస పెర్ ఫార్మెన్స్ చూపకుంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి [more]

Update: 2021-02-06 03:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో మూడు నెలలు పరీక్ష కాలమే. పంచాయతీ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికలో కనీస పెర్ ఫార్మెన్స్ చూపకుంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఊహించుకుంటానికి కూడా వీలులేదు. చంద్రబాబు కోరుకున్నట్లుగానే పంచాయతీ ఎన్నికలు ముందు వచ్చాయి. ఇక్కడ కొంత పట్టుబిగిస్తే తప్ప రానున్న ఏ ఎన్నికల్లోనూ టీడీపీ క్యాడర్ పోలింగ్ బూత్ ల వద్ద నిలబడే పరిస్థితి లేదు. అందుకే చంద్రబాబు ప్రతిరోజూ వీడియో కాన్ఫరెన్స్ లతో నేతలతో ఉత్తేజం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఎన్నికలు పూర్తయితే…?

స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక పూర్తయితే ఇక ఇప్పట్లో ఎన్నికలు ఉండవు. ప్రభుత్వం మరింత దూకుడు పెంచుతుంది. ఇప్పటికే గత పదిహేను నెలలుగా టీడీపీ నేతలు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. వారందరినీ యాక్టివ్ చేయడానికి చంద్రబాబు పడని కష్టమంటూ లేదు. నిత్యం ఏదో ఒక కార్యక్రమం చెప్పి వారిని పార్టీ కార్యాలయానికి రప్పించే ప్రయత్నం చేశారు. అయినా అనేక మంది నేతలు నియోజకవర్గాలకు చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారు.

గెలుపు కన్నా….

ఇక తిరుపతి ఉప ఎన్నికలో సయితం చంద్రబాబుకు గెలుపు కన్నా రెండో స్థానంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లు కన్పిస్తుంది. ఇక్కడ బీజేపీ దూకుడుగా ఉంది. చంద్రబాబు అందుకే ముందుగా అభ్యర్థిని ప్రకటించారు. అయితే అభ్యర్థి పనబాక లక్ష్మి యాక్టివ్ గా లేరు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపితే తిరుపతిలో రిజల్ట్ ఎలా ఉంటుందన్న దానిపై నిత్యం చంద్రబాబు టెన్షన్ పడుతూనే ఉన్నారు.

ఫలితాల తర్వాతే…..

ఈ మూడు నెలలు ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు, ఇటు తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న అంశంపై టీడీపీలోనూ చర్చ జరుగుతుంది. పార్టీ పరిస్థితి మరింత దిగజారకుండా ఉండాలంటే గట్టి పోటీ ఇవ్వాలన్నదే చంద్రబాబు ఉద్దేశ్యం. అందుకే ప్రతి చోట నామినేషన్ వేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నేతలకు సూచించారు. మరి మూడు నెలల పాటు చంద్రబాబుకు నేతలను ఒక దారికి తేవడం కష్టంగానే మారుతుంది. మరి చంద్రబాబు గ్రహబలం ఎలా ఉందో చూడాలి మరి.

Tags:    

Similar News