అమరావతి ఆయువు తీస్తున్నది బాబేనా ?

చంద్రబాబుకు ఆత్రం ఆరాటం ఎక్కువ. దాంతోనే వ్యూహాలు కూడా మరచి నేల విడిచి సాము చేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. అమరావతి రాజధాని అంటూ వీర లెవెల్లో [more]

Update: 2020-12-25 02:00 GMT

చంద్రబాబుకు ఆత్రం ఆరాటం ఎక్కువ. దాంతోనే వ్యూహాలు కూడా మరచి నేల విడిచి సాము చేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. అమరావతి రాజధాని అంటూ వీర లెవెల్లో ఆనాడు హైప్ చేసిన చంద్రబాబు తన పదవీ కాలం ముగిసే సమయానికి రాజధాని కోసం చట్టపరమైన భద్రత వంటివి ఏమీ చేయకుండానే దిగిపోయారు. తనకు అన్ని విధాలుగా బద్ధ శత్రువు అయిన జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతి గురించి వైసీపీ సర్కార్ ఎందుకు పట్టించుకుంటుంది. ఈ మాత్రం కనీస ఆలోచన లేకపోవడం టీడీపీ పెద్దల మొదటి తప్పు అయితే అమరావతి మీద చంద్రబాబు విపరీతమైన ఫోకస్ పెట్టడం మరో తప్పు. దాని వల్లనే జగన్ ఆ వైపుగా కూడా తొంగి చూడడంలేదు అంటున్నారు.

రాసుకుపూసుకుంటున్నారుగా…?

అమరావతి రాజధానిగా ఉండాలని నిజంగా చంద్రబాబు అనుకుంటే అసలు ఆ వైపునకు కూడా వచ్చేవారు కాదు, తన నీడ కూడా పడనిచ్చేవారు కాదు, ఇక చంద్రబాబు అనుకూల మీడియాను కూడా గమ్మున ఉండమని చెప్పేవారు. కానీ చంద్రబాబు మాత్రం అమరావతి కేసును వకాల్తా పుచ్చుకుని మరీ రెచ్చుతున్నారు. అక్కడే జగన్ కి కూడా మండుతోంది. ఫలితంగా బాబు ఎంత రేంజిలో అమరావతి మీద సౌండ్ చేస్తే అంతకు మించి జగన్ రియాక్షన్ కూడా ఉంటోంది. ఈ లాజిక్ ని చంద్రబాబు ఆయన చుట్టూ ఉన్న వారు మరచిపోవడం వల్లనే అమరావతి రాజధాని అలా పడకేస్తోంది అంటున్నారు.

చావనీక బతకనీక…..

అమరావతి రాజధాని కోసం చంద్రబాబు ఒకనాడు జోలె పట్టారు, మళ్లీ మధ్యలో వదిలేశారు. ఇపుడు సినిమా ఫంక్షన్ల శతదినోత్సవ వేడుకల మాదిరిగా సభలు పెట్టి హాజరవుతున్నారు. ఇదంతా చూసిన వారికి జగన్ మాట దేవుడెరుకు అసలు చంద్రబాబుకు అమరావతి మీద ఎంత వరకూ చిత్తశుద్ధి ఉంది అన్నది కూడా ఒక డౌట్ గా ఉంది. అమరావతి రాజధాని కోసం పోరాడుతున్న వారిని అలా వదిలేసినా సమస్య ఈ పాటికి ఏదో రకంగా పరిష్కారం అయ్యేదేమో. కానీ చంద్రబాబు నీడ పడడం వల్లనే అది ఎటూ తేలకుండా అలా కొనసాగుతోంది. పైగా ఓ వైపు అమరావతి భూముల మీద ఏసీబీ విచారణను కోర్టు స్టేల ద్వారా అడ్డుకుంటూ ఇన్ సైడర్ ట్రేడింగ్ మీద ఏం తేల్చారంటూ జగన్ ని గద్దించడమూ చంద్రబాబుకే చెల్లింది.

ఇదే ఖాయం….

చంద్రబాబు అమరావతి జపం వదలరు, బాబు ఉండగా జగన్ కూడా అమరావతిని కలలో కూడా తలవరు, దీంతో ఏళ్ళూ పూళ్ళూ గడచినా అమరావతి కధ అలాగే సాగుతుంది అంటున్నారు. చంద్రబాబు అయిదేళ్ళ పాటు గ్రాఫిక్స్ చూపించి అమరావతి జనాలను మభ్యపెట్టారు. ఇపుడు విపక్షంలో కూడా వారి వైపు ఉన్నట్లుగా కనిపిస్తూ మరింత అన్యాయం చేస్తున్నారు అన్న విమర్శలు అయితే వినిపిస్తున్నారు. చంద్రబాబుకు ఇతర జిల్లాలూ వాటి ఓట్లూ సీట్ల రాజకీయాలు ముఖ్యం కాబట్టే అమరావతి ఉద్యమాన్ని రెండు జిల్లాల గడప దాటనీయలేదని, రాష్ట్ర స్థాయి ఉద్యమానికి బాటలు వేయలేదని కూడా ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే అమరావతికి జగన్ కంటే బాబే ఎక్కువ అన్యాయం చేశారు అన్నది మెజారిటీ ప్రజల భావన.

Tags:    

Similar News