బాబు జాతీయ పదవి ఊడిపోయినట్లేనా?

జాతీయ పార్టీలు ఈ దేశంలో గట్టిగా చెప్పుకుంటే రెండే. అవి కాంగ్రెస్, బీజేపీ మాత్రమే. దేశం నలుమూలల తెలిసిన పార్టీలు వీటికంటే మరేవీ లేవు. వామపక్షాలు ఎన్నికల [more]

Update: 2020-12-12 14:30 GMT

జాతీయ పార్టీలు ఈ దేశంలో గట్టిగా చెప్పుకుంటే రెండే. అవి కాంగ్రెస్, బీజేపీ మాత్రమే. దేశం నలుమూలల తెలిసిన పార్టీలు వీటికంటే మరేవీ లేవు. వామపక్షాలు ఎన్నికల కంటే కూడా పోరాటాల ద్వారానే జనాలకు తెలుసు. అయినా ఆ పార్టీల జాతీయ హోదాకూ వరసగా కోత పడుతోంది. ఇక ప్రాంతీయ పార్టీలుగా పుట్టి రాష్ట్రం రెండు కాగానే జాతీయ పార్టీలుగా చెప్పుకునే వింత సంస్కృతి ఒక్క తెలుగు సీమలోనే ఉంది. చంద్రబాబు దానికి నాంది పలికితే వైసీపీ జనసేన అనుసరిస్తున్నాయి.

పనేమీ లేదా …?

తెలుగుదేశం పార్టీని ఆంధ్రోళ్ళ పార్టీ అని కేసీఆర్ ఏనాడో అనేశారు. మీకు ఇక్కడ ఏం పని అని కూడా నిలదీశారు. 2018లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని నిండా ముంచాక నిజంగా టీడీపీకి అక్కడ పనేమీ లేదు. అయితే ఈ మధ్యలో జరిగిన హుజూర్ నగర్, దుబ్బాక ఉప ఎన్నికలు విడిచి పెట్టి గ్రేటర్ హైదరాబాద్ లో 106 సీట్లకు తెలుగుదేశం పోటీ చేసింది. అన్ని చోట్లా డిపాజిట్లు గల్లంతు అయి పరువు మొత్తం పోయింది. ఈ సంగతి ముందే తెలిసి చంద్రబాబు, చినబాబు ప్రచారానికి వెళ్లలేదా అన్న డౌట్లు ఇపుడు వస్తున్నాయి.

ఫక్త్ ఆంధ్రా పార్టీయే….?

ఇక గ్రేటర్ ఎన్నికల ముచ్చట కూడా తీరాక చేతులు కాల్చుకున్నాక చంద్రబాబు మళ్ళీ అచ్చెన్నాయుడు ప్లేస్ లో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయిపోవడం బెటర్ అని వైసీపీ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. జాతీయ పార్టీ అంటే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లోపోటీ చేసి ఆరు శాతం ఓట్లను సంపాదించుకోవాలి. అవేమీ లేని టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికీ ప్రాంతీయ పార్టీయే. మరి ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిని అని చెప్పుకుంటే చంద్రబాబు పవర్ అంతా 13 జిల్లాలకే పరిమితం అని గ్రేటర్ ఎన్నికలు తేల్చేశాయి. ఇక టీడీపీకి అక్కడ మిగులూ తగులూ ఏమైనా ఉంటే తెలంగాణా తమ్ముళ్ళు వేరే పార్టీలలోకి సర్దుకుంటారని కూడా తాజా టాక్.

తెలివైన పనేనా…?

ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్లు మొత్తం గల్లంతు అయి పరువు పోగొట్టుకుంటే అసలు పోటీ ఊసే ఎత్తని జగన్ కామ్ గా ఉంటూ గ్రేటర్ టెన్షన్ తగ్గించుకున్నారు. ఇక ఇలాంటివేవో జరుగుతాయని చివరి క్షణంలోనైనా గ్రహించి పవన్ బీజేపీకి మద్దతు పేరిట తన వారిని పోటీ నుంచి డ్రాప్ చేయించారు. మొత్తం ఎపిసోడ్ లో టీడీపీ అడ్డంగా బుక్ అయిందని అంటున్నారు. 2019 ఎన్నికల తరువాత మరో ఘోర అవమానం పార్టీ రికార్డుల్లోకి ఎక్కింది. దీని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బాగానే సెటైర్లు వేస్తున్నారు. టీడీపీకి ఏపీ లోకల్ బాడీ ఎన్నికల్లోనూ గుండు సున్నావే అంటూ జోస్యాలు చెబుతున్నారు. మొత్తానికి చివరికి ఇదన్న మాట పసుపు పార్టీకి దక్కిందని ఏపీ తమ్ముళ్ళూ ఇపుడు మధనపడుతున్నారు.

Tags:    

Similar News