మిత్రులకు బాబు హ్యాండిచ్చినట్లేనా?

చంద్రబాబు ఇక జాతీయ రాజకీయాలను వదిలేసినట్లే. ఆయన పూర్తిగా ఏపీ రాజకీయాలకే పరిమితమయిపోయారు. సహజంగా చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పటికీ అప్పట్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బలమైన కూటమిని [more]

Update: 2020-12-09 06:30 GMT

చంద్రబాబు ఇక జాతీయ రాజకీయాలను వదిలేసినట్లే. ఆయన పూర్తిగా ఏపీ రాజకీయాలకే పరిమితమయిపోయారు. సహజంగా చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పటికీ అప్పట్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బలమైన కూటమిని రూపొందించడంలో కీలక భూమికను పోషించారు. అప్పట్లో జయలలిత, ఫరూక్ అబ్దుల్లా వంటి సీనియర్ నేతలను సయితం హైదరాబాద్ కు రప్పించుకుని మరీ కూటమిని పటిష్టపర్చేందుకు చంద్రబాబు ప్రయత్నించారు.

కూటమి ఏర్పాటుకు…..

2014 ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమిలో చేరిన చంద్రబాబు తర్వాత దానిని వదిలేశారు. ఎన్నికల సమయంలో మమత బెనర్జీ, అఖిలేష్ యాదవ్, మాయావతి వంటి వారిని కలిసి బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. కర్ణాటక కు వెళ్లి కుమారస్వామి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. స్వయంగా కోల్ కత్తా వెళ్లి మమత బెనర్జీకి మద్దతుగా నిలిచారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో చంద్రబాబు గట్టిగానే నినదించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగానే ఢిల్లీ సాక్షిగా వినిపించారు.

జాతీయ రాజకీయాలకు….

కానీ 2019 ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత చంద్రబాబు జాతీయ రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. తెలంగాణలో పార్టీనే ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. చంద్రబాబుకు డీఎంకే స్టాలిన్ మంచి మిత్రుడు. ఆయన స్వయంగా చెన్నై వెళ్లి కలసి వచ్చారు. ఇప్పుడు స్టాలిన్ కు తమిళనాడులో మద్దతిచ్చేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నాలు చేయడంలేదు.

బీజేపీకి వ్యతిరేకమని…

తమిళనాడులో తెలుగు ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. అదే కర్ణాటక ఎన్నికల్లో ప్రచారానికి బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లిన చంద్రబాబు తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు సుముఖంగా లేరు. దీనికి కారణం అక్కడ డీఎంకే బీజేపీకి వ్యతిరేకంగా ఉండటమే. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కూడా చంద్రబాబు గట్టి మద్దతుదారు. కానీ ఆ విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఇక చంద్రబాబు జాతీయ రాజకీయాలకు పూర్తిగా దూరం జరిగినట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News