బాబుకు పని లేకుండా చేస్తున్న జగన్ ?

అధికారంలో ఉంటే తాను చెప్పే సూక్తులు మాత్రమే వినమనే చంద్రబాబు కుర్చీ దిగిపోగానే ప్రభుత్వం మీద బాణాలు ఎక్కుపెడతారు. ఎన్నికలపుడే రాజకీయాలు, మిగిలిన కాలమంతా అభివృద్ధి కోసమేనని [more]

Update: 2020-11-28 14:30 GMT

అధికారంలో ఉంటే తాను చెప్పే సూక్తులు మాత్రమే వినమనే చంద్రబాబు కుర్చీ దిగిపోగానే ప్రభుత్వం మీద బాణాలు ఎక్కుపెడతారు. ఎన్నికలపుడే రాజకీయాలు, మిగిలిన కాలమంతా అభివృద్ధి కోసమేనని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షంలోకి వస్తే మాత్రం దానికి తూచ్ అనేసి పెద్ద గొంతు చేస్తారు. తెల్లారిలేస్తే అధికార పక్షం కాళ్ళలో పడిపోతూ చెవిలో జోరిగ మాదిరిగా విమర్శలు చేస్తూనే ఉంటారు. మరి ఇది ఎంతవరకూ సమంజసమో నాలుగు పదుల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకే తెలియాలి.

భూతద్దంలో చూసి….

జగన్ సర్కార్ లో చీమ చిటుక్కుమన్నా అనుకూల మీడియా అసరాతో చంద్రబాబు రెడీ అయిపోతారు. ఇంత ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని తాను అసలు చూడలేదని ధాటీగా విమర్శలు చేస్తారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి అవినీతి సర్కార్ లేనేలేదని కూడా ఆడిపోసుకుంటారు. ఇక చంద్రబాబు విపక్షంలోకి జరిగి ఏడాదిన్నర దాటుతోంది. ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు చూస్తే పసలేనివే ఎక్కువ అని వైసీపీ నేతలు అంటారు. ఇక చంద్రబాబు తన కలల రాజధాని అమరావతి మీద చాన్నాళ్ళూ నానా యాగీ చేశారు. మరి ఆ తరువాత ఎందుకో దాన్ని వదిలేశారు. ఇపుడు అది కోర్టులో ఉంది. దాంతో మిగిలిన వాటిని ఎంచుకుంటున్నారు.

పోలవరం మీద అలా….

ఇక పోలవరం విషయంలో జగన్ సర్కార్ ఏమీ చేయలేదని నిన్నటిదాకా చంద్రబాబు అండ్ కో గట్టిగా మాట్లాడారు, అయితే పోలవరం నిధులు తగ్గిపోవడానికి బాబే కారణమని మంత్రి అనిల్ కుమార్ సహా వైసీపీ నేతలు చిట్టా విప్పడంతో కాస్తా సౌండ్ తగ్గించారు. ఇక పోలవరం ఆరు నూరు అయినా తాము పూర్తి చేస్తామని జగన్ కచ్చితంగా చెప్పడంతో దాని మీద మాట్లాడేందుకు కూడా ఏదీ లేకుండా పోతోంది. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని జగన్ డెడ్ లైన్ పెట్టి మరీ డేట్ టైం చెప్పేశాక అది కూడా టీడీపీకి అస్త్రంగా లేకుండా పోయిందట.

ఇళ్ల కధకూ క్లైమాక్స్…..

జగన్ ఇన్నాళ్ళూ కొంత మొండితనమో మరేమో కానీ ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో కాస్తా వెనకా ముందూ ఆడారు. కొన్ని భూముల విషయంలో కోర్టులో వివాదాలు ఉంటే మొత్తానికి మొత్తం పంపిణీ ఆపేసి కూర్చుకున్నారు. ఇన్నాళ్ళకు జగన్ లో కదలిక వచ్చింది. వివాదాలు లేని భూముల నుంచి ఇళ్ళ పట్టాలను ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దానికి డిసెంబర్ 25న ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ పరిణామాల క్రమంలో నా ఇల్లూ, నా ఇష్టం అంటూ టీడీపీకి అతి పెద్ద నిరసన ప్రొగ్రామ్ ఇచ్చిన చంద్రబాబుకు ఇపుడు అది కూడా లేకుండా పోయింది. కొత్త జిల్లాలను 32 దాకా చేస్తామని జగన్ చెప్పడంతో దాన్ని కూడా వివాదానికి చేయడానికి లేదు. మొత్తానికి జగన్ అనుకున్నదీ, చెప్పినవీ చెప్పనివీ కలిపి చేసేయడంతో టీడీపీకి పెద్ద గొంతు చేసేందుకు సమస్యలు లేకుండా పోతున్నాయట.

Tags:    

Similar News