చంద్రబాబుకు మ‌రో షాకింగ్ న్యూస్‌.. అడ్డుకోగలరా? చేతులెత్తేస్తారా…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ దూకుడుతో ఇప్పటికే టీడీపీ క‌కావిక‌లం అయింది. గ‌తంలో త‌న పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల‌ను చంద్రబాబు ఆక‌ర్ష్ మంత్రంతో పార్టీ నుంచి [more]

Update: 2020-03-24 03:30 GMT

వైసీపీ అధినేత జ‌గ‌న్ దూకుడుతో ఇప్పటికే టీడీపీ క‌కావిక‌లం అయింది. గ‌తంలో త‌న పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల‌ను చంద్రబాబు ఆక‌ర్ష్ మంత్రంతో పార్టీ నుంచి లాగేసుకోవ‌డంపై ఆగ్రహించిన జ‌గ‌న్‌.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత టీడీపీని నిర్వీర్యం చేసే ప్రయ‌త్నాలు జోరుగా సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేల‌ను లాగేశారు. అదేవిధంగా మాజీల‌ను కూడా పార్టీలో చేర్చుకుని చంద్రబాబుకు ఝ‌ల‌క్ ఇచ్చారు. త్వర‌లోనే మ‌రింత మందిని పార్టీలో చేర్చుకునేందుకు జ‌గ‌న్ యుద్ధప్రాతిప‌దిక‌న ప్రణాళిక‌ను అమ‌లు చేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో టీడీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. అయితే, ఇప్పుడు మ‌రో అగ్ని ప‌రీక్ష ఎదురైంది. దీంతో మ‌రింత‌గా టీడీపీ త‌ల్లడిల్లుతోంది. విష‌యంలోకి వెళ్తే..

పార్టీ కార్యాలయాన్ని….

అమరావతి రాజధానిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చివేసి, వాటి పరిధిలోని స్థలాలను స్వాధీనం చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. అధికార పార్టీ నేతల ఫిర్యాదు మేరకు ఈ స్థలాలను ప్రభుత్వపరం చేసే కసరత్తును అధికారులు ఇప్పటికే మొదలుపెట్టారు. మంగళగిరి ప్రాంతంలోని ఆత్మకూరు గ్రామంలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఉంది. ఎన్నికలకు ముందే ఈ భవన నిర్మాణం జరిగింది. టీడీపీ నేతల విజ్ఞాపన మేరకు గత ప్రభుత్వంలో ఈ కార్యాలయం కోసం మూడున్నర ఎకరాల వాగు పోరంబోకు స్థలాన్ని కేబినెట్‌ కేటాయించింది. 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన ఈ స్థలాన్ని మంజూరు చేసింది. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఆ ప్రాంతాన్ని చదును చేసుకొని..భవన నిర్మాణం పూర్తి చేసుకొన్నారు.

ఆక్రమిత స్థలం కావడంతో….

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే ఈ కార్యాలయం నుంచి టీడీపీ రాష్ట్ర వ్యవహారాలు మొదలయ్యాయి. అప్పటి దాకా టీడీపీ రాష్ట్ర కార్యాలయం గుంటూరు నగరంలోని జిల్లా పార్టీ ఆఫీస్‌ కొనసాగింది. ఇప్పుడు ఈ రెండు కార్యాలయాలపై జ‌గ‌న్ క‌న్నెర్ర చేశారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా లేకపోవటంతో కార్యాలయం తొలగింపుపై కసరత్తు ప్రారంభించారని, ఆక్రమిత స్థలంగా పేర్కొని.. దానిని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ ప‌రిణామం టీడీపీలో తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. విశేషం ఏంటంటే.. ఇప్పటి వ‌ర‌కు జ‌గ‌న్ తీసుకున్న అనేక నిర్ణయాలు, ప్రక‌ట‌న‌ల‌పై కోర్టుల‌కు వెళ్లి.. అంతో ఇంతో ఉప‌శ‌మ‌నం పొందిన టీడీపీ ఈ విష‌యంలో కూడా వెళ్లే అవ‌కాశం ఉందా? అంటే లేద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

అద్దె చెల్లింపు ప్రాతిపదికన….

దీనికి ప్రధాన కార‌ణం.. మున్సిపాలిటీకి చెందిన సుమారు రెండు వేల గజాల స్థలాన్ని ఆనాడు 30 ఏళ్లకు లీజు ప్రాతిపదికన తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో దీనిని క్రమబద్ధీకరించుకొనే అవకాశం ఉన్నప్పటికీ మున్సిపాలిటీకి అద్దె చెల్లించే విధానంతోనే నడిపించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ.25 వేలు అద్దె చెల్లిస్తున్నారు. దీంతో దీనిపై టీడీపీకి పెద్దగా హ‌క్కులు ఏమీ సంక్రమించ‌లేదు. సో.. దీనిపై కోర్టుకు వెళ్లే ఛాన్స్ కూడా లేద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. మ‌రి ఈ క్రమంలో ప్రభుత్వ దూకుడును ఎలా అడ్డుకుంటారో.. పార్టీ కార్యాల‌యాన్ని ఎలా కాపాడుకుంటారో.. అనేది ఆస‌క్తిగా మారింది.

Tags:    

Similar News