కాంగ్రెస్ జట్టులోకి చంద్రబాబు ?

ఇదంతా రాజకీయం. ఏదైనా జరగవచ్చు. అందువల్ల కాంగ్రెస్ తో చంద్రబాబు మళ్ళీ కలుస్తారు అంటే ఎవరూ ఆశ్చర్యపడనవసరంలేదు. బాబుకు ఇప్పటికిపుడు బయటపడకపోయినా సరైన సమయంలో సరైన నిర్ణయం [more]

Update: 2020-08-18 14:30 GMT

ఇదంతా రాజకీయం. ఏదైనా జరగవచ్చు. అందువల్ల కాంగ్రెస్ తో చంద్రబాబు మళ్ళీ కలుస్తారు అంటే ఎవరూ ఆశ్చర్యపడనవసరంలేదు. బాబుకు ఇప్పటికిపుడు బయటపడకపోయినా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయ విశ్లేషణ. ఎందువల్ల అంటే జాతీయ స్థాయిలో రెండే పార్టీలు. బీజేపీతో చంద్రబాబు ఎంత కలవాలనుకున్నా కుదరడంలేదు, పైగా 2024 అంటే ఇంకా నాలుగేళ్ళు ఉంది. అప్పటికి ఎన్ని పరిణామాలు మారుతాయో ఎవరికి తెలుసు. ఇక చంద్రబాబు ఏపీలో విపక్షానికి పడిపోయీనా జాతీయ పరిణామాలను కూడా ఎప్పటికపుడు మదింపు చేసుకుంటున్నారు. మోడీ గ్రాఫ్ ఏంటి, బీజేపీ సీన్ ఏంటి అన్నది చంద్రబాబు లాంటి రాజకీయ చాణక్యుడికి తెలియనిది కాదు.

లాస్ట్ పంచ్ …..

చంద్రబాబు మరో మూడేళ్ల పాటు ఇలాగే మోడీ భజన చేస్తూనే కాలం వెళ్లదీస్తారు. ఎందుకూ అంటే అది ఆయన రాజకీయ అవసరం కాబట్టి . కేంద్రంలో మోడీ బలంగా ఉన్నారు. చేతిలో అధికారం మరో నాలుగేళ్ళు ఉంది. పైగా చంద్రబాబుకు కేసుల బాధ ఉంది. ఆయన ఇప్పటికీ ఏ తప్పూ చేయలేదని, ఎక్కడా దొరకలేదని అభిమానులు అనుకోవచ్చు. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు. అందువల్ల వెతికి పట్టుకోవాలనుకుంటే ఎక్కడైనా దొరుకుతారు. ఏ పదవీ లేకుండానే జగన్ మీద సీబీఐని బనాయించి 16 నెలలు జైల్లో పెట్టిన రాజకీయం ఉన్న దేశం ఇది. అందుకే గండరగండడు చంద్రబాబు ఎక్కడా బయటపడడంలేదు. కనీసం కలలో కూడా కాంగ్రెస్ కి కరచాలనం చేయకుండా వ్యూహాత్మకమైన దూరం పాటిస్తున్నారు.

కాంగ్రెస్ లెక్కల్లో…..

అయితే చంద్రబాబు కాంగ్రెస్ తో జట్టు కడతారు అన్నది కాంగ్రెస్ లెక్కల్లో పక్కాగా ఉంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ తన అధికారం పోకుండా కాపాడుకుంది. ఇపుడున్న పరిస్థితుల్లో బీజేపీ గద్దలా కబళించాలని అంతా స్కెచ్ వేసిన నేపధ్యంలో కుర్చీని కాంగ్రెస్ కాపాడుకుంది అంటే ఇది ఘనవిజయమేనని అంటున్నారు. దీని వెనక ఎవరు ఉన్నారని కాదు కానీ కాంగ్రెస్ బీజేపీ వ్యూహాన్ని ఈ విధంగా చావు చెబ్బతీసింది. మధ్యప్రదేశ్, కర్ణాటక అనుభవాలతో రాటుతేలిదనుకోవాలి. ఈ దెబ్బతో కాంగ్రెస్ కి ఎక్కడలేని ఆత్మవిశ్వాసం కూడా వచ్చిందట. దాంతో 2024 నాటి ఎన్నికల కోసం లెక్కలేసుకుంటోంది. అలా తమతో కలసి వచ్చేవారిలో చంద్రబాబును కూడా ఏపీ నుంచి చేర్చిందని హస్తిన వర్గాల టాక్.

మోడీని దించాలనే……

నిజానికి మోడీ ఇపుడు మీడియా పరంగా బలమైన నేతగా ఉన్నారు కానీ ఆయన గ్రాఫ్ బాగా తగ్గుతోంది. కరోనాను కట్టడి చేయలేక చేతులెత్తేసిన నాడే మోడీ అంటే దేశానికి మోజు తగ్గింది. ఇక ఆత్మ నిర్భర్ భారత్ అంటూ 20 లక్షల కోట్ల రూపాయల భారీ లెక్కలు చెప్పిన మోడీ చివరికి తుస్సు మనిపించిన నాడే జనాలు మండిపోయారు. రేపటి రోజున కరోనా తగ్గినా పోయినా కూడా ఆ ప్రభావంతో దేశ ఆర్ధిక వ్యవస్థ 1947 నాటి స్థాయికి దిగజారుతుందని ఆర్ధిక వేత్తలు అంచనా వేస్తున్నారు. రాబోయే కాలమంతా ఆకలి, పేదరికం, నిరుద్యోగంతో దేశం అల్లాడుతుంది. పాపాల భైరవుడిగా కళ్ళ ఎదుట మోడీయే కనిపిస్తారు. దాంతో దేశంలో రాజకీయ మార్పునకు అదే బీజం అవుతుందని కూడా ఊహిస్తున్నారు.

రేసులో కాంగ్రెస్…..

ఇక కాంగ్రెస్ కి మళ్ళీ ఉత్తరాదిన పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ తో పాటు, ఈసారి ఉత్తరప్రదేశ్ కూడా ఆశాజనకంగా ఉంటుందిట. ఇక బెంగాల్లో మమత గెలిచినా కూడా తమకే మంచిదని కాంగ్రెస్ ఆలోచన. సౌత్ లో చూస్తే బీజేపీకి ఉన్న ఒక్క కర్నాటక కూడా పోతుందని, అక్కడ ఆ పార్టీకి ఎంపీ సీట్లు పెద్దగా వచ్చే ఛాన్స్ లేదని కాంగ్రెస్ లెక్కలు కడుతోంది. ఈ నేపధ్యంలో ఏపీ నుంచి చంద్రబాబు మిత్రుడిగా పొత్తు పెట్టుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలో ఊపేయాలని కాంగ్రెస్ నయా పొలిటికల్ అజెండాగా ఉందిట. అంటే చంద్రబాబు హస్తవాసి ఈసారి బాగానే ఉంటుందని ఢిల్లీ కాంగ్రెస్ గట్టిగానే నమ్ముతోందన్నమాట.

Tags:    

Similar News