నలబై ఏళ్ల క్రితం సీన్ రిపీట్ అవుతుందా?

చంద్రబాబుకు అధికారం యావ ఎక్కువ. మాట్లాడితే తాను ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అంటారు. అంతా తనను, తన సీనియారిటీని గుర్తించాలని గట్టిగా కోరుకుంటారు. అదే సమయంలో ఆయన [more]

Update: 2020-07-30 12:30 GMT

చంద్రబాబుకు అధికారం యావ ఎక్కువ. మాట్లాడితే తాను ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అంటారు. అంతా తనను, తన సీనియారిటీని గుర్తించాలని గట్టిగా కోరుకుంటారు. అదే సమయంలో ఆయన విరహం వేరుగా ఉంటుంది. పదవి లేకపోతే అసలు వేగలేరని కూడా అంటారు. చంద్రబాబు మొత్తం రాజ‌కీయ జీవితం తీసుకుంటే 2019 ఎన్నికలు ఒక పీడకలగా చెప్పుకోవాలి. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు వచ్చాయి. లేకపోతే బాబు కూడా మైక్ కోసం స్పీకర్ ని అడగాల్సిన దుస్థితి వచ్చేది. సరే బతికాం, అయిదేళ్ల పాటు ఈ క్యాబినేట్ ర్యాంక్ హోదాలో బండి లాగించవచ్చు అని చంద్రబాబు సంతోషిస్తున్న వేళ ఆయన కుర్చీ కిందకు నీళ్ళు తెప్పించేలా జగన్ కొత్త ఎత్తులు వేస్తున్నారు.

ముగ్గురుట ….

ఇపుడు అదే దూకుడు రాజకీయానికి వైసీపీ తెరతీసిందని అంటున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ ప్రవేశం అందులో భాగమేనని అంటున్నారు. గంటా తాను ఒక్కడూ కాకుండా మరో ఇద్దరిని వెంటబెట్టుకుని వస్తున్నారు అంటున్నారు. ఈ ముగ్గురూ ఉత్తరాంధ్రాకు చెందినవారే కావడం విశేషం. విశాఖలో కాపురం ఉంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా వైసీపీ నీడకు చేరుతారని వినిపిస్తోంది. అదే విధంగా విశాఖ సిటీలో గంటాతో పాటు గెలిచిన మరో ముగ్గురిలో కనీసం ఒక్క ఎమ్మెల్యే అయినా ఆయనతో కలసి వైసీపీలో చేరుతారని చెబుతున్నారు.

ఊడిపోయినట్లే ….

వీరంతా కూడా మంచి రోజు చూసుకుని జగన్ పార్టీలో చేరుతారని అంటున్నారు. ఆగస్ట్ 15న గంటా వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని అనధికార సమాచారం. ఆయనతో పాటే వీరు కూడా చేరుతారా ముందు వెనకల్లో వస్తారా అన్నది ఒక చర్చగా ఉంది. ఏది ఏమైనా గంటా వంటి పొలిటికల్ జెయింట్ సైకిల్ దిగి వైసీపీ వైపు వచ్చారంటే కనీసంగా అరడజన్ మంది ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా ఆయన బాట నడుస్తారని కూడా అంటున్నారు. మొదటి నుంచి గంటాకు తన బలం చూపించి దానికి తగిన విధంగా రాజకీయ బేరమాడడం అలవాటు. ఇపుడు వైసీపీలో కూడా గంటా హవా మొదలవాలంటే ఆయన పెద్ద ఎత్తున టీడీపీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని వస్తేనే సాకారం అవుతుంది. ఆ దిశగా గంటా ఇపుడు బిజీగా ఉన్నారని అంటున్నారు.

గట్టి దెబ్బ…..

టీడీపీని జగన్ కొడుతున్న దెబ్బలు ఇన్నీ అన్నీ కావు, రాజకీయంగా, సామాజికవర్గంపరంగా, ఆర్ధికంగా దెబ్బ తీస్తూనే ఉన్నారు. ఇపుడు చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయ్యేలా ఆయన ప్రతిపక్ష కుర్చీకే ఎసరు పెట్టడం ద్వారా నాలుగున్నర దశాబ్దాల క్రితం నాటి చంద్రబాబుని చేయాలన్నది జగన్ ఎత్తుగడగా ఉంది. 1978లో బాబు కాంగ్రెస్ తరఫున కేవలం అయిదు వేల ఓట్లతో చంద్రగిరి నుంచి తొలిసారి గెలిచారు. నాడు బాబు వైపు ఎవరూ లేరు, సింగిల్ గానే అసెంబ్లీలో బిక్కుబిక్కుమని ప్రవేశించారు. తరువాత కాలంలో చంద్రబాబు ఇంత పెద్ద సైన్యాన్ని సంపాదించుకున్నారు. ఇపుడు జగన్ బాబుకు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ సినిమా చూపించాలలనుకుంటున్నారుట. అదే జరిగితే మాత్రం బాబు అసలు తట్టుకోలేరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇంత లేటు వయసులో బాబుకు ఈ దెబ్బకు గుండెల మీద సమ్మెట్లుగానే ఉంటాయని అంటున్నారు.

Tags:    

Similar News