బాబుకు పొరుగు వ్యూహాలు అచ్చిరావా ?

చంద్రబాబు స్వతహాగా మంచి వ్యూహకర్త. ఆయన కళాశాల రోజుల నుంచే రాజకీయాల్లో బాగా పండిపోయారు. ఒక ఓటు విలువ ఏంటో బాబు కంటే లెక్క కట్టి గీటు [more]

Update: 2021-01-23 14:30 GMT

చంద్రబాబు స్వతహాగా మంచి వ్యూహకర్త. ఆయన కళాశాల రోజుల నుంచే రాజకీయాల్లో బాగా పండిపోయారు. ఒక ఓటు విలువ ఏంటో బాబు కంటే లెక్క కట్టి గీటు గీసే రాజకీయ‌ షరాబు ఎవరూ లేరు. అటువంటి చంద్రబాబుకు రాజకీయ సలహాదారులు అవసరమా అన్న ప్రశ్న సొంత పార్టీలోనే ఉంది. ఏపీలో ప్రశాంత్ కిషోర్ అనే ఒక రాజకీయ వ్యూహకర్తను వైసీపీ 2017లో నియమించుకున్నపుడు టీడీపీ ఎన్నో సెటైర్లు వేసింది. మాకు బాబు ఒక్కరే చాలు అంటూ గట్టిగా చెప్పుకుంది.

బేలతనమేనా..?

అయితే అధికారంలో ఉన్నపుడు దేన్ని అయితే చీదరించి చీత్కరించుకుంటారో విపక్షంలోకి మారాక మాత్రం చంద్రబాబు వాటినే మహా ప్రసాదంగా పట్టుకుని ముందుకు సాగుతారని విమర్శలు ఎపుడూ ఉన్నాయి. ఇక ఓడిన తరువాత చంద్రబాబుకు ఎన్నో ఆలోచనలు వచ్చాయి. జగన్ గెలుపు వెనక ఆయన సొంత బుర్ర కంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే కారణమని చంద్రబాబు నాడే భావించారుట. దాంతో డైరెక్ట్ గా ప్రశాంత్ కిషోర్ ని తన వద్దకు రప్పించుకోలేదు కానీ ఆయన శిష్యుడుగా ఉన్న రాబిన్ శర్మ అనే వ్యక్తిని తన పార్టీకి వ్యూహకర్తగా‌ పెట్టుకున్నారని భోగట్టా. ఇదంతా బాబులోని బేలతనానికి నిదర్శనం అన్న మాట అయితే ఉంది.

బూమరాంగ్ అయిందా…?

ఇక తిరుపతి ఉప ఎన్నికల వేళ గెలిచే వ్యూహాల కోసం ప్రశాంత్ శిష్యుడు రాబిన్ శర్మను తీసుకుంటే ఆయన ఏకంగా టీడీపీ చేతికి హిందూ కార్డు ఇచ్చాడని అంటున్నారు. దాంతోనే చంద్రబాబు రామతీర్ధాలు వెళ్లి రాజకీయ రచ్చ చేశారని కూడా సొంత పార్టీలో అంటున్నారు. ఇక అది కాస్తా బూమరాంగ్ కావడమే కాకుండా ఇపుడు క్రిస్టియన్లు టీడీపీ మీద గుర్రుగా ఉన్నారు. ఇక వారిలో కొందరు తిరుగుబాటు చేస్తే ముస్లిం మైనారిటీలు కూడా బీజేపీ టూ గా టీడీపీని ఇపుడు చూస్తున్నారుట. మొత్తానిక్ పీకే శిష్యుడని చేరదీస్తే తొలి వ్యూహమే ఎదురు తన్నిందని పార్టీలో లేటెస్ట్ టాక్.

బాబే బెటరా…?

నిజానికి ఏపీ రాజకీయాలను మొత్తం ఔపాసన పట్టిన చంద్రబాబు కంటే మంచి వ్యూహకర్త ఎవరూ లేరు అన్నది టీడీపీలోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ వినిపించే మాట. అయితే చంద్రబాబులో ఒక్కసారిగా ఆరాటం, ఆతృత పెరిగిపోయాయి. అలాగే అధికారం పోయిన బాధతో కూడిన అసహనం, దారుణమైన ఓటమితో అవమానం ఇవన్నీ కలసి ఆయన్ని స్థిమితం లేకుండా చేస్తున్నాయి అంటున్నారు. దీంతో చంద్రబాబు సలహాల కోసమే ఇతరుల మీద ఇపుడు బాగా ఆధారపడుతున్నారని అంటున్నారు. దాంతో టీడీపీ చరిత్రలో లేని ఎన్నో తప్పులు పొరపాట్లు కూడా జరుగుతున్నాయని పార్టీలోని హితైషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రశాంతంగా ఆలోచనలు చేస్తే టీడీపీ నావను ఏదో ఒకలా ఒడ్డున పడేయగలరని తమ్ముళ్ళు అంటున్నారు

Tags:    

Similar News